India Cricket Team: ప్రాక్టీస్.. ప్రాక్టీస్
ABN , Publish Date - Jun 28 , 2025 | 05:02 AM
తొలి టెస్టులో ఓడిన భారత క్రికెట్ జట్టు ఇప్పుడిక తదుపరి మ్యాచ్పై దృష్టి సారించింది. రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకున్న గిల్ సేన శుక్రవారం తమ సన్నాహకాలను ఆరంభించింది.
నెట్స్లో చెమటోడ్చిన టీమిండియా
బర్మింగ్హామ్: తొలి టెస్టులో ఓడిన భారత క్రికెట్ జట్టు ఇప్పుడిక తదుపరి మ్యాచ్పై దృష్టి సారించింది. రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకున్న గిల్ సేన శుక్రవారం తమ సన్నాహకాలను ఆరంభించింది. వచ్చే నెల 2 నుంచి ఎడ్జ్బాస్టన్ మైదానంలో ఇంగ్లండ్తో జరిగే ఈ రెండో టెస్టు కోసం ఆటగాళ్లంతా నెట్స్లో చెమటోడ్చారు. అయితే తొలి టెస్టులో ఎనిమిది క్యాచ్లను వదిలేసిన నేపథ్యంలో ఫీల్డింగ్ ప్రాక్టీస్పై దృష్టి సారించారు. క్యాచింగ్, నేరుగా విసిరిన త్రోలతో డ్రిల్స్ జరిగాయి. ఆ తర్వాత బౌలింగ్ సాధన సాగింది. అయితే పేసర్లు బుమ్రా, ప్రసిద్ధ్ క్రిష్ణ దీనికి దూరంగా ఉన్నారు. అటు సిరాజ్ అసిస్టెంట్ కోచ్ రియాన్ టెన్ డస్కటే ఆధ్వర్యంలో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. ముఖ్యంగా అతడి చేత షార్ట్ పిచ్ బంతులను కోచ్ ఆడించాడు. అనంతరం ఈ ముగ్గురు పేసర్లు కలిసి రన్నింగ్, ఫిట్నెస్ డ్రిల్లో పాల్గొన్నారే తప్ప బౌలింగ్ మాత్రం చేయలేదు. రెండో టెస్టులో బుమ్రాకు విశ్రాంతి ఇవ్వనున్నట్టు కథనాలు వినిపిస్తున్నాయి.
స్పిన్నర్లు జోరుగా..
హెడింగ్లీ పిచ్కన్నా ఎడ్జ్బాస్టన్లో వికెట్ స్పిన్కు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. దీంతో స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, జడేజా గంటపాటు బౌలింగ్ సాధన చేశారు. చక్కటి టర్న్ను రాబట్టి పంత్ను బ్యాటింగ్లో ఇబ్బందిపెట్టారు. తొలి టెస్టులోనే కుల్దీ్పను ఆడిస్తే ఫలితం ఉండేదని ఇప్పటికే విశ్లేషకులు కామెంట్స్ చేశారు. ఇక పేసర్ల విషయానికి వస్తే అర్ష్దీప్, ఆకాశ్ దీప్లతో పాటు ఆల్రౌండర్లు శార్దూల్, నితీశ్ కూడా నెట్స్లో బౌలింగ్ ప్రాక్టీస్ చేశారు. ఒకవేళ బుమ్రాకు విశ్రాంతినిస్తే అర్ష్దీప్, ఆకాశ్లలో ఒకరికి చాన్స్ దక్కవచ్చు. ఈ జోడీతో కొత్త, పాత బంతులతో సైతం ప్రాక్టీస్ చేయించారు. ఇక శనివారం జట్టుకు ఆప్షనల్ ప్రాక్టీస్ కావడంతో సీనియర్ త్రయం నెట్స్లో గడుపుతారా? లేక విశ్రాంతి తీసుకుంటారో? చూడాల్సిందే.
సిరాజ్పైనే భారం
ఇంగ్లండ్తో తొలి టెస్టులో ఓడినప్పటికీ.. స్టార్ పేసర్ బుమ్రాకు పని ఒత్తిడిలో భాగంగా భారత జట్టు విశ్రాంతి ఇవ్వాలనుకుంటోంది. అయితే ఈ నిర్ణయం జట్టు బౌలింగ్పై పెను ప్రభావమే పడనుంది. తొలి టెస్టులో బుమ్రాకు మద్దతుగా ఇతర పేసర్లు ఏమాత్రం అండగా నిలవలేకపోయారు. ఈనేపథ్యంలో బౌలింగ్ భారాన్ని పేసర్ మహ్మద్ సిరాజ్ మోయాల్సి వస్తుంది. అలాగే ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో సిరాజ్ ధారాళంగా పరుగులిచ్చి వికెట్ కూడా తీయలేకపోయాడు. అటు మిగతా ఇద్దరు పేసర్లు ప్రసిద్ధ్, శార్దూల్ కలిపి ఆడింది 16 టెస్టులే. అలాగే ఓవర్కు ఆరు పరుగులిచ్చుకోవడంతో వారు వికెట్లు తీసినా ఫలితం లేకపోయింది. ప్రసిద్ధ్ మొత్తంగా ఐదు వికెట్లు తీసినా.. అతడి నుంచి మేనేజ్మెంట్ ఫుల్లర్ లెంగ్త్ బంతులను ఆశించింది. కానీ తను మాత్రం నిలకడగా అలాంటి బంతులను వేయలేకపోయాడు. ఏదిఏమైనా బుమ్రా లేని భారత బౌలింగ్ దళం ఇంగ్లండ్ బ్యాటర్లను కట్టడి చేయాలంటే స్థాయికి మించిన ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. మరోవైపు బర్మింగ్హామ్లో టీమిండియాకు ఇప్పటిదాకా టెస్టు విజయమే లేకపోవడం గమనార్హం.