114 ఏళ్ల మారథాన్ రన్నర్ ఫౌజా సింగ్ మృతి
ABN , Publish Date - Jul 16 , 2025 | 03:34 AM
114 ఏళ్ల మారథాన్ రన్నర్ ఫౌజా సింగ్ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. సోమవారం ఉదయం జలంధర్కు సమీపంలోని తన స్వగ్రామంలో వాకింగ్ కోసం బయటకు వెళ్లినప్పుడు గుర్తు తెలియని...
స్వగ్రామంలో రోడ్డు ప్రమాదం
చికిత్సపొందుతూ కన్నుమూత
చండీగఢ్: 114 ఏళ్ల మారథాన్ రన్నర్ ఫౌజా సింగ్ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. సోమవారం ఉదయం జలంధర్కు సమీపంలోని తన స్వగ్రామంలో వాకింగ్ కోసం బయటకు వెళ్లినప్పుడు గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టిందని, తీవ్ర గాయాలైన ఫౌజా సింగ్ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడని పోలీసులు చెప్పారు. నిర్లక్ష్యంగా వాహనాన్ని నడపడంతోపాటు ఒకరి మృతికి కారణమైన డ్రైవర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, తెల్లవారుజామున 3.30 గంటలకు రోడ్డు దాటుతుండగా ఎస్యూవీ కారు ఢీ కొట్టిందని కొందరు స్థానికులు చెబుతున్నారు.
ఆ వయసులో పరిగెత్తడం మొదలుపెట్టి..
1911లో రైతు కుటుంబంలో జన్మించిన ఫౌజా సింగ్.. నలుగురు సంతానంలో ఆఖరివాడు. భార్య, చిన్న కొడుకు, కుమార్తె మరణంతో కుంగిపోయిన ఫౌజాను మరో కొడుకు 90వ దశకంలో లండన్ తీసుకెళ్లాడు. తన బాధను మరవడానికి రన్నింగ్ను ఎంచుకొన్న ఫౌజా .. అందులోనే గుర్తింపు సాధించాడు. 88 ఏళ్ల వయస్సు న్నప్పుడు ఓ స్వచ్ఛంద సంస్థ కోసం మారథాన్ రేస్లో పరుగెత్తాడు. ఆ తర్వాత అనేక అంతర్జాతీయ ఈవెంట్లలో పాల్గొని పలు రికార్డులు నెలకొల్పాడు. మారథాన్ రేసును పూర్తి చేసిన శతాధికుడిగా ఖ్యాతికెక్కాడు. 2012 లండన్ ఒలింపిక్స్లో టార్చ్ బేరర్గా వ్యవహరించాడు. క్వీన్ ఎలిజబెత్ నుంచి సన్మానాన్ని అందుకొన్నాడు. మూడేళ్ల క్రితమే లండన్ నుంచి సొంతూరుకు తిరిగొచ్చిన సింగ్.. ఇప్పుడిలా రోడ్డు ప్రమాదంలో మరణించడం అందరినీ కలచివేస్తోంది.
యువతకు స్ఫూర్తి: మోదీ
ఫౌజా సింగ్ మృతికి ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ‘ఫౌజా అద్భుతమైన, భిన్నమైన వ్యక్తి. ఫిట్నెస్ విషయంలో యువతకు ఆయన స్ఫూర్తిగా నిలిచారు. అలాంటి వ్యక్తి మృతి చెందడం బాధాకరమ’ని ఎక్స్లో మోదీ పోస్టు చేశారు.
ఇవీ చదవండి:
లార్డ్స్ బాల్కనీలో గంగూలీ సంబరాలు.. జోఫ్రా ఆర్చర్కు ఎలా స్ఫూర్తినిచ్చాయంటే..
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి