ఐపీఎల్కు ఫిక్సింగ్ బెడద?
ABN , Publish Date - Apr 17 , 2025 | 03:17 AM
ఈ సీజన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మ్యాచ్లన్నీ రంజుగా సాగుతున్నాయి. క్రికెట్ అభిమానులంతా ఉత్సుకతో జట్ల మధ్య పోరును ఆస్వాదిస్తున్నారు. ఇలా సజావుగా సాగిపోతున్న...
జాగ్రత్తగా ఉండాలని ఫ్రాంచైజీలకు హెచ్చరిక
క్రికెటర్లు, కోచ్లు, వ్యాఖ్యాతలకూ సూచన
హైదరాబాద్ వ్యాపారిపై బీసీసీఐ అనుమానం
న్యూఢిల్లీ: ఈ సీజన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మ్యాచ్లన్నీ రంజుగా సాగుతున్నాయి. క్రికెట్ అభిమానులంతా ఉత్సుకతో జట్ల మధ్య పోరును ఆస్వాదిస్తున్నారు. ఇలా సజావుగా సాగిపోతున్న ఈ లీగ్లో ఇప్పుడు భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) జారీ చేసిన హెచ్చరిక షాక్కు గురి చేస్తోంది. ఐపీఎల్కు ఫిక్సింగ్ ప్రమాదం పొంచి ఉందంటూ సదరు ఫ్రాంచైజీలకు బీసీసీఐ సమాచారమిచ్చిందన్న వార్త సంచలనం రేపుతోంది. జాతీయ మీడియా కథనం ప్రకారం.. హైదరాబాద్కు చెందిన ఓ బడా వ్యాపారవేత్త మ్యాచ్లను ఫిక్స్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని బీసీసీఐ అనుమానిస్తోంది. ఈమేరకు అతడు వ్యక్తులను ప్రలోభపెడుతున్నాడని, దాంతో జాగ్రత్తగా ఉండాలని పది ఐపీఎల్ ఫ్రాంచైజీల యజమానులను బీసీసీఐ లేఖ ద్వారా హెచ్చరించింది. అలాగే క్రికెటర్లు, కోచ్లు, సహాయ సిబ్బంది, వ్యాఖ్యాతలను కూడా బోర్డు అప్రమత్తం చేసింది. సదరు వ్యాపారవేత్తకు బుకీలతో సంబంధాలున్నట్టు బీసీసీఐ అవినీతి వ్యతిరేక, భద్రతా విభాగం (ఏసీఎ్సయూ) గుర్తించింది. గతంలో బెట్టింగ్లు, మ్యాచ్ ఫిక్సింగ్లు చేసిన అనుభవం ఉన్న ఆ వ్యాపారవేత్త.. ఈమారు ఐపీఎల్ జట్లు బస చేస్తున్న హోటళ్లలో, మ్యాచ్లు జరిగే స్టేడియాల్లో కనిపించాడని ఫ్రాంచైజీలకు రాసిన లేఖలో పేర్కొంది. అయితే, అతను ఎవరన్నది మాత్రం ఆ లేఖలో బహిర్గతం చేయలేదని సమాచారం.
సోషల్ మీడియా ద్వారా..: సోషల్ మీడియా ద్వారా అతను ఆటగాళ్లకు చేరువయ్యే ప్రమాదం లేకపోలేదని హెచ్చరించింది. ఒకవేళ అతను ఇప్పటికే ఎవరినైనా సంప్రదించి ఉంటే తమకు సమాచారమివ్వాలని సూచించింది. ముఖ్యంగా యువ ఆటగాళ్లు బుకీల వలలో పడి బంగారం లాంటి భవిష్యత్ను పాడు చేసుకోవద్దని హితవు పలికింది.
గతంలోనూ..: ఐపీఎల్లో ఫిక్సింగ్ వార్తలు గతంలోనూ కలకలం రేపాయి. 2013లో రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు శ్రీశాంత్, అజిత్ చండీలా, అంకిత్ చవాన్ ఫిక్సింగ్ ఆరోపణలతో ఏకంగా అరెస్టవడం అప్పట్లో సంచలనం సృష్టించింది. అంతేకాదు.. బుకీలతో సంబంధాలున్నాయన్న కారణంగా చెన్నై సూపర్కింగ్స్ యజమాని గురు మేయప్పన్, రాజస్థాన్ రాయల్స్ సహ యజమాని రాజ్కుంద్రాపై వేటు కూడా పడింది. ఈ సంఘటనల తర్వాత అవినీతి నిరోధక విభాగాన్ని బీసీసీఐ మరింత బలోపేతం చేసింది. ఆటగాళ్లకు కఠిన నిబంధనలను విధించింది.
గిఫ్ట్లు, పార్టీలంటూ...: ఐపీఎల్తో సంబంధం ఉన్న వ్యక్తులతో ఆ వ్యాపారవేత్త సన్నిహితంగా ఉండేందుకు కొంతకాలంగా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం సేకరించింది. తన వ్యూహాలను అమలు చేసేందుకు హోటల్ సిబ్బందితో పాటు జట్టు సిబ్బందిని కూడా ప్రలోభపెడుతుంటాడని పేర్కొంది. అభిమానినని పరిచయం చేసుకొంటూ ఖరీదైన బహుమతులు అందజేయడం, ఫైవ్స్టార్ హోటళ్లలో పార్టీలకు తీసుకెళ్లడం అతడి నైజమని తెలిపింది. ఐపీఎల్ జట్ల యజమానుల కుటుంబ సభ్యులు, క్రికెటర్లు, కోచ్లు, సహాయ సిబ్బందితోపాటు కామెంటేటర్లను సంప్రదించడం ఆ వ్యాపారి బెట్టింగ్ వ్యూహంలో ఒక భాగం అని వెల్లడించింది.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..