Shankara Nethralaya USA: శాంతా బయోటెక్ వరప్రసాద్ రెడ్డితో శంకర నేత్రాలయ యుఎస్ఏ ఆత్మీయ సమావేశం
ABN , Publish Date - May 05 , 2025 | 03:52 PM
మార్చి30న శంకర నేత్రాలయ యూఎస్ఏ ఆధ్వర్యంలో అట్లాంటా మహానగరంలో భారతీయ పారిశ్రామికవేత్త, శాస్త్రవేత్త, శాంతా బయోటెక్ వ్యవస్థాపక చైర్మన్ పద్మ భూషణ్ డాక్టర్ కెఐ వరప్రసాద్ రెడ్డితో ఒక ఆత్మీయ సమావేశం జరిగింది.
యుఎస్ఏలో 1988 జూన్లో రాక్విల్, మేరీల్యాండ్లో స్థాపించిన శంకరనేత్రాలయ, ఒక అత్యుత్తమ 501(C) (3) లాభాపేక్ష లేని సంస్థ గా కార్యకలాపాలు కొనసాగిస్తోంది. దీని ఏకైక లక్ష్యం అమెరికాలో సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా నిధులను సేకరించి భారతదేశంలోని శంకర నేత్రాలయ (చెన్నై) సంస్థ సేవా కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడం. శంకర నేత్రాలయ సంస్థ సలభై ఏడేండ్ల క్రితం అప్పటి కంచి కామకోటి పీఠాధిపతి పిలుపుతో, డా. ఎస్ఎస్ బద్రీనాథ్ ఆధ్వర్యంలో స్థాపన జరిగి, భారత ఉపఖండంలో నిరుపేద రోగులకు అంతర్జాతీయ ప్రమాణాలైన ఉచిత కంటి చికిత్సలతో చూపును అందించడానికి అంకితభావంతో పనిచేస్తున్న సమగ్రనేత్ర సంరక్షణ కేంద్రం.
మార్చి30న అట్లాంటా మహానగరంలో భారతీయ పారిశ్రామికవేత్త, శాస్త్రవేత్త, శాంతా బయోటెక్ వ్యవస్థాపక చైర్మన్ పద్మ భూషణ్ డాక్టర్ కెఐ వరప్రసాద్ రెడ్డితో ఒక ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశం శంకర నేత్రాలయ యుఎస్సే అధ్యక్షడు శ్రీబాలారెడ్డి ఇందుర్తి ఆధ్వర్యంలో, కోశాధికారి శ్రీ మూర్తి రేకపల్లి, పాలకమండలి సభ్యులు శ్రీని వంగిమళ్ళ, ఉపేంద్ర రాచుపల్లి, నీలిమ గడ్డమణుగు, డా. కిషోర్ రసమల్లు, రాజేష్ తడికమల్లల మధ్య, సుమధుర సంగీత, సాహిత్య, నృత్య సమ్మేళనాల సాక్షిగా ఒక అపూర్వ సంగమం అని చెప్పుకోవచ్చు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ వరప్రసాద్ రెడ్డి శంకరనేత్రాలయ యుఎస్ఏ సంస్థ ఎదుగుదల, వేగవంతంగా నిర్వహిస్తున్న మేసు (MESU) కార్యక్రమాలను అభినందిస్తూ, తనవంతుగా రూ. 25 లక్షల విరాళాన్ని ప్రకటించారు. ఇది ఆయన గత విరాళం రూ. 25 లక్షలకు తోడు, మొత్తం రూ. 50 లక్షలు శంకర నేత్రాలయ యుఎస్ఏకు అందించారని, ఈ విరాళం ఐదు MESU ‘అడాప్ట్ ఏ విలేజ్’ కంటి చికిత్సా శిబిరాలకు సమానమైన సహాయం అని అద్యక్షుడు బాలారెడ్డి ఇందుర్తి కొనియాడారు. అంతేకాకుండా, 2026లో నెల్లూరులో మరో భారీ కంటి చికిత్స శిబిరాన్ని నిర్వహించడానికి డా. వరప్రసాద్ రెడ్డి తమ అంకితభావాన్ని ప్రకటించడం ఆనందదాయకం.

తన యూఎస్ఏ ప్రయాణంలోని ఒక భాగంగా, డాక్టర్ వరప్రసాద్ రెడ్డి డాలస్ను కూడా సందర్శించారు. ఆయన మిత్రుడు ప్రకాశ్ బేడపూడి — CTO మరియు EVP, Lennox International (బిలియన్-డాలర్ పబ్లిక్ కంపెనీ) ఆహ్వానం మేరకు ప్రకాశ్ తమ స్వగృహంలో 15 మంది స్నేహితులతో ఇంకొక ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. శ్రీ వరప్రసాద్రెడ్డి జీవిత సత్యాలు, సందేశాలు, వారు ప్రసాదించిన సంగీత ‘వీనుల విందుల”మధ్య, ఆత్మీయుల ముచ్చట్లతో నిండిన ఆ సాయంత్రం చిరస్మరణీయం. డాలస్ నివాసి, శంకర నేత్రాలయ యుఎస్ఏ పాలక మండలి సభ్యులు డా. రెడ్డి (NRU) ఊరిమిండి ఈ ఆత్మీయ సమావేశానికి హాజరయ్యి, సంస్థ లక్ష్యాలను, సేవలను పంచుకొన్నారు. ప్రకాశ్ బెడపూడి శంకరనేత్రాలయ సంస్థ సమగ్ర సేవలను అభినందిస్తూ తమ మిత్రుని గౌరవార్థం యాభై వేల డాలర్ల విరాళాన్ని ప్రకటించారు. అక్కడకు విచ్చేసిన స్నేహితులు అదనంగా మరో రెండు MESU ‘అడాప్ట్ ఏ విలేజ్’ కంటి చికిత్సా శిబిరాలకు మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఇతర విరాళాలతో కలిపి డాలస్ కార్యక్రమంలో దాదాపు లక్ష డాలర్ల వరకు విరాళాలు ప్రకటించడం సంస్థ కార్యక్రమాలకు ఉత్సాహాన్ని ఇచ్చింది. బాలరెడ్ది ఇందుర్తి డాక్టర్ వరప్రసాద్రెడ్డికి, ప్రకాశ్ బేడపూడికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రెండు ఆత్మీయ సమావేశాలు మంచి అనుభూతిని మిగిల్చాయని సంస్థ సభ్యులతో పంచుకొన్నారు.




ఇవి కూడా చదవండి:
బహ్రెయిన్లో ఘనంగా చంద్రబాబు 75వ జన్మదిన వేడుకలు
జపాన్ తెలుగు సమాఖ్య కార్యక్రమానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి
నిరాశ్రయులకు టిప్యాడ్ ఆధ్వర్యంలో ఫుడ్ డ్రైవ్