Malati Murmu: మట్టి ఇంట్లో ఉచిత బడి
ABN , Publish Date - Dec 01 , 2025 | 04:00 AM
చదివింది పన్నెండో తరగతి. అయితేనేం! తన దగ్గరున్న కొద్దిపాటి విద్యనే ఉచితంగా పంచాలనుకున్న ఒక గిరిజన మహిళ, సొంతగా ఒక బడినే నడుపుతోంది. పశ్చిమ బెంగాల్...
చదివింది పన్నెండో తరగతి. అయితేనేం! తన దగ్గరున్న కొద్దిపాటి విద్యనే ఉచితంగా పంచాలనుకున్న ఒక గిరిజన మహిళ, సొంతగా ఒక బడినే నడుపుతోంది. పశ్చిమ బెంగాల్, మారుమూల గ్రామంలోని ఆ ఉచిత బడి, దాన్ని నడుపుతున్న ఏకైక ఉపాధ్యాయురాలు మాలతి ముర్ము గురించి తెలుసుకుందాం!
జిలిన్సెరంగ్, పశ్చిమ బెంగాల్లోని ఓ గిరిజన గ్రామం. ఈ మారుమూల గ్రామాన్ని బయటి ప్రపంచంతో అనుసంధానించే రోడ్డు, రవాణా సదుపాయాలు లేవు. ఆ గిరిజనుల అవసరాలన్నిటికీ నడకే ఆధారం. గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఉన్నప్పటికీ టీచర్ల కొరత కారణంగా ఆ పాఠశాల అరకొరగానే నడుస్తూ ఉంటుంది. దాంతో పది కిలోమీటర్ల దూరంలోని మరొక బడికి నడిచి వెళ్లలేక క్రమక్రమంగా ఆ గ్రామంలోని పిల్లలందరూ బడి మానేసి, ఇళ్లకే పరిమితమైపోయారు. 2019లో కొత్తగా పెళ్లైన మాలతి, పాతిక కిలోమీటర్ల దూరంలో ఉన్న తన గ్రామం బాగ్మండి నుంచి జిలింగ్సెరంగ్కు చేరుకుంది. ఆ ఊర్లో పిల్లలు బడి చదువు మానేసి, ఇంటి పనులకే పరిమితమవడాన్ని ఆమె గమనించింది. ఆరా తీస్తే, దగ్గర్లో ఎక్కడా ఒక్క బడి కూడా లేకపోవడం, కిలోమీటర్ల దూరం నడవవలసి రావడం, రోజంతా బడికే కేటాయించడం వల్ల వంటచెరకును సేకరించే సమయం లేకపోవడం లాంటి సమస్యలన్నీ ఆమె దృష్టికొచ్చాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఆ నిరుపేద గిరిజనుల జీవనభృతి దెబ్బ తినకుండా ఉండాలంటే, వాళ్ల పిల్లలకు అదే గ్రామంలో బడిని ఏర్పాటు చేయడం అవసరమని ఆమె గ్రహించింది. అందుకు తానే ఎందుకు సంకల్పించకూడదని తనను తాను ప్రశ్నించుకుంది.
మట్టి గదులే తరగతి గదులుగా...
చదివింది పన్నెండో తరగతి. అయితేనేం.. ప్రాథమిక విద్యాబోధనకు ఆ చదువు సరిపోతుందని సర్దిచెప్పుకున్న మాలతి, మరో ఆలోచన లేకుండా పిల్లల కోసం ఇంటినే బడిగా మార్చింది. ‘హయ్యర్ సెకండరీ స్కూలు పూర్తవగానే నాకు పెళ్లి చేశారు. 2019 ఏప్రిల్లో నేనీ గ్రామానికి వచ్చాను. పిల్లలు చదువుకోడానికి ఆసక్తి కనబరచడం లేదనే విషయాన్ని ఇక్కడికొచ్చిన కొద్ది రోజుల్లోనే గ్రహించాను. ఒకవేళ కిలోమీటర్ల దూరం నడిచి బడికి వెళ్లినా, కొద్ది రోజులకే బడి మానేస్తున్నట్టు కూడా కనిపెట్టాను. ఓ పక్క పేదరికం, మరోపక్క వాళ్లకు మార్గనిర్దేశం చేసేవాళ్లు లేకపోవడం వల్ల పిల్లలు బడి పట్ల ఆసక్తి కనబరచడం లేదు. అందుకే 2020, ఫిబ్రవరిలో నేనే చదువు చెప్పడం మొదలుపెట్టాను’’ అంటూ మీడియాకు వివరిస్తోంది మాలతి. కొవిడ్ సమయంలో ప్రభుత్వం నడిపే బడులు కూడా మూతపడ్డాయి. తరగతులన్నీ ఆన్లైన్ బాట పట్టాయి. కానీ అది కుగ్రామం. ఇంటర్నెట్ సదుపాయాలు లేకపోవడంతో కాస్త చదువు కాస్తా అటకెక్కింది. ఆ సమయంలో మాలతి బడి కీలకంగా మారింది. ఆ పరిస్థితిని సద్వినియోగం చేసుకున్న మాలతి, గ్రామీణుల సహాయంతో రెండు మట్టి గదులను నిర్మించి, వాటినే తరగతి గదులుగా మార్చేసుకుని కొత్త పాఠశాలకు శ్రీకారం చుట్టింది. మాలతి శ్రమ ఫలించింది. పిల్లలు బడిలో చేరడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఏకంగా 45 మంది పిల్లలు ఆమె ఉచిత బడిలో చదువుకుంటున్నారు.
ప్రాథమిక పాఠాలు నేర్పిస్తూ...
మాలతీబాల స్కూల్ అనే పేరుతో నడుస్తున్న ఈ బడిలో మాలతి, ఇంగ్లీషు, గణితం, సైన్స్లో ప్రాథమిక పాఠాలు బోధిస్తోంది. ఎలాంటి బోధనార్హతలూ లేకపోయినా, ఎలాంటి ఉపాధ్యాయ శిక్షణా తీసుకోకపోయినా, గిరిజన బాలలను విద్యావంతులుగా తీర్చిదిద్దాలనే మాలతి సంకల్పం అభినందనీయం.