Home Remedies: ఇలా చేస్తే వెంటనే ఉపశమనం
ABN , Publish Date - Jan 23 , 2025 | 03:57 AM
పిల్లలకు, పెద్దలకు ఆకస్మికంగా చిన్న ఆరోగ్య సమస్యలు ఎదురవుతుంటాయి. అలాంటప్పుడు ఇంట్లో ఉండే వాటితోనే కొన్ని చిట్కాలు పాటించి ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
వాంతులు
చిన్న గ్లాసు నీళ్లలో నాలుగు లవంగాలు వేసి బాగా మరిగించాలి. గోరువెచ్చగా చల్లారిన తరవాత ఈ నీళ్లను వడకట్టి తాగితే వెంటనే వాంతులు ఆగిపోతాయి.
కడుపునొప్పి
స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టి రెండు చెంచాల వాము వేసి దోరగా వేయించాలి. దీనికి అరచెంచా నల్ల ఉప్పు కలిపి కొద్ది కొద్దిగా నోట్లో వేసుకుంటూ బాగా నమిలి తినాలి. పావుగంటలో కడుపు నొప్పి, అపానవాయువుల సమస్యలు తగ్గిపోతాయి. కడుపులో జీర్ణక్రియ మెరుగవుతుంది కూడా.
తలతిరగడం
రెండు చెంచాల సోంపులో ఒక చెంచా పటిక బెల్లం కలిపి తినాలి. వెంటనే శరీరంలో రక్తప్రసరణ సజావుగా జరిగి తలతిరగడం తగ్గుతుంది. తక్షణ శక్తి కూడా లభిస్తుంది.
విరేచనాలు
అరకప్పు కమ్మని పెరుగులో ఒక చెంచా మెంతులు కలుపుకొని మెల్లగా తినాలి. పది నిమిషాల్లో విరేచనాలు తగ్గిపోతాయి. ఒక చెంచా పంచదారలో రెండు చుక్కల నీళ్లు కలిపి వేడిచేస్తే వచ్చే పాకం తిన్నా కూడా మంచి ఫలితం కనిపిస్తుంది.
న్యుమోనియా
అరగ్లాసు గోరువెచ్చని నీటిలో చిటికెడు ఇంగువ కలుపుకొని తాగితే ముక్కులో శ్లేష్మం తగ్గి వెంటనే ఉపశమనం కలుగుతుంది.
పంటి నొప్పి
చిన్న అల్లం ముక్కను తొక్కు తీసి సన్నగా తురమాలి. ఈ తురుముని వేళ్లతో పిండితే రసం వస్తుంది. రోజుకు రెండుసార్లు ఒక చెంచా అల్లం రసం తీసుకుంటే పంటినొప్పి, చిగుళ్ల వాపు క్రమంగా తగ్గుతాయి. ఈ రసాన్ని కొద్దిగా వేడిచేసి దాన్ని నొప్పి ఉన్న ప్రదేశంలో రాసినా ప్రయోజనం ఉంటుంది.
గాయాలు
కూరలు తరిగేటపుడు చాకుతో వేలు కోసుకున్నా, పిల్లలు ఆడుకుంటూ దెబ్బలు తగిలించుకున్నా ఇలా ఏ చిన్న గాయమైనా వాటిపై కొద్దిగా పసుపును అద్దాలి. పసుపు యాంటీబయటిక్లా పనిచేసి గాయాన్ని త్వరగా మాన్పుతుంది.