Crispy Rava Snacks: రవ్వ చెక్కలు
ABN , Publish Date - Oct 18 , 2025 | 03:44 AM
ఇంటిల్లిపాదీ ఇష్టపడే పండుగ దీపావళి. అలాంటి పండుగ రోజున పిల్లలు, బంధుమిత్రులందరితో కలిసి ఆనందంగా ఆస్వాదించేందుకే ఈ రుచులు...
ఇంటిల్లిపాదీ ఇష్టపడే పండుగ దీపావళి. అలాంటి పండుగ రోజున పిల్లలు, బంధుమిత్రులందరితో కలిసి ఆనందంగా ఆస్వాదించేందుకే ఈ రుచులు...
కావాల్సిన పదార్థాలు
బొంబాయి రవ్వ - ఒక కప్పు, బియ్యప్పిండి - పావు కప్పు, పెసరపప్పు- రెండు చెంచాలు, సగ్గుబియ్యం- రెండు చెంచాలు, నువ్వులు- రెండు చెంచాలు, నీళ్లు- ఒకటిన్నర కప్పులు, ఉప్పు- అర చెంచా, కారం- ముప్పావు చెంచా, పసుపు- పావు చెంచా, వెన్న- ఒక చెంచా, జీలకర్ర- ఒక చెంచా, కరివేపాకు- కొద్దిగా, నూనె- డీప్ ఫ్రైకి సరిపడేంత.
తయారీ విధానం
పెసరపప్పు, సగ్గుబియ్యాన్ని విడివిడిగా గిన్నెల్లోకి తీసుకొని, నిండా నీళ్లు పోసి అరగంటసేపు నానబెట్టాలి.
స్టవ్ మీద వెడల్పాటి గిన్నె పెట్టి అందులో నీళ్లు పోయాలి. ఆపైన ఉప్పు, కారం, పసుపు, వెన్న, జీలకర్ర వేసి నీళ్లను బాగా మరిగించాలి. తరువాత అందులో ఒక చేత్తో బొంబాయిరవ్వ పోస్తూ మరో చేత్తో పట్టుకున్న గరిటెతో నీళ్లను కదుపుతూ ఉండాలి. రవ్వ మెత్తగా ఉడికి దగ్గరకు వచ్చాక స్టవ్ మీద నుంచి దించి మూతపెట్టి చల్లారనివ్వాలి. తరువాత అందులో బియ్యప్పిండి, నానబెట్టిన పెసరపప్పు-సగ్గుబియ్యం, నువ్వులు, కరివేపాకు తరుగు వేసి చేత్తో బాగా కలిపి ముద్దలా చేయాలి. దీనిమీద మూతపెట్టి పది నిమిషాలు నాననివ్వాలి. తరువాత పిండిని కొద్దికొద్దిగా తీసుకుంటూ చిన్న ఉండల మాదిరి చేయాలి. ఒక ప్లాస్టిక్ కవర్ మీద కొద్దిగా నూనె రాసి ఈ ఉండలను పరిచి వాటి మీద మరో ప్లాస్టిక్ కవర్తో కప్పాలి. స్టీల్ బాక్స్ లేదా డబ్బాతో ఈ ఉండల మీద నొక్కితే బిళ్లల మాదిరి తయారవుతాయి. స్టవ్ మీద మూకుడు పెట్టి సగానికిపైగా నూనె పోసి వేడిచేయాలి. అందులో ముందుగా చేసి పెట్టుకున్న బిళ్లలు వేసి, రెండు వైపులా ఎర్రగా వేయించి పళ్లెంలోకి తీయాలి. ఈ రవ్వ చెక్కలు కరకరలాడుతూ తినడానికి రుచిగా ఉంటాయి.