Share News

Waqf Board Amendment: ముస్లిం ప్రగతికి అడ్డుగోడ వక్ఫ్‌ మాఫియా

ABN , Publish Date - May 10 , 2025 | 03:10 AM

వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలోని లక్షలాది ఎకరాల ఆస్తులు పేద ముస్లింల అభివృద్ధికి ఉపయోగపడలేదని, 2025 వక్ఫ్ సవరణలు జవాబుదారీతనం తీసుకొస్తాయని డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ విశ్లేషించారు. 2013 కాంగ్రెస్ సవరణలతో వక్ఫ్ బోర్డుకు రాజ్యాంగ విరుద్ధ అధికారాలు కల్పించబడినట్లు పేర్కొన్నారు.

Waqf Board Amendment: ముస్లిం ప్రగతికి అడ్డుగోడ  వక్ఫ్‌ మాఫియా

నేను రాసిన ‘ముస్లిం సంక్షేమానికే వక్ఫ్‌ సవరణలు’ అనే వ్యాసంలో (ఆంధ్రజ్యోతి: 09.04.2025)– గత 75 ఏండ్లుగా వక్ఫ్ బోర్డు అధీనంలో లక్షలాది ఎకరాల ఆస్తి ఉన్నా అది పేద ముస్లింలు, మహిళల అభివృద్ధికి ఏ మాత్రం ఉపయోగపడలేదు అన్న నిజాన్ని వెల్లడించాను. వక్ఫ్ సవరణ వలన వక్ఫ్ బోర్డుకు ఒక జవాబుదారీతనం వస్తుందని వివరించాను. దానికి స్పందనగా ముస్లిం సంఘాల కన్వీనర్ సలీమ్ పాషా ‘వక్ఫ్‌పై వాట్సాప్‌ వర్సిటీ పరిజ్ఞానం’ అంటూ వక్ఫ్ మాఫియాకు వంత పాడారు (ఆంధ్రజ్యోతి: 24.04.2025). వక్ఫ్ బోర్డు దగ్గర ఉన్న భూమి 9.4 లక్షల ఎకరాలే. కానీ అది కాక కాంగ్రెస్ తెచ్చిన 2013 వక్ఫ్ సవరణలు అడ్డం పెట్టుకొని 36 లక్షల ఎకరాలు వివిధ రాష్ట్రాలలో మాదే అని లిటిగేషన్ పెట్టిన అంశం సాక్షాత్తు హోమ్ మినిస్టర్ అమిత్ షా పార్లమెంటులో చెప్పారు. ఆ సందర్భంలో ముస్లింలకు మంచి చేసే సవరణలకు వ్యతిరేకంగా ఓటు వేసిన 232 ఎంపీలు ఎందుకు ప్రశ్నించ లేదు? పార్లమెంటులో ఇది నిజం కాదు అని ఎందుకు చెప్పలేదు? అమిత్‌ షా రాష్ట్రాలు, కొన్ని ఊర్ల పేర్లతో సహా ప్రస్తావించారు కదా? గతంలో లాలూ ప్రసాద్ యాదవ్ కూడా నిండు సభలో వక్ఫ్ మాఫియా గురించి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2013 రాజ్యాంగ వ్యతిరేక అధికారాలు వక్ఫ్ బోర్డుకు కట్టబెట్టిన తరువాత వక్ఫ్ ఆస్తులు 2,07,394 (2013) నుండి 8,72,870 (2024) పెరిగాయి, అలానే 18.3 లక్షల ఎకరాలు (2013) నుండి 39 లక్షల ఎకరాలకు పెరిగాయి. అలానే 2013లో ఢిల్లీ వక్ఫ్ బోర్డుకు 9 ఆస్తులు, 0.03 ఎకరాలు ఉంటే; 2025 నాటికి అవి 1047 ఆస్తులు, 29 ఎకరాలకు పెరిగాయి.


ఔరంగజేబు చేయలేని పని కాంగ్రెస్ చేసింది. ఇది సాక్షాత్తు సుప్రీంకోర్ట్ అఫిడవిట్‌లో కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన నగ్నసత్యం. కాంగ్రెస్‌ తెచ్చిన 2013 సవరణలు (వక్ఫ్ 1995 ఆక్ట్) సెక్షన్ 40 ప్రకారం, వక్ఫ్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆర్డర్‌ ఫైనల్. వక్ఫ్ ఆక్ట్ సెక్షన్ 83(7) స్పష్టంగా వక్ఫ్ ట్రిబ్యునల్ ఆర్డర్ ఫైనల్ అని చెబుతుంది. దాన్ని ఏ ఇతర కోర్టు విశ్లేషించే అధికారం లేకుండా కాంగ్రెస్ పార్టీ ఈ చట్టాన్ని తెచ్చింది. ఇది నిజం కాకుంటే, 2025 సవరణలో వక్ఫ్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా తొంభై రోజులలో హైకోర్టును ఆశ్రయించవచ్చు అనే అంశం మీద మీకు అభ్యంతరం ఎందుకు? కోర్టులు పార్లమెంట్‌ చేసిన చట్టాలనే సమీక్షించగలిగిన అధికారాన్ని కలిగి ఉండగా, కేవలం వక్ఫ్ ట్రిబ్యునల్‌కు ఆ ప్రత్యేకత కాంగ్రెస్ ఎందుకు కల్పించింది? రాజకీయ మెప్పు కోసమే కదా? 1995 సెక్షన్ 14: పాత చట్టం ప్రకారం వక్ఫ్‌ బోర్డులో కేవలం సున్ని, షియాలు ఉండాలని సూచన ఉంది కానీ నిర్దిష్టమైన నిబంధన లేదు. ఇక అఘకాని, బోర, ఇస్మాయిలి, అహ్మదీయ.. ఇతర వర్గాలకు అవకాశం లేదు. అతి ముఖ్యం పసమందా (ఓబీసీ) ముస్లిమ్స్, అత్యధికంగా 80శాతం ఉండే వర్గాలకు అవకాశమే లేదు. కానీ 2025 చట్టం మహిళలతో పాటు, ఈ వర్గాలకు కూడా నిర్దిష్టమైన రిజర్వేషన్ కల్పిస్తుంది.


ఇలా ప్రాతినిధ్యం కల్పించటం గురించి ‘ముస్లింలను విభజిస్తున్నారు’ అనే ఆరోపణ చేయటం ముస్లిం ఉన్నత వర్గాల ఆధిపత్య ధోరణికి నిదర్శనం. ఒక్కసారి కళ్ళకు కట్టిన మతపరమైన గంతలు విప్పి చూస్తే– కేవలం భారతదేశంలోనే అన్ని వర్గాల ముస్లింలూ శాంతితో ఉన్నారు. తక్కిన ముస్లిం దేశాలన్నింటిలోనూ వేర్వేరు వర్గాల మధ్య నిత్య ఘర్షణలే! కేవలం భారత్‌లో మాత్రమే, అది కూడా హిందూ మెజారిటీ ఉంది కనుక, అన్ని వర్గాలకు ప్రశాంతత, భద్రత ఉంది. అబ్దుల్ కలాంను రాష్ట్రపతి చేసింది, షానవాజ్ హుస్సేన్, ఎంజే అక్బర్, నజ్మా హెప్తుల్లా వీళ్ళని మంత్రులను చేసింది బీజేపీ. ఎన్నికలలో ముస్లిమ్స్ బీజేపీని ఒక విరోధి పార్టీగా చూసినా మోదీ సబ్ కా సాథ్ – సాబ్ కా వికాస్ అనే స్ఫూర్తితో ముందుకు వెళ్తున్నారు. ఇక వక్ఫ్ 1995 చట్టంలోని సెక్షన్స్ 107, 108, 108ఏ, 108బిలను తొలగించటం విషయానికి వద్దాం. ఈ సెక్షన్స్ ద్వారా 2013లో కాంగ్రెస్ ప్రభుత్వం వక్ఫ్ బోర్డుకు భారతదేశంలో ఏ సంస్థకూ లేని అపరిమిత అధికారాలు కట్టబెట్టింది. ఇంగ్లీష్‌లో ఒక సామెత ఉంది ‘అధికారం అవినీతికి దారి తీస్తుంది, అపరిమితమైన అధికారం అత్యంత అవినీతికి దారి తీస్తుంది’ అని. ఈ చట్టాలే వక్ఫ్ బోర్డు మహా అవినీతికి దారి తీశాయి. సెక్షన్ 107– భారతదేశంలోని ఏ చట్టం కూడా ఈ చట్టం ముందు తక్కువే. సెక్షన్ 108 ప్రకారం కేంద్రం వక్ఫ్ బోర్డులకు ఎలాంటి అధికారాలు అయినా ఇవ్వవచ్చు. 108ఏ ప్రకారం ‘వక్ఫ్ బోర్డు పాలనా ప్రాపర్టీ’ అని తమ రిజిస్టర్లో ఎక్కిస్తే చాలు (అది ప్రభుత్వ ప్రాపర్టీ, ప్రైవేట్ ప్రాపర్టీ, షెడ్యూల్ ఏరియా ప్రాపర్టీ ఏదైనా సరే), అది తేలేవరకు అమ్మలేరు లేదా కొనలేరు. 108బి భారతదేశంలో ఏ కోర్టు వక్ఫ్ బోర్డు చర్యలకు అడ్డు వెళ్లకుండా నిరోధిస్తుంది. ఈ సెక్షన్స్ అన్నీ రాజ్యాంగ విరుద్ధమే! ముస్లిమ్స్ సోదర సోదరీమణులకు మనవి– ఈ వక్ఫ్ మాఫియా చేసే అబద్ధ ప్రచారాన్ని నమ్మకండి. 75 ఏండ్లుగా మీకు దక్కింది ఏమీ లేదు. ఈ చట్ట సవరణ వలన, ముఖ్యంగా ముస్లిం యువత ప్రగతిపథంలో నడుస్తుంది. ముందు దేశం, తర్వాతే మతం అనే భావన పెరుగుతుంది. దేవుడు ఒక్కడే, లోకంలో వివిధ పేర్లతో పిలుస్తారు అనే సత్యాన్ని గ్రహించి ‘సర్వే జనా సుఖినో భవంతు’ అనే స్ఫూర్తితో మనం ముందుకు నడవాలి.

- డాక్టర్ బూర నర్సయ్యగౌడ్,

భోనగిరి మాజీ ఎంపీ

Updated Date - May 10 , 2025 | 03:13 AM