Share News

Andesri: కాలం మలచిన కవి

ABN , Publish Date - Nov 11 , 2025 | 12:40 AM

కవీ నీ గురించి నివాళి రాయాలంటే అక్షరాలు కళ్ల నీళ్లు పెట్టుకుంటున్నాయి. అందెశ్రీ! నిన్ను తలంచుకోవాలంటే కలం గద్గద స్వరమై రాయలేక నిలువెల్లా వణికిపోతుంది....

Andesri: కాలం మలచిన కవి

కవీ! నీ గురించి నివాళి రాయాలంటే అక్షరాలు కళ్ల నీళ్లు పెట్టుకుంటున్నాయి. అందెశ్రీ! నిన్ను తలంచుకోవాలంటే కలం గద్గద స్వరమై రాయలేక నిలువెల్లా వణికిపోతుంది. మొన్న నాతో మాట్లాడిన అందెశ్రీ ఇలా అర్ధాంతరంగా అకస్మాత్తుగా మాట మాత్రంగానైనా చెప్పా పెట్టకుండా వెళ్లిపోతాడని అనుకోలేదు. ఒకప్పటి వరంగల్ జిల్లా జనగాం తాలూకాలోని రేబర్తి గ్రామం అందెశ్రీ స్వంత గ్రామం. ప్రస్తుతం సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలో ఉంది. చిన్నప్పుడే తల్లిని కోల్పోయాడు. ఆ గ్రామంలో మల్లారెడ్డి పటేల్ వద్ద పెరిగాడు. బడికి పోవాల్సిన వయసులో పశువుల కాపరిగా పనిచేశాడు. చిన్నప్పటినుండి దైవభక్తి మిక్కిలిగా ఉండేడిది. ఊరిలోని అన్ని కులాల ప్రజల నోటిలో పండుగా మెదిలాడు. జీవితంలో సంభవించిన అనేక పరిణామాల కారణంగా నిజామాబాద్ జిల్లాలోను హైదరాబాద్‌లోను కూడా మేస్త్రిగా పనికి కుదిరాడు. బతుకు పాఠశాలలో అనేక పాఠాలు నేర్చుకున్నాడు. నాలుగో తరగతి చదువుకున్నారని ఆయన చెప్పాడు. ప్రారంభంలో అందెశ్రీ వివిధ పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూలను చూస్తే సంభ్రమాశ్చర్యాలు కలుగక మానవు. కొత్త పాట రాసిన ప్రతిసారి తాపీ పని నుంచి సరాసరి పత్రిక ఆఫీసులకు వచ్చేవాడు. మిత్రులైన వారిని కలిసేవాడు. వారి కోరికపై కొత్త పాటను వినిపించేవాడు. మొదట్లో బిరుదురాజు రామరాజు దగ్గర ఎక్కువగా కనిపించేవాడు. తర్వాత తర్వాత ఆయన సాహితీ ప్రపంచం విస్తృతమైన కొద్దీ, ఎంత ఎదిగినా ఒదిగి ఉండేవాడు. ‘‘నెత్తి మీద సుట్ట బట్ట ఆపైన పండ్ల బుట్ట తెనుగోల్ల ఎల్లవ్వా ఏది’’ – తెలంగాణ అస్తిత్వంలో కింది కులాల పైన రాసిన గొప్ప పాట ఇది. ‘‘మాదిగయ్యల మేధ నుండి పురుడు పోసుకున్నది మానవ జాతులను ఎప్పుడు మేలుకొలుపుతున్నది’’ వంటి పాటలను రాసి పాడిన అద్భుతమైన జానపద వాగ్గేయకారుడు. ‘‘మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు మచ్చుకైనా లేడు చూడు మానవత్వం లేని వాడు’’ అంటూ ప్రపంచీకరణ నేపథ్యంలో మనిషి ఎలా చిరునామా కోల్పోతున్నాడో వివరంగా తన కలం ద్వారా, గళం ద్వారా గొంతెత్తి వినిపించాడు. ఇకపోతే తెలంగాణ మలిదశ ఉద్యమంలో కవిగా, వాగ్గేయకారుడుగా ఆయన పాత్ర అమోఘమైనది, అద్వితీయమైనది. ఆయన సాహితీ ప్రస్థానం అంతా ఒక ఎత్తు, తెలంగాణ ప్రజల రాష్ట్ర గీతం ‘జయ జయ జయహే తెలంగాణ’ ఒక ఎత్తు. ఈ గీతంలో తెలంగాణ ఖ్యాతిని చరిత్రను నిక్షిప్తం చేసి ప్రజల నాలికల పైన అజరామరమయ్యాడు అందెశ్రీ. అతని లాంటి కవి ఇకముందు తెలంగాణలో జన్మిస్తాడనుకోవడం అసాధ్యమైన అంశం. ఆయన పాటల, మాటల సారాంశం అంతా తెలంగాణ అస్తిత్వంలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఆయన మరణం తెలుగు సాహిత్యానికి అందులో తెలంగాణ సాహిత్యానికి ఒక తీరని లోటు.

– జూకంటి జగన్నాథం

Updated Date - Nov 11 , 2025 | 12:40 AM