Share News

Telangana SSC Exam Pattern: పది పరీక్షలపై పునరాలోచించాలి

ABN , Publish Date - May 10 , 2025 | 03:58 AM

తెలంగాణలో పదోతరగతి పరీక్ష పద్ధతి మార్పు విద్యాహక్కు చట్టానికి వ్యతిరేకంగా మారింది.ఇది సమగ్ర మూల్యాంకనాన్ని తొలగించి మార్కుల పోటీకి దారితీస్తుంది.

Telangana SSC Exam Pattern: పది పరీక్షలపై పునరాలోచించాలి

ఇంట్లో ఎలుకలు ఉన్నాయని ఇంటిని తగలబెట్టుకోలేం కదా!?’ అచ్చం అలాగే ఉంది! పదోతరగతి పరీక్షా విధానం మార్పు పట్ల తెలంగాణ విద్యాశాఖ అధికారుల వైఖరి. ప్రైవేటు విద్యాసంస్థలు 20శాతం మార్కులు సంపూర్ణంగా వేసుకుంటున్నారనే ఆరోపణతో మొత్తం పరీక్షా విధానం ర్యాంకుల నుంచి మార్కుల వైపు మళ్ళించడం పూర్తిగా చట్టవిరుద్ధం. ప్రైవేటు విద్యా వ్యవస్థపై అదుపు పేరుతో వారి దోపిడిని మరింత పెంచే మార్పు ఇది. ప్రైవేటు పాఠశాలల్లో యాజమాన్యాలు మార్కుల పేరుతో పిల్లలను భౌతికంగా, మానసికంగా హింసిస్తున్నారు. చదువులను ‘భట్టీయం’గా మారుస్తున్నారు కాబట్టి, ఇది మారాలని కోరిన మీదట, విద్యాహక్కు చట్టం–2009 అమలులోకి వచ్చింది. అందుకనుగుణంగా 6–9 తరగతుల పరీక్షా విధానం విద్యా హక్కు చట్టం సెక్షన్ 19(1)హెచ్ నిబంధనలు సూచించిన విధంగా ‘నిరంతర సమగ్ర మూల్యాంకనం’(సీసీఈ) పద్ధతిలో మార్పు జరిగింది. దీనిప్రకారం ఒక సబ్జెక్టులో ఏడాది కాలాన్ని నాలుగు భాగాలుగా విభజించి నిర్మాణాత్మక మూల్యాంకనం (యఫ్ఏ–1, యఫ్ఏ–2, యఫ్ఏ–3, యఫ్ఏ–4) జరుపుతారు. ఇది రొటిన్ పరీక్షా విధానానికి భిన్నం. ఫార్మెటివ్ అసెస్‌మెంట్‌లో విద్యార్థుల 1) రాతాంశం 2) పఠనాంశం 3) ప్రాజెక్టు వర్క్ (పాఠశాల బయట విద్యార్థి పాఠ్యాంశానికి అనుగుణంగా చేసే యాక్టివిటీ) 4) స్లిప్ టెస్టు (పాఠ్యాంశం తర్వాత ఫీడ్ బ్యాక్ టెస్టు) ఈ నాలుగు అంశాల పరిశీలన మీదట ఉపాధ్యాయులు ఒక్కో అంశానికి ఐదు మార్కుల చొప్పున మొత్తం 20 మార్కులు ఇస్తారు. నాలుగు ఫార్మెటివ్ అసెస్‌మెంట్ సగటు తీసి ఇరవై మార్కులు గరిష్ఠంగా ఏడాది పరీక్షలో కలుపుతారు.


ఇక రెండో అంశం ఏమంటే సంగ్రహనాత్మక మూల్యాంకనం (యస్ఏ–1, యస్ఏ–2) ఇది సబ్జెక్టును రెండు భాగాలుగా విభజించి 40+40 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఇది ఆయా సబ్జెక్టుల్లో పాఠ్యాంశం సామర్థ్యాలు విద్యార్థులకు ఎంతవరకు అందాయో పరిశీలన చేసే కీలక పరీక్ష. ఇది విద్యార్థి నేర్చుకున్న అభ్యసనానుభవాలను, సామర్థ్యాలను పరీక్షిస్తుంది. దీనిని 2010 నుంచి 6–9 తరగతులకు అమలుపరుస్తూ, 2014లో పదోతరగతిలో కూడా అమలుపరిచారు. వాస్తవంగా పాఠశాలలో ‘నిరంతర సమగ్ర మూల్యాంకనం’ జరిపి ర్యాంకులతో కూడిన తుది సర్టిఫికెట్‌ను ఎస్సెస్సీ బోర్డు జారీ చేస్తే సరిపోతుంది. కానీ, తమ సంప్రదాయిక పరీక్షా విధానం వదులుకోవడానికి ఇష్టపడని బోర్డు విద్యా హక్కు చట్టం సూచించిన ‘నిరంతర సమగ్ర మూల్యాంకనం’ ప్రక్రియలోనే యస్ఏ–1, యస్ఏ–2 కలిపి 80మార్కులు వార్షిక పరీక్షగా నిర్వహించి, సబ్జెక్టు ఉపాధ్యాయులు ఇచ్చే 20మార్కుల గరిష్ఠ సగటును కలుపుతోంది. మార్కులకు బదులు ఎస్సెస్సీ బోర్డు ర్యాంకులతో సర్టిఫికెట్లు జారీచేసింది. అయితే 20శాతం ఫార్మెటివ్ అసెస్‌మెంట్ మార్కుల రికార్డులు విద్యాశాఖ పర్యవేక్షించాలి. కానీ, సిబ్బంది లేక తూతూ మంత్రంగా నిర్వహిస్తుండడంతో ప్రైవేటు విద్యా సంస్థల మధ్య ఉన్న పోటీ మూలంగా పదికి పది ర్యాంకులు పేరుతో 20కి 20మార్కులు వేసి బోర్డుకు పంపుతున్నారు. ఇక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు నిజాయితీగా యథాతథంగా విద్యార్థుల మార్కులు పంపుతున్నారు.


ఈ అంతరం పూడ్చడం కోసమని, పర్యవేక్షణ చేయలేని విద్యాశాఖ తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు పదో తరగతిలో ర్యాంకులు రద్దుచేసి మళ్ళీ పాత పద్ధతిలో 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపి ఒప్పించింది. దీని వల్ల అనేక రకాల వివాదాలు రానున్నాయి. ప్రాథమికంగా ఇది విద్యాహక్కు చట్టం సూచించిన ‘నిరంతర సమగ్ర మూల్యాంకనం’ కాన్సెప్ట్‌కు సెక్షన్ 19(1)హెచ్ నిబంధనకు పూర్తి విరుద్ధ నిర్ణయం? అనేక ఏళ్ళుగా రొటీన్ పరీక్షా విధానంలో మార్పు కోరుతూ వచ్చిన మనం, నూతన మార్పులు జీర్ణించుకోలేక, తిరిగి అశాస్త్రీయ పరీక్షా విధానం వైపు మొగ్గినట్లు అవుతుంది. తొమ్మిదవ తరగతి వరకు అనుసరించిన బోధనా విధానం, పరీక్షా విధానానికి భిన్నంగా పదవ తరగతి పరీక్ష నిర్వహించడం అవుతుంది. ఫార్మెటివ్‌ అసెస్మెంట్‌కు కనీస భాగస్వామ్యం లేకుండా పోతుంది? అంతేకాదు! ర్యాంకులకు బదులు మార్కులు ప్రకటించడం వల్ల తిరిగి ప్రైవేటు విద్యావ్యవస్థలో నూటికి నూరు మార్కులతో పరీక్ష వ్యాపారమయం అవుతుంది. ప్రైవేటు విద్యాసంస్థలు మధ్య అనారోగ్యకర పోటీకి దారితీస్తుంది. వీటన్నింటికంటే ఎక్కువగా ఒత్తిడి లేని సమగ్ర నిరంతర మూల్యాంకనాన్ని తిరస్కరించినట్లు అవుతుంది. ఇన్ని రకాల అడ్డంకులు అధిగమించి ఈ పది పరీక్ష జరపడం ద్వారా అదనంగా విద్యార్థులకు లభించే ప్రయోజనం ఏమీలేదు? రాష్ట్ర ప్రభుత్వం పది పరీక్షలపై పునరాలోచన జరపాలి. ఆర్భాటంగా ఒక తప్పుడు విధానం అమలుకు అవకాశం ఇవ్వడానికి బదులు తెలంగాణలోని విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాల అభిప్రాయాలు తీసుకొని పరీక్షా విధానాన్ని సంస్కరించాలి. విద్యాశాఖా మంత్రి కూడా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డే కనుక, ప్రజాస్వామ్య పద్ధతిలో పది పరీక్షా విధానంపై చర్చించి నిర్ణయం తీసుకోవాలి.

- ఎన్. తిర్మల్ సీనియర్ జర్నలిస్టు

Updated Date - May 10 , 2025 | 03:59 AM