Telangana Outsourcing Employees: ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ఆదుకోవాలి
ABN , Publish Date - May 20 , 2025 | 02:38 AM
తెలంగాణలో లక్షల మంది ఔట్సోర్సింగ్ సిబ్బంది ఉద్యోగ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దశలవారీగా తొలగింపు నిర్ణయం అన్యాయమని పేర్కొంటూ ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో వివిధ శాఖలు, ప్రభుత్వరంగ సంస్థలు, సొసైటీల్లో దాదాపు రెండు లక్షల మందికి పైగా ఔట్ సోర్సింగ్ సిబ్బంది పని చేస్తున్నాం. మమ్మల్ని ఈ ఏడాది రెన్యువల్ చేయకుండా దశలవారీగా విధుల నుంచి తొలగిస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఇది చాలా అన్యాయమైన నిర్ణయం. దాదాపు పది పదిహేనేళ్లుగా చాలీచాలని జీతాలతో వివిధ శాఖల్లో విధులు నిర్వర్తిస్తున్నాం. మాలో చాలా మంది వయసు నాలుగు పదులు దాటింది. ఇప్పటికిప్పుడు మమ్మల్ని విధుల నుంచి తప్పిస్తే మా పరిస్థితి, మాపై ఆధారపడిన మా కుటుంబాల పరిస్థితి గురించి ప్రభుత్వం పునరాలోచన చేయాలి. కొన్ని ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు నిరుద్యోగులకు ఆశ చూపి వారి నుంచి లక్షల్లో డబ్బులు దండుకుంటున్నాయి. చాలా ఏజెన్సీలు ఉద్యోగులకు ఈపీఎఫ్, ఈఎస్ఐ సదుపాయాలు కల్పించకుండా, గవర్నమెంట్కు జీఎస్టీ కట్టకుండా ఇటు ఉద్యోగులను, అటు ప్రభుత్వాన్ని మోసం చేస్తున్న విషయం ప్రభుత్వం గ్రహించాలి. ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి, మాకు ఉద్యోగ భద్రత కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేయాలి. ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు చట్టబద్ధత కల్పించాలి. ఎన్నికల సమయంలో ప్రజా ప్రభుత్వాలకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు అండగా నిలిచిన విషయం గుర్తుంచుకోవాలి.
– డి. శ్రీధర్ ఔట్సోర్సింగ్ జేఏసీ వైస్ ప్రెసిడెంట్