Share News

Land Disputes: బడాబాబుల్ని వదిలి, సామాన్యులకా శిక్ష

ABN , Publish Date - Jul 17 , 2025 | 01:39 AM

ఈ మధ్య వార్తాపత్రికలలో తెలంగాణలో రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా అనుకొన్నంత ఆదాయం రావట్లేదని, భూమి, ఇళ్ల కొనుగోళ్లు తగ్గిపోతున్నాయనే వార్త ప్రచురితమైంది.

Land Disputes: బడాబాబుల్ని వదిలి, సామాన్యులకా శిక్ష

మధ్య వార్తాపత్రికలలో తెలంగాణలో రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా అనుకొన్నంత ఆదాయం రావట్లేదని, భూమి, ఇళ్ల కొనుగోళ్లు తగ్గిపోతున్నాయనే వార్త ప్రచురితమైంది. దీనికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు అనే భావన ప్రజలలో కలుగుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సాధికారత, ఉపాధి కల్పన, ప్రభుత్వ భూముల ఆక్రమణ నిలువరించేందుకు ముఖ్యంగా హైదరాబాదులో హైడ్రా వంటి వ్యవస్థ ఏర్పాటు, నైపుణ్యాల అభివృద్ధి, రైతులను ఆదుకోవడం, సంక్షేమ కార్యక్రమాల విషయాలలో మంచి పేరు తెచ్చుకుంది. కానీ ఈ మధ్య కష్టార్జితంతో ప్లాట్లు కొనుక్కుని రిజిస్ట్రేషన్ చేసుకున్నవారు, వారి ఆస్తుల్ని పిల్లల పెళ్లి, చదువుల నిమిత్తం అమ్ముకుందామంటే, ఆ భూములు ప్రభుత్వ భూమి అని రిజిస్ట్రేషన్ నిరాకరిస్తున్నారు. ఈ విధానంతో ఎంతోమంది మళ్లీ ఆత్మహత్యలకు పాల్పడే అవకాశం ఉంది.


గతంలో కొందరు రాజకీయ నాయకులు లేదా బడాబాబులు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని సామాన్యులకు అమ్మారు. ప్రభుత్వ భూమి అన్న విషయం తెలియక పైసాపైసా కూడబెట్టి ఈ ఆస్తుల్ని కొన్నారు. అవి ప్రభుత్వ భూములు అవునా, కాదా అనే విచారణ చేయకుండా రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్ చేశారు. ఇప్పుడు ఆ భూములు ప్రభుత్వానివని, వాటిమీద కొనుక్కున్న వారికి ఎలాంటి హక్కూ లేదని, వాటిని అమ్మకోవడానికి నిరాకరిస్తున్నారు. ఈ ప్రభుత్వం ఎన్ని మంచి పనులు చేసినా, కొన్ని లక్షల మందికి వారి కష్టార్జితాన్ని అనుభవించకుండా చేస్తున్నదన్న అపవాదు మూటకట్టుకుంటున్నది. అంతేకాకుండా ప్రభుత్వానికి కూడా ఆస్తుల లావాదేవీల ద్వారా రావలసిన ఆదాయం తగ్గుతోంది. ఎప్పుడో ఒక అవినీతిపరుడు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని వాటిని సామాన్యులకు అమ్మి డబ్బు సంపాదించుకున్నాడు. అతడిని శిక్షించకుండా, ఆస్తులు కొన్నవాళ్లను శిక్షించడం న్యాయమా? అంటే నేరస్తుడికి తప్పించుకొనే అవకాశమిచ్చి, అమాయకులను బలి చేయడమనే విధానం శ్రేయస్కరం కాదు. బడాబాబులు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కాకుండా... సామాన్యులు, ఉద్యోగస్తులు, చిన్న చిన్న వ్యాపారస్తులు కొన్న ప్లాట్‌లు రిజిస్ట్రేషన్ అయితే, అటువంటి వాటికి ప్రభుత్వం మినహాయింపునివ్వాలి. గత ప్రభుత్వంలో ధరణిలో జరిగిన అన్యాయాలకు ఎంతోమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నిరసన వ్యక్తం చేసింది. వారికి న్యాయం చేస్తామని చెప్పింది. కానీ ప్రస్తుత ప్రభుత్వ విధానాలతో అలాంటివారికి కాంగ్రెస్ ప్రభుత్వమే అన్యాయం చేస్తున్నట్టుగా ఉంది. ఇకనైనా చిన్నాచితక ఆస్తిపరులు వారి ఆస్తుల్ని అమ్ముకునేందుకు అడ్డంకులు లేకుండా త్వరితగతిన నిర్ణయాలు తీసుకుంటే ఈ ప్రభుత్వం చేసే మంచి పనులకు ఇంకొకటి తోడవుతుంది.

– హనుమంత ప్రసాద్‌రావు, హైదరాబాద్

Updated Date - Jul 17 , 2025 | 01:39 AM