Nepal Monarchy Movement: రాజు రాకడకోసం
ABN , Publish Date - May 10 , 2025 | 03:04 AM
నేపాల్లో రాజును తిరిగి గద్దెనెక్కించాలన్న డిమాండ్తో రాచరిక అనుకూల శక్తులు మళ్లీ ఉద్యమాన్ని ప్రారంభించాయి. ప్రజాస్వామ్యంపై విసుగుతో, ప్రజలు రాచరికాన్ని మరోవిషయంగా పరిగణిస్తున్న పరిస్థితి ఏర్పడుతోంది.

నేపాల్ను మళ్ళీ హిందూ రాజ్యం చేయాలని, రాజు తిరిగి సింహాసనం అధిష్ఠించాలని డిమాండ్ చేస్తూ అక్కడ నిరసనలు సాగుతున్నాయి. రాజు రాకడకోసం సాగుతున్న ఈ ఉద్యమం నిర్దిష్టంగా, సంఘటితంగా లేకపోవడంతో ఆశించిన ఫలితం సాధించలేకపోతోందని, ఇకపై మరింత బలంగా ఆ పోరాటాన్ని కొనసాగించాలని రాచరిక అనుకూల సంస్థలు, పక్షాలు గురువారం తీర్మానించుకున్నాయి. ఈ నెల 29నుంచి మలిదశ ఉద్యమాన్ని మరింత తీవ్రతరంచేసి, ఆందోళనలు, నిరసనలతో అంతిమలక్ష్యాన్ని సాధించాలని సమావేశం నిర్ణయించింది. ఇది జరిగిన మర్నాడు ఇప్పటివరకూ విడివిడిగా ఉద్యమిస్తున్న కొన్ని చిన్నాచితకా పార్టీలు, సంస్థలు కూడా ఒకే గొడుగుకింద ఒక్కటిగా పోరాడటానికి తమ సంసిద్ధత ప్రకటించాయట. మొత్తంగా ఓ నలభై యాభై గ్రూపులు ఒక్కటైనాయట. రాచరిక అనుకూల శక్తులతో మాజీ రాజు జ్ఞానేంద్ర వరుసపెట్టి భేటీ అవుతూ వారిని ఏకం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్న పేరిట ప్రజల మధ్య నిత్యం తిరుగుతున్నారు. ఈ సంక్షోభసమయంలో ప్రజలంతా ఒక్కటి కావాలని, దేశాన్ని రక్షించుకోవాలని ఏవో రహస్య సందేశాలు కూడా ఇస్తున్నారు. ఇప్పటివరకూ ఎడమొఖం పెడమొఖంగా ఉంటున్న శక్తులన్నీ ఇకపై సంఘటితంగా ఉద్యమించి రాజును తిరిగి గద్దెమీద కూచోబెట్టడం ఖాయమని జ్ఞానేంద్ర అభిమానుల నమ్మకం. రాచరిక అనుకూల ఉద్యమం బలహీనపడిందని, ఇక తేరుకోదని ఐదురోజుల క్రితమే అధికారపక్షం తన సదస్సులో తీర్మానించిన నేపథ్యంలో, రాజ భక్తులంతా మళ్ళీ ఇలా తమ ఉనికిని చాటుకొనే ప్రయత్నం చేస్తున్నారని విశ్లేషకుల అభిప్రాయం. ఈ ఉద్యమం ఇంకా సామాన్యుల మనసులను తాకలేదని ఓ వాదన. రాచరికం రావాలంటున్నవారు పలు డిమాండ్లతో ఉద్యమిస్తున్నారు. హిందూ రాజ్యం, రాజ్యాంగబద్ధమైన రాచరికం, రెండంచెల ఫెడరల్ వ్యవస్థ ఇత్యాదివి వాటిలో కొన్ని నేపాల్ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తుత విధానం పరిష్కరించలేదని, నాయకులు ప్రజల ఆశలను వమ్ముచేశారని రాచరిక అనుకూల శక్తుల వాదన. ప్రజాస్వామ్యం ముసుగులో ప్రజాధనం దోపిడీకి పాల్పడ్డారని, అందువల్ల దేశాన్ని ఇప్పటివరకూ ఏలిన రాజకీయనాయకుల ఆస్తిపాస్తులవివరాలు బయటపెట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
లౌకిక, గణతంత్ర రాజ్యంగా నేపాల్ అవతరించిన రెండుదశాబ్దాల అనంతరం మళ్ళీ రాజురావాలంటూ నిత్యం ఆందోళనలు జరుగుతూండటం విచిత్రం, విషాదం. మార్చినెలాఖరులో సాగిన ఉద్యమం తీవ్రత కనీవినీ ఎరుగనిది. వేలాదిమంది వీధుల్లోకి వచ్చి నినాదాలు చేశారు, భద్రతాదళాలు విరుచుకుపడటంతో అది హింసాత్మకంగా మారి కొందరు మరణించారు కూడా. ఈ ఉద్యమంలో కీలకపాత్ర వహిస్తున్న మాజీ మార్క్సిస్టు గెరిల్లా, ప్రస్తుత బడావ్యాపారి దుర్గా ప్రసాయి భారతదేశానికి పారిపోయినట్టుగా వార్తలు రావడం, ఇటీవలే ఆయన అరెస్టుకావడం తెలిసిందే. అధికారికంగా పదహారువేలమంది ప్రాణాలు తీసిన అంతర్యుద్ధం ముగిసి, రాజ్యాంగ రచన, రాచరికం రద్దు, గణతంత్ర రాజ్యస్థాపన జరిగిన తరువాత నేపాల్ అతివేగంగా అభివృద్ధిపథంలోకి దూసుకుపోతుందని అందరూ ఆశించారు. కానీ, 2008నుంచి ఇప్పటివరకూ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడమే దానికి కష్టమైపోతోంది. పదిహేడు సంవత్సరాల్లో పదమూడు ప్రభుత్వాలు మారిపోవడం ఒక ఎత్తయితే, సైద్ధాంతికంగా పూర్తి భిన్నమైన పక్షాలు సైతం అధికారంకోసం కక్కూర్తిపడటం ఆశ్చర్యం. రాజకీయ అస్థిరత, అవినీతి కారణంగా ప్రజల్లో ప్రజాస్వామ్య వ్యవస్థలమీద నమ్మకం సడలిపోతోంది. ప్రచండ, కె.పిశర్మ ఓలి అధికారమే పరమావధిగా దగ్గరవుతూ, వెంటనే వెన్నుపోట్లు పొడుచుకుంటూ, తమ రాజకీయ శత్రువులతో సైతం చేతులు కలుపుతూ ప్రదర్శిస్తున్న అధికారదాహం ప్రజలకు విరక్తికలిగించింది. అధిక ధరలు, అవినీతి, నిరుద్యోగం, మౌలిక రంగాల్లో ఏ మార్పూ లేకపోవడం వంటివి ప్రజలు మళ్ళీ రాచరికంవైపు చూసేందుకు అవకాశం ఇస్తున్నాయి. ప్రచండ, ఓలి వర్గాలను అప్పట్లో ఏకం చేసిన మాజీ మావోయిస్టు దుర్గా ప్రసాయి వంటి వ్యాపారవేత్తలు ప్రజల్లో ఉన్న ఈ అసంతృప్తిని వాడుకొని రాజును మళ్ళీ గద్దెనెక్కించేందుకు ప్రయత్నిస్తున్నారు. నారాయణహితిలో మళ్ళీ జ్ఞానేంద్రను రాజుగా చూడాలనుకుంటున్న ఈ ఉద్యమం దీర్ఘకాలం నిలిచి, అంతిమంగా గెలుస్తుందా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేం. కానీ, ప్రజల్లో తమ పట్ల పెరుగుతున్న అసంతృప్తిని ప్రధాన రాజకీయపక్షాలు గుర్తించి, పరిష్కరించి, నడవడికను మార్చుకోని పక్షంలో, రాజు వచ్చి తమను రక్షించాలని నినదిస్తున్నవారి సంఖ్య అతివేగంగా పెరిగే ప్రమాదమైతే లేకపోలేదు.