Social Unity: నితీశ్ చర్యకు ప్రాధాన్యం అవసరం లేదు
ABN , Publish Date - Dec 31 , 2025 | 05:27 AM
ఒక ప్రభుత్వ కార్యక్రమంలో ఓ ముస్లిం మహిళా డాక్టర్ ముఖం పైనున్న హిజాబ్ తొలగించమంటే, ఆమె నిరాకరిస్తే ముఖ్యమంత్రి తానే తొలగించాడు.
ఒక ప్రభుత్వ కార్యక్రమంలో ఓ ముస్లిం మహిళా డాక్టర్ ముఖం పైనున్న హిజాబ్ తొలగించమంటే, ఆమె నిరాకరిస్తే ముఖ్యమంత్రి తానే తొలగించాడు. ఇప్పుడు నేరాలు, ఘోరాలకు పాల్పడే వారు సైతం ముసుగుల్లో వచ్చి పోతున్న విషయం అందరికీ తెలిసిందే. వృద్ధుడైన నితీశ్కుమార్ ఆమె ఎవరనే గుర్తింపు కోసమో, ఉత్సుకతతోనో అలా చేసి ఉండవచ్చు. దీనిపై ఆ మత పెద్దలు కూడ ఎంతో సంయమనం పాటించారు. ఐతే ఈ చిన్న సమస్యని కొందరు అపార్థం చేసుకుంటే, మరి కొందరు రాజకీయ నాయకులు రాద్ధాంతం చేస్తున్నారు. ఇటువంటి ప్రచారాలు, అపోహలతోనే వైషమ్యాలు పెరుగుతాయి. పాకిస్థాన్, బంగ్లాదేశ్ మైనార్టీల వలె ఇక్కడ కూడ మైనార్టీలకు రక్షణ లేదని ప్రచారం చేస్తున్నారు. అయితే అక్కడ హిందువులకి మాత్రమే కాదు అభ్యుదయవాదులైన తోటి ముస్లింల ప్రాణాలకి సైతం రక్షణ లేదు. మన లౌకికవాద ప్రజాస్వామ్య దేశంలో హిందువులతో పాటు అన్ని వర్గాల వారికీ సమాన హక్కులున్నాయి, ఆర్థికంగా వెనుకబడిన మైనారిటీ వర్గాలు, షెడ్యూల్ కులాలు, తెగల వారికి ఎన్నో రాయితీలు సైతం ఉన్నాయి. సామాన్య ప్రజానీకం స్వేచ్ఛగా, కలిసి మెలిసి జీవిస్తున్నారు. గతంలో ముస్లిం దేశమైన ఇరాన్లోనే ఆ దేశ మహిళలు స్వేచ్ఛ, వ్యక్తిగత హక్కుల కోసం హిజాబ్కి వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు. నేడు ఆధునిక విజ్ఞానశాస్త్ర సౌకర్యాలు పొందుతున్న ప్రజానీకం కాలానుగుణంగా ఆధునిక భావాలని, పరమత సహనాన్ని అలవర్చుకోవాలి, అప్పుడే అసలైన లౌకికవాదం పెంపొందుతుంది.
– తిరుమలశెట్టి సాంబశివరావు
గుంటూరు