Share News

Indian society: అర్థంకాని ఈ సమాజాన్ని ఎలా మారుస్తారు?!

ABN , Publish Date - Oct 25 , 2025 | 04:05 AM

రాజ్యాంగం ప్రకారం మనది సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్రం. అయితే రాజ్యాంగాల్లో ప్రకటించుకున్నట్టుగా ఏ సమాజమూ ఉండదు; ఏ ప్రభుత్వమూ పనిచేయదు......

Indian society: అర్థంకాని ఈ సమాజాన్ని ఎలా మారుస్తారు?!

రాజ్యాంగం ప్రకారం మనది ‘సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్రం’. అయితే రాజ్యాంగాల్లో ప్రకటించుకున్నట్టుగా ఏ సమాజమూ ఉండదు; ఏ ప్రభుత్వమూ పనిచేయదు. రాజ్యాంగ పరిధిలోనే భారతదేశం ‘హిందూ మతరాజ్యం’గా మారిపోయిందని సుబ్రమణియన్ స్వామి వంటివాళ్ళు ఐదేళ్ళ క్రితమే ప్రకటించారు. ఒక ప్రజాస్వామిక రాజ్యాంగం అమల్లో వుండగా దేశంలో మతరాజ్యం ఏర్పడడం రాజకీయ ధార్మిక రంగాల్లో వైచిత్రి కావచ్చుగానీ, సామాజిక రంగంలో అది చాలా పెద్ద సంక్షోభాన్ని రేపుతుంది. భారత సమాజాన్ని అంచనా వేయడంలో కమ్యూనిస్టు పార్టీల్లో కూడా విపరీతమైన వైరుధ్యం కనిపిస్తుంది. సమాజాన్ని అర్థం చేసుకున్న దాన్నిబట్టే ఆయా పార్టీల దీర్ఘకాలిక కార్యక్రమాల రూపకల్పన జరుగుతుంది. మనది అర్ధ భూస్వామ్య–అర్ధ వలస సమాజమని మార్క్సిస్టు–లెనినిస్టు పార్టీలన్నీ భావిస్తుంటాయి. ఇది 1935–40 మధ్య ప్రాంతంలో చైనా సమాజం గురించి మావో చేసిన విశ్లేషణ. దాన్నుండి ఆయన ‘నూతన ప్రజాస్వామిక విప్లవం’ అనే కార్యక్రమాన్ని రూపొందించాడు. చైనాలో సామ్రాజ్యవాద వ్యతిరేక జాతీయ బూర్జువా వర్గం కూడా కమ్యూనిస్టుల విప్లవంతో కలిసి వచ్చింది. ఇండియాలో అలాంటి పరిస్థితి లేకపోయినా, స్థల కాలాలు మారిపోయినా, మావోయిస్టులు సహా మార్క్సిస్టు–లెనినిస్టు పార్టీలన్నీ ‘నూతన ప్రజాస్వామిక విప్లవం’ను పట్టుకుని వేలాడుతున్నాయి. 1990లలో మన దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా సామాజిక ఆర్థిక వ్యవస్థల పునాది మారిపోయింది. తూర్పు యూరప్‌లోని సోషలిస్టు ప్రభుత్వాలు పతనం కావడమే గాక సోషలిస్టు రష్యా సహితం విచ్ఛిన్నం అయిపోయింది. కమ్యూనిజానికి ఆమోదాంశం ఇరుకున పడిపోయింది. మరోవైపు, గాట్ కారణంగా ప్రపంచ వాణిజ్య సంస్థ ఏర్పడి సరళీకృత ఆర్థిక విధానాలు వచ్చాయి. డిజిటల్ టెక్నాలజీతో సంప్రదాయ ఉత్పత్తి విధానమే మారిపోయింది. వీటికితోడు మనదేశంలో మతతత్వ రాజకీయాలు విజృంభించాయి. కొత్త గణాంకాల ప్రకారం మనదేశ జీడీపీలో వ్యవసాయం, ఆక్వా, అటవీ సంపదల వాటా 16.3 శాతం. పారిశ్రామిక రంగం వాటా 29 శాతం. కొత్తగా ప్రవేశించిన సర్వీస్ సెక్టార్ వాటా 54.55 శాతం.


అయినప్పటికీ ఇంకా ఎవరైనా వ్యవసాయిక విప్లవం, నూతన ప్రజాస్వామిక విప్లవం అంటూ ఉంటే మాత్రం వాళ్ళ మెదళ్ళను పురాతత్వశాలల్లో జాగ్రత్తగా భద్రపరచాలి! ఏ సమాజంలో అయినా ఉత్పత్తిశక్తులు, ఉత్పత్తి సంబంధాలతో కూడిన ఉత్పత్తి విధానం రాజకీయాలతో సహా ఇతర సామాజిక సాంస్కృతిక రంగాలన్నింటినీ ప్రభావితం చేస్తుంటుంది. ఈ సూత్రాన్ని 21వ శతాబ్దపు డిజిటల్ సమాజానికి అన్వయించే పని ఎవరూ చేయలేదు. ఆధిపత్య సమూహాల దగ్గర రాజకీయ అధికారంతో సహా వనరులన్నీ సమృద్ధిగా ఉంటాయి. అంచేత వాళ్ళు కొత్త సమాజాన్ని విశ్లేషించుకోకపోయినా వాళ్ళకు వచ్చే ఇబ్బంది ఏమీ లేదు. కానీ, వర్తమాన సమాజం వల్ల ఇబ్బందులు, వివక్ష, అణచివేతలకు గురయ్యేవాళ్ళు దాన్ని మార్చాలనుకుంటే మాత్రం కొత్త పరిణామాలను నిశితంగా విశ్లేషించుకోక తప్పదు. సమాజాన్ని వాస్తవికంగా అర్థం చేసుకోకుండా దాన్ని మార్చే కార్యక్రమాన్ని ఎవ్వరూ రూపొందించలేరు. విప్లవ కార్యక్రమాన్ని రూపొందించడమే సజావుగా సాగనప్పుడు దాన్ని విజయవంతం చేయడం అసాధ్యం అవుతుంది. ప్రస్తుతం బస్తర్‌లో మావోయిస్టు పార్టీ ఉనికి సంక్షోభంలో పడిపోవడం దీనికి సరికొత్త హెచ్చరిక. మరోవైపు, దేశాన్ని ఫాసిజమో, నాజీయిజమో పాలిస్తున్నదనే అభిప్రాయాన్ని కొందరు తరచూ వ్యక్తం చేస్తున్నారు. పాలకుల్లో ఆ లక్షణాలు కనిపిస్తున్నమాట నిజమేగానీ వందేళ్ళ నాటి ఇటలీ, జర్మనీ రాజకీయ సామాజికార్థిక పరిస్థితులూ ఇప్పటి మన సామాజిక వాస్తవమూ ఒకటి కానే కాదు. ఇప్పుడు మనం చూస్తున్నది కార్పొరేట్ మతతత్త్వ నియంతృత్వం. (Corporate Communal Dictatorship –CCD). కార్పొరేట్ పెట్టుబడిదారీ విధానం, హిందూత్వ ఆధిపత్యం, రాజ్య అణచివేతల క్రూర సమ్మిశ్రిత వ్యవస్థ ఇది. ఆర్థిక రంగంలో సహజ, కృత్రిమ వనరులు, శాస్త్రవిజ్ఞానం మొత్తం కార్పొరేట్ల ఆధీనంలోకి వెళ్ళిపోతుంటాయి. సాంస్కృతిక రంగంలో మెజారిటీ మతం ఇతర మతాలను అణచివేస్తుంటుంది. హిందూ సమూహాలను ఐక్యం చేయడానికి దానికున్న ఏకైక మార్గం ఇస్లాం, క్రైస్తవ మతాలను దేశ భద్రతకు ముప్పుగా ప్రచారం చేస్తుండడం. సామాన్య ప్రజలు తిరగబడకుండా రాజ్యం అణచివేస్తుంటుంది. ఈ మూడు రకాల అణచివేతల బాధితులు ఏకం కావాలని కొందరు సమంజసంగానే అంటుంటారు గానీ అది అంత సులువు కాదు. ‘‘హిందూ సమాజం అంటూ ప్రత్యేకంగా ఏదీ ఉనికిలో ఉండదు. అది కేవలం కులాల సమాహారం. ప్రతి కులం తన ఉనికి గురించి తపనతో ఉంటుంది. దాని మనుగడే దాని ఉనికికి మూలం, అదే దాని ముగింపునకూ మూలం.


కులాలు ఎన్నడూ ఒక సమాఖ్యగా కూడా ఏర్పడవు. కాబట్టి, హిందూ సమాజాన్ని కులాల సముదాయం అనడం కూడా సరికాదు. ఒకరితో మరొకరు పోరాడుకుంటుండే సమూహాలు అవి. హిందూ–ముస్లిం అల్లర్లు జరిగినప్పుడు మాత్రమే హిందూ కులాల మధ్య అనుబంధం ఏర్పడుతుంది. అది కూడా తాత్కాలికం మాత్రమే. ఇతర సందర్భాల్లో ఒక కులం మరో కులంతో తనకో అనుబంధం ఉందని కనీసంగానైనా భావించదు,’’ అన్న బిఆర్ అంబేడ్కర్ మాటలు నేటికీ వర్తిస్తాయి. అంబేడ్కర్ మాటల్ని తిరగేసి చూస్తే, ఎన్నికల్లో హిందూ ఓటు బ్యాంకును కొల్లగొట్టాలంటే నిరంతరం ముస్లిం భూతాన్ని చూపుతుండాలి అనే అర్థం వస్తుంది. దీనినే ఇస్లామోఫోబియా అంటున్నారు. అలా చేస్తే, హిందూ సమాజం మొత్తం కాకున్నా వాళ్ళలో 36–38 శాతం ఓట్లు వేసినా అప్రతిహత శక్తి అని చెప్పుకునే అవకాశం మన పార్లమెంటరీ ఎన్నికల వ్యవస్థలో ఉంది. సమాజం నిలువు దొంతరలుగానేగాక, సమాంతరంగానూ సమూహాలు సమూహాలుగా విడిపోయి ఉంటుంది. నిలువు దొంతరల్ని విశ్లేషించినంత సులువుకాదు సమాంతర సమూహాల మధ్యనున్న వైరుధ్యాలను పరిష్కరించడం. నిలువు దొంతరలు కళ్ళకు కనిపిస్తుంటాయి. సమాంతర సమూహాలను విడగొట్టి చూడడం కష్టసాధ్యం. సమాజం మారాలనో, సమాజాన్ని మార్చాలనో చాలామంది అంటుంటారు. అలాంటివాళ్ళు అన్నింటికన్నా ముందు సమాజ వాస్తవికతను గుర్తించాలి. దానికి బాధితుల జాబితా సిద్ధం చేయాలి. సాధారణ బాధితులు మొదలు ప్రధాన బాధితుల వరకు ఒక గ్రేడింగ్‌ను కూర్చాలి. ఇప్పటి సమాజాన్ని ఎలాంటి సమాజంగా మార్చాలని ఆశిస్తున్నామో, ఎలాంటి సమాజాన్ని నిర్మించగలమో– నిర్ధారించుకోవాలి. అప్పుడు ఆ దిశగా ప్రయాణించడానికి ఒక రోడ్ మ్యాప్‌ను రూపొందించుకోవచ్చు. అయితే, ఇది చాలా సంక్లిష్ట ప్రక్రియ. తరచూ మన గతమే మనల్ని కట్టి పడేస్తుంది. వర్తమాన భారత మేధోరంగాన్ని మూడు దృక్పథాలు నడుపుతున్నాయి. ఎంఎస్ గోల్వాల్కర్, కార్ల్ మార్క్స్, బిఆర్ అంబేడ్కర్. గోల్వాల్కర్ ఆలోచనా విధానానికి వ్యతిరేకంగా మార్క్స్, అంబేడ్కర్ ఆలోచనా స్రవంతుల్ని ఏకం చేయాలి అని చాలామంది అనవచ్చు. దీనినే లాల్ – నీల్ మైత్రి అంటున్నారు కొందరు. లోతుగా చీలిపోయిన సమాజంలో ఇది అంత సులువైన వ్యవహారం కాదు. ఇప్పటి ఇండియా కార్పొరేట్ మతతత్త్వ నియంతృత్వానికి ప్రధాన బాధితులు ముస్లింలు, ఆదివాసులు. ఉద్యమంలోనూ, ఆ తరువాత మనం కోరుకుంటున్న సమాజంలోనూ ఈ రెండు సమూహాల స్థానాన్ని నిర్ణయించకపోతే బండి ఒక్క అడుగు కూడా ముందుకు నడవదు. ఆలస్యం జరిగేకొద్దీ, కార్పొరేట్ పెట్టుబడిదారీ విధానం, హిందుత్వ ఆధిపత్యం, రాజ్య అణచివేత మూడూ మరింతగా పెరుగుతుంటాయి.

--డానీ

Updated Date - Oct 25 , 2025 | 04:05 AM