Public Services: సంఘ విద్రోహులకు సంక్షేమ పథకాలు వద్దు
ABN , Publish Date - Jul 17 , 2025 | 01:34 AM
రాష్ట్రంలో నానాటికీ రౌడీయిజం పెరుగుతూ నేరగాళ్ళు పోలీసులపైనే తిరగబడే స్థితి వచ్చింది.
రాష్ట్రంలో నానాటికీ రౌడీయిజం పెరుగుతూ నేరగాళ్ళు పోలీసులపైనే తిరగబడే స్థితి వచ్చింది. రాష్ట్రంలో పెరిగిపోతున్న అనుచిత పథకాలతోనే సమాజంలో పని సంస్కృతి తగ్గి, బాధ్యతారాహిత్యం, నేరాలు పెరిగిపోతున్నాయి. కాబట్టి సంఘ విద్రోహులకి సంక్షేమ పథకాలను నిలిపివేయాలనే ప్రభుత్వ నిర్ణయం మంచిదే. రాష్ట్రంలో సుపరిపాలన కోసం, గత వైసీపీ ప్రభుత్వం భారీగా పెంచిన విద్యుత్, బస్ చార్జీలను తగ్గిస్తుందని, ఖాళీగా వున్న లక్షలాది ప్రభుత్వోద్యోగాలను భర్తీ చేస్తుందని రాష్ట్రంలో కూటమిని గెలిపించారు ప్రజలు. శాంతిభద్రతల విషయంలో సంఘవిద్రోహుల పట్ల యూపీ ప్రభుత్వం వలె కాకపోయినా కొంత కఠినంగా వ్యవహరించాలి. దండం దశ గుణం భవేత్ అని కదా పెద్దల సామెత.
ఇక హామీల విషయానికి వస్తే పెద్దలకు ఇచ్చే పింఛన్లు తక్షణమే పెంచమని గాని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటివి ప్రజానీకం డిమాండ్ చేయలేదు. బిహార్లో నేటికీ వృద్ధాప్య ఫించన్ నెలకి నాలుగు వందలే. అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న వేళ దీనిని 1100 రూపాయలకు పెంచారు. ఇపుడు మన రాష్ట్రంలో నెలకు రూ.నాలుగు వేలు. అధిక పన్నుల భారం మోస్తున్నాం గనుక తప్పు లేదని పింఛను, రేషన్ వంటి సంక్షేమ పథకాలను కొందరు ధనికులు కూడా పొందుతున్నారు. సంక్షేమ పథకాలే పార్టీని గట్టెక్కిస్తాయనే భ్రమ నుంచి ప్రభుత్వం బయటపడాలి.
ఇప్పుడు ప్రభుత్వం భావిస్తున్నట్లు సంఘ విద్రోహులకు సంక్షేమ పథకాలను నిలిపివేసినా, అనర్హులకు వాటిని రద్దు చేసినా ఎంతో ప్రజాధనం ఆదా అవుతుంది. అవినీతి, అక్రమాలు తగ్గుతాయి. కొత్త పథకాల కంటే తక్షణమే చార్జీల భారం తగ్గిస్తే సంక్షేమ పథకాలను ఆశించని వారికి మేలు జరుగుతుంది. ఇక ముందు గతంలో వలె రిటైర్మెంట్ వయసు అరవై సంవత్సరాల నుంచి యాభై ఎనిమిది సంవత్సరాలకి తగ్గించి, ఆ ఖాళీలను కొంతకాలం తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేస్తే పేద నిరుద్యోగులకి మేలు జరుగుతుంది. కొద్దిమంది ఉద్యోగులెవరైనా ఆర్థిక ఇబ్బందులతో పొడిగింపు కోరితే ప్రభుత్వం అంగీకరించవచ్చు. అప్పుడు ఉద్యోగులకీ ఇబ్బంది ఉండదు.
– తిరుమలశెట్టి సాంబశివరావు