Social Justice in India: కులగణన మంత్రం ఫలిస్తుందా
ABN , Publish Date - May 10 , 2025 | 03:31 AM
రాహుల్ గాంధీ కులగణన కోరిన తరువాత, నరేంద్ర మోదీ ఇప్పుడు దానిని స్వీకరించి కులగణన నిర్వహించాలని ప్రకటించారు. గతంలో ఈ విషయం పై అనేక వివాదాలు మరియు నిరసనలతో సహా, రాజకీయ, సామాజిక రంగాలలో కులగణన ప్రత్యేకమైన పరిణామాలు కలిగిస్తుంది.

ప్రేమ, యుద్ధం, రాజకీయాలు. వీటిల్లో ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు. కులగణన కోరిన రాహుల్గాంధీని అర్బన్ నక్సలైట్ అంటూ విమర్శిస్తూ వచ్చిన నరేంద్ర మోదీ ఇప్పుడు తానే ఆ స్థానంలోకి పోయి కూర్చున్నారు. దేశమంతటా కులగణన జరుపుతామని ప్రకటించారు. ఇలాంటి బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ పరిణామాలు బీజేపీలో చాలా ఉంటాయి. స్వాతంత్ర్యం వచ్చాక గడిచిన 78 ఏళ్ళల్లో 14 మంది ప్రధానులు మారారుగానీ ఒక్కరూ కులగణన జరపడానికి సాహసించలేదు. బ్రిటిష్ ప్రభుత్వంలో జనాభా లెక్కల కమిషనర్గా ఉన్న జె.హెచ్. హట్టన్ 1931లో మన దేశంలో కులగణన నిర్వహించాడు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉండగా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ 2011లో సామాజిక, ఆర్థిక, కులగణన (SECC) నిర్వహించింది. దాని మీద నిరసనలు చెలరేగడంతో ఆ నివేదికను బయటికి రాకుండా నిలిపివేశారు. మనం ఇప్పటికీ తొంభైయేళ్ళ క్రితపు గణాంకాల ఆధారంగానే దేశ జనాభాలో కులాల శాతాల గురించి మాట్లాడుతున్నాం. జనాభా లెక్కల్లో ఎస్సీ, ఎస్టీల వరకు వివరాలు సేకరిస్తుంటారు. అది కూడ 2011 తరువాత ఆగిపోయింది. వెనుకబడిన తరగతులు, ముస్లిం సామాజికవర్గాల సంఖ్య, శాతాల విషయంలోనే తరచూ అనేక ఉహాగానాలు, వివాదాలు చెలరేగుతుంటాయి. ముస్లిం జనాభా వేగంగా పెరిగిపోతూ సమీప భవిష్యత్తులో ఇండియా ఒక ఇస్లామిక్ దేశంగా మారిపోతుందని సంఘ్ పరివార్ తరచూ ప్రచారం చేస్తుంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ 2005లో ముస్లిం సమాజంలోని వెనుకబడిన తరగతులకు బీసీ–ఈ జాబితాలో 4శాతం రిజర్వేషన్ కల్పించినపుడు పెద్ద దుమారం రేగింది. ముస్లిం బీసీల జనాభా అంత లేదని, జనాభా గణాంకాలను శాస్త్రీయంగా సేకరించకుండా రిజర్వేషన్ కల్పించారని సంఘ్ పరివార్ వర్గాలు హైకోర్టును ఆశ్రయించాయి. న్యాయస్థానం కూడా దీన్ని పరిగణనలోనికి తీసుకుంది. కానీ, జనాభా గణాంకాలను శాస్త్రీయంగా ఎలా సేకరించాలో మాత్రం ప్రభుత్వానికి సూచించలేదు.
ఓబీసీలకు రాజ్యాంగం తొలి ప్రతిలో రిజర్వేషన్ లేదు. తమిళనాడులో నిరసనలు చెలరేగాక, సుప్రీంకోర్టు జోక్యంతో రాజ్యాంగానికి తొలి సవరణగా ఆర్టికల్ 15(4) చేర్చి రాష్ట్రాల స్థాయిలో విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించారు. అయితే, కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఈ సౌకర్యం కల్పించలేదు. ఓబీసీలు సామాజిక, విద్యా, ఆర్థిక రంగాల్లో ఎదుర్కొంటున్న వివక్ష, వెనుకబాటుతనం, పేదరికాలను తొలగించడానికి అవసరమైన సూచనలు ఇవ్వడానికి 1979 జనవరి 1న అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయి బీపీ మండల్ కమిషన్ వేశారు. దేశ జనాభాలో ఓబీసీలు 54శాతం ఉన్నారని మండల్ కమిషన్ తేల్చింది. వారికి కేంద్ర ప్రభుత్వంలో, ప్రభుత్వరంగ సంస్థల్లో 27 శాతం రిజర్వేషన్ కల్పించాలని సూచించింది. ఆ సిఫార్సుల్ని ఓ దశాబ్దం తరువాత 1990 ఆగస్టు 7న అప్పటి ప్రధాని వీపీ సింగ్ ఆమోదించారు. ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించడం సహించలేని ఆధిపత్య కులాలు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయాయి. ఉత్తర భారతదేశంలో నిరసన జ్వాలలు చెలరేగాయి. 1984 లోక్సభ ఎన్నికల్లో రెండు స్థానాలు గెలుచుకుని పార్లమెంటులో ప్రవేశించిన బీజేపీ, 1989 ఎన్నికల్లో బాగా పుంజుకుని 85 స్థానాలకు చేరుకుంది. ఆ పార్టీ తన రాజకీయ భవిష్యత్తును ఆధిపత్య కులాల నిరసనల్లో గుర్తించింది. ‘మండల్కు వ్యతిరేకంగా కమండలం’ చేపట్టి రామ్ రథయాత్ర మొదలెట్టింది. ఇందులో బీజేపీకి నాలుగు లక్ష్యాలున్నాయి.మొదటిది: రాజకీయ రంగంలో ఆధిపత్య కులాల ప్రతినిధిగా ప్రకటించుకోవడం. రెండోది: ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించిన వీపీ సింగ్ ప్రభుత్వాన్ని కూల్చేయడం. మూడోది: ముస్లింల నుంచి హిందూ మతానికి ముప్పు పొంచి ఉందని ప్రచారం చేయడం. నాలుగోది: దేశంలోని ఓబీసీ తదితర బహుజనుల దృష్టిని రిజర్వేషన్ల నుంచి అయోధ్య రాముని వైపు మళ్ళీంచడం. రామ్ రథయాత్ర పెట్టుకున్న లక్ష్యాల్లో బీజేపీ కొన్నింటిని పూర్తిగా కొన్నింటిని పాక్షికంగా సాధించింది. సంఘ్ పరివార్ రోడ్ మ్యాప్లో 1992 నాటి బాబ్రీ మసీదు కూల్చివేతతో ఒక ఘట్టం ముగిసింది. ఆ మహాసంస్థ తను చేపట్టిన ‘పవిత్ర యుద్ధం’లో హిందూ ఎస్టీ, ఎస్సీ, బీసీలలో చెప్పుకోదగ్గ భాగాన్ని తన కాల్బలంగా మార్చుకోగలిగింది. ఈ పరిణామం 2002 నాటి గుజరాత్ అల్లర్లలో స్పష్టంగా కనిపించింది. సంఘ్ పరివార్ కులాలను గుర్తించదు. హిందూ సమాజం మొత్తం ఒకే మతం అనేది దాని సిద్ధాంతం. ఈ సిద్ధాంతానికి ప్రభావితులైన ఎస్టీ, ఎస్సీ, బీసీ నేతలు కొందరు బీజేపీకి తమ శక్తిమేర సేవలు అందించారు. వారిలో ప్రముఖ అంబేడ్కరైట్లు కూడ వున్నారు.
బయటి ప్రపంచానికి అంతగా తెలియదుగానీ ఆదివాసుల్లో తండాకు ఒక మతం ఉంటుంది. మరింత లోతుకు వెళితే ఒక్కో సమూహానికి ఒక్కో మత విశ్వాసం ఉంటుంది. ఇప్పుడు జనాభా లెక్కల్లో ఆ వైవిధ్యాన్ని పూర్తిగా తొలగించేశారు. హిందూ, ఇస్లాం, క్రైస్తవం, సిక్కు, బౌద్ధ జైన మతాల్లో ఏదో ఒకదాన్ని ఆదివాసులు ఎంచుకునేలా జనాభా లెక్కల చట్టాన్ని సవరించారు. భారత ముస్లిం సమాజంలో కూడా శాఖ, కుల వర్గీకరణ తెచ్చి ‘సున్నీ అష్రాఫ్’లకు వ్యతిరేకంగా షియా, సున్నీ బీసీ, ఎంబీసీలను దగ్గరికి చేర్చుకోవడానికి ఒక దశలో బీజేపీ ప్రయత్నించింది. అది తమ ‘పవిత్రయుద్ధం’ ఫార్ములాకే ముప్పుగా మారుతుందని భయపడి ఆ కాడిని దించేసింది. బ్రిటీష్ పాలకులు నేరస్మృతిని ఇంగ్లండు నుండి తెచ్చారు గానీ పౌరస్మృతిని ఇక్కడి స్థానికులనే ఎంచుకోమన్నారు. బెంగాల్ గవర్నర్ జనరల్గా ఉన్న వారెన్ హేస్టింగ్స్ 1772లో హిందూ ప్రతిధుల కోరిక మేరకు మనుధర్మాన్ని పౌరస్మృతిగా ప్రకటించాడు. భారత రాజ్యాంగ రచనా సంఘానికి అధ్యక్షునిగా వ్యవహరించిన బీఆర్ అంబేడ్కర్ ఇక మనుసృతికి కాలం చెల్లింది అని ప్రకటించడం సంఘీయులకు ఆగ్రహాన్ని తెప్పించింది. రాజ్యాంగం 1950 జనవరి 26న అమలులోనికి రాగా, ఆ వెంటనే వచ్చిన ‘ఆర్గనైజర్’ పత్రిక ఫిబ్రవరి 6 సంచిక ‘‘మనువు మన హృదయాలను పాలిస్తుంటాడు’’ అని ప్రకటించింది. హిందూ ఎస్సీ, బీసీ, ఎస్టీలను మత ప్రాతిపదిక మీద తమకు దగ్గరగా తీసుకొని ఓటు బ్యాంకును పెంచుకోవాలనుకుంటున్న సంఘీయులు అంబేడ్కర్ను వ్యూహాత్మకంగా స్వంతం చేసుకుంటున్నారు. అంబేడ్కర్ రచనల్ని వాళ్ళు ఆరు భాగాలుగా విభజిస్తున్నారు. మొదటిది: మనుస్మృతి, కుల అణచివేత మీద అంబేడ్కర్ చేసిన ఘాటైన విమర్శను దాచి పెడతారు. లేదా, వర్ణం తప్ప కులం అనేది అస్సలు హిందూ సాంప్రదాయమే కాదనే వాక్యంతో అంబేడ్కర్ ఆరోపణలన్నింటినీ కొట్టిపడేస్తారు.
రెండవది: ఇస్లాం, ముస్లింల మీద కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అంబేడ్కర్ చేసిన విమర్శల్ని తమ పవిత్ర యుద్ధానికి అనుకూలంగా వాడుకుంటారు. మూడవది: గాంధీ అంబేడ్కర్ల మధ్య సాగిన వివాదాలకు ఎక్కువ ప్రచారం కల్పించి ఎస్సీ, ఎస్టీ, బీసీలు జాతీయ కాంగ్రెస్కు దగ్గర కాకుండా చూసేందుకు వాడతారు. నాలుగవది: కమ్యూనిస్టు పార్టీలను అంబేడ్కర్ తన ప్రధాన శత్రువులని భావించేవారని విస్తృతంగా ప్రచారం చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీలు మార్క్సిజానికి ఆకర్షితులు కాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఐదవది: కుల వివక్ష రద్దుకు అంబేడ్కర్ చూపిన పరిష్కారాల్ని మెచ్చుకుంటూ ఆయన్ని హిందూమత సంస్కర్తగా కొనియాడుతారు. అంబేడ్కర్ పేరులోనే రాముడు (రాంజీ) ఉన్నాడని ఈ మధ్య ప్రత్యేకంగా పేర్కొంటున్నారు. ఆరవది: రాజ్యాంగం మన దేశానికి అంబేడ్కర్ ఇచ్చిన ప్రసాదమని పేర్కొనడమేగాక, తాము ఏది చేసినా రాజ్యాంగానికి విధేయులమై ఉంటున్నామని బుకాయిస్తారు. ఎంతటి ప్రచార హోరుతో ప్రజల్ని సంఘ్ పరివార్ వశీకరిస్తున్నా సమస్త రంగాల్లో కులవివక్ష అనే కఠిన వాస్తవం బహుజనుల్ని ఎప్పుడో ఒకప్పుడు మెలుకువ వచ్చేలా చేస్తుంది. అప్పుడు వాళ్లు కులగణన జరిపించమని తప్పక అడుగుతారు. పైగా, రాహుల్గాంధీ రోజుకు ఒకసారి ‘‘జిస్కే జిత్నీ భాగేదారీ ఉస్కే ఉత్నీ హిస్సేదారి’’ (ఎవరి జనాభా ఎంతో సంపదలో వారికి అంత’) అని నినదిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల భయంతో బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అందరికన్నా ముందుగా కులగణన చేపట్టారు. వెనుకబడిన తరగతులు 27శాతం, అతి వెనుకబడిన తరగతులు 36శాతం, ఎస్సీలు 20శాతం అని బిహార్ ప్రభుత్వం తేల్చింది. ఇప్పుడు ముంపు నీరు బీజేపీ కాళ్ళ కిందికి వచ్చింది. ఆ పార్టీ నిన్నటివరకూ తాను ‘అర్బన్ నక్సలిజం’ అని విమర్శించిన స్థానాన్నే ఎంచుకోక తప్పలేదు. రాజకీయ రంగంతోపాటు సామాజిక, ఆర్థిక రంగాల్లోనూ సమానత్వాన్ని సాధించకపోతే ప్రజలు తిరగబడతారని అంబేడ్కర్ సాక్షాత్తూ రాజ్యాంగ సభలోనే హెచ్చరించాడు. రాజకీయాల్లో ఎస్టీ రాష్ట్రపతిని చూసి అడవిలో ఆదివాసులు, బీసీ ప్రధానిని చూసి మైదానాల్లో బీసీలు సంతృప్తి పడిపోరు. వాళ్ళకు సాంఘిక, ఆర్థిక సమానత్వం కావాలి. వాళ్ళను అడవి నక్సలైట్లు, అర్బన్ నక్సలైట్లు అని ఎద్దేవా చేయవచ్చుగానీ అది పరిష్కారం కాదు. పిక్చర్ అభి బాఖీ హై! డానీ సమాజ విశ్లేషకులు