AP Tourism Policy: పర్యాటకానికి కొత్త రెక్కలు
ABN , Publish Date - May 10 , 2025 | 03:27 AM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక రంగంలో ఐదేళ్లలో రూ.25 వేల కోట్ల పెట్టుబడులు సాధించేందుకు లక్ష్యంగా పెట్టుకుంది. పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించి, పలు పర్యాటక ప్రాజెక్టులను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది.

పర్యాటక రంగంలో ఐదేళ్లలో రూ.25వేల కోట్ల పెట్టుబడులు సాధించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన సౌత్ ఏషియా లీడింగ్ ట్రావెల్, టూరిజం ఎగ్జిబిషన్–2025లో పాల్గొన్న రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించిన విషయం తెలిసిందే. అందుకు తగ్గట్టుగా పెట్టుబడిదారులను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించడం, మెరుగైన రాయితీలు, ప్రోత్సాహకాలు అందించడం అభినందనీయం. పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించిన 12వ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. పర్యాటక రంగంలోని పరిశ్రమలకు ప్రోత్సాహాన్ని ఇస్తూ, పర్యాటకానికి మద్దతుగా ఉండే వ్యవస్థలను బలోపేతం చేసుకుంటూ, ఉప విభాగాలను అభివృద్ధి చేసుకుంటూ పర్యాటక రంగ సమగ్రాభివృద్ధికి బాటలు వేసేలా కూటమి ప్రభుత్వం నూతన పాలసీని రూపొందించింది. కూటమి ప్రభుత్వం కొత్త పర్యాటక విధానం ప్రకటించాక ఆతిథ్య రంగంలో ప్రముఖ సంస్థలు రాష్ట్రంలో ఏర్పాటుకు ముందుకు వస్తున్నాయి. దీనిలో భాగంగానే ఇప్పటికే దాదాపు 18 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించే విధంగా రూ.8,059 కోట్లతో 27 ప్రముఖ హోటళ్లు పనులు ప్రారంభించడం ఆహ్వానించదగ్గ పరిణామం. రాబోయే 23 ఏళ్లలో హోటళ్ల గదుల సంఖ్య 40–50 వేలకు పెరగాలని కూటమి ప్రభుత్వం ఆకాంక్షిస్తోంది. ఒకప్పుడు భారతీయుల దృష్టిలో పర్యాటకమంటే తీర్ధయాత్రలు, పుణ్యక్షేత్రాలు మాత్రమే.
ఇప్పుడు యువత చారిత్రక, ప్రాకృతిక ప్రదేశాల సందర్శనకు ప్రాధాన్యమిస్తోంది. మన రాష్ట్రం ఇటు దేవాలయాలు, పుణ్యక్షేత్రాలతో పాటు చారిత్రక, ప్రకృతి సౌందర్య స్థలాలకు నిలయం. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమల దేవస్థానం, శ్రీకాళహస్తి, శ్రీశైలం, కాణిపాకం, విజయవాడ కనకదుర్గ దేవాలయం, సింహాచలం, అంతర్వేది, పుట్టపర్తి లాంటి పుణ్యక్షేత్రాలు, అరకు లోయ, బొర్రా గుహలు, పాపి కొండలు, హార్సిలీ హిల్స్, కొల్లేరు సరస్సు, పులికాట్ సరస్సు లాంటి ప్రాకృతిక ప్రదేశాలు, అమరావతి స్తూపం, ఉదయగిరి కోట, వెంకటగిరి కోట, చంద్రగిరి కోట, తిమ్మమ్మ మర్రిమాను, ధవళేశ్వరం బ్యారేజ్ లాంటి చారిత్రక ప్రదేశాలు అనేకం ఉన్నాయి. దేశంలోనే మూడో అతిపెద్ద సముద్ర తీరం కలిగి ఉండడం రాష్ట్రానికి అదనపు ఆకర్షణ. బ్లూ ఫాగ్ బీచ్గా ఎంపికైన రుషికొండ బీచ్తో పాటు, కాకినాడ, సూర్యలంక, మైపాడు, రామాపురం బీచ్లకూ బ్లూ ఫాగ్ గుర్తింపు సాధించేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. వీటితో పాటు తీరప్రాంతాల్లో 283 బీచ్లను అభివృద్ధి చేసేలా కూటమి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వీటిలో 35 బీచ్లను రోజూ లక్షలమంది సందర్శిస్తుంటారు. ప్రత్యేకించి కార్తీక మాసంలో రద్దీ ఎక్కువ. విదేశీ పర్యాటకులు మాత్రం సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య ఎక్కువగా వస్తుంటారు. బ్లూ ఫాగ్ గుర్తింపు ఉన్న బీచ్లకే వారు ప్రాధాన్యం ఇస్తుంటారు. వాటిలో భద్రతతో పాటు, ఇతర వసతులూ ఉంటాయని వారి నమ్మకం. అందుకే కూటమి ప్రభుత్వం బ్లూ ఫాగ్పై దృష్టి సారించింది. ప్రస్తుతానికి ఏటా సుమారుగా 1.70 లక్షల మంది విదేశీ పర్యాటకులు రాష్ట్రానికి వస్తున్నారు. బీచ్లను మెరుగుపరిచి, గుర్తింపు సాధించి ఈ సంఖ్యను వచ్చే రెండు, మూడేళ్లలో 5 లక్షలకు పెంచాలన్నది ప్రభుత్వ ప్రణాళిక. మారుతున్న పర్యాటకుల ఆలోచనా విధానాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అనేక సందర్శనీయ స్థలాలను ఆకర్షణీయంగా మారుస్తోంది. ఇక్కడి ఆధ్యాత్మికతను, సంస్కృతి, సాంప్రదాయాలను, ప్రకృతి సౌందర్యాలను అనుభూతి చెందడానికి లక్షలమంది యాత్రికులు ఇతర రాష్ట్రాల నుండి, విదేశాల నుండి మన రాష్ట్రానికి వస్తున్నారు.
పర్యాటకులను మరింత ఆకర్షించేలా టెంపుల్, ఎకో, అడ్వెంచర్, వెల్నెస్, ఆగ్రి టూరిజంలను కలుపుతూ కూటమి ప్రభుత్వం టూరిజం సర్క్యూట్ను ఏర్పాటు చేస్తోంది. రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రాజెక్టులను రూపొందిస్తున్నారు. దీనిలో భాగంగా కృష్ణానదిపై నీటిలో తేలియాడే రెస్టారెంట్ (ఫ్లోటింగ్ రెస్టారెంట్), విజయవాడలో బెర్మ్ పార్క్, కోనసీమ బ్యాక్ వాటర్లో సింగిల్ బెడ్రూమ్ లగ్జరీ హౌస్ బోటు, విశాఖపట్టణం నుంచి చెన్నై, చెన్నై నుంచి భువనేశ్వర్, భువనేశ్వర్ నుంచి కోల్కతా తీరం మీదుగా ప్రత్యేకంగా క్రూయిజ్ నౌక, అరకులో ట్రెక్కింగ్, రాక్ క్లైంబింగ్, పారా గ్లైడింగ్, బంగీ జంపింగ్, మోటార్ బైక్ టూరింగ్, చంద్రగిరి కోట వద్ద సౌండ్ లైట్ షో, పోలవరం నుంచి పట్టిసీమ మధ్య తీగల వంతెన, విజయవాడలోని భవానీ ద్వీపంలో థీమ్ పార్క్, వాటర్ పార్క్ లాంటివి ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా పర్యాటక రంగంలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో భారీ, మెగా ప్రాజెక్టుల ఏర్పాటే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పర్యాటక భూ కేటాయిపుల విధానం 2024–29 తీసుకొచ్చింది.రూ.50 కోట్ల పైన పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే సంస్థలకు 66 నుంచి 99 ఏళ్లకు భూములను లీజు/ఫ్రీ హోల్డ్ విధానంలో కేటాయించనున్నారు. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి అనుమతితో మంత్రివర్గం ఆమోదం తర్వాతే కేటాయింపులు చేసేలా కొత్త విధానం రూపొందించారు. రూ. 50 కోట్ల కంటే తక్కువ పెట్టుబడులు పెట్టే సంస్థ (ఎంఎస్ఎంఈ) లకు బిడ్డింగ్ ప్రాతిపదికన భూ కేటాయింపులు చేస్తారు.
ఈ విధంగా పర్యాటక రంగంలో భారీ పెట్టుబడులు తీసుకొచ్చేందుకు కూటమి ప్రభుత్వం గత పది నెలల వ్యవధిలో కీలక నిర్ణయాలు తీసుకుంది. పర్యాటకులకు కావాల్సింది భద్రత, పరిశుభ్రత. ఈ రెండూ లోపించినప్పుడు ఎంతటి అద్భుత సందర్శనీయ స్థలాలు ఉన్నా పర్యాటకులు రారు. అందుకే కూటమి ప్రభుత్వం ఈ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించింది. వీటితో పాటు పర్యాటక ప్రాంతాల్లో పరిశుభ్రమైన వాతావరణంలో ఆహారం తయారుచేయడంపై జాగ్రత్తలు తీసుకొంటుంది. పర్యావరణం పర్యాటక రంగానికి జీవం. అభివృద్ధి కోసం వేస్తున్న అడుగులు జీవావరణాన్ని ధ్వంసం చేయకుండా కూటమి ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకుంటుంది. ‘భవిష్యత్తు అంతా పర్యాటకానిదేనని... ప్రపంచ పర్యాటకానికి ఏపీ గమ్యస్థానంలా మారుతుందని’ విజయవాడలోని కృష్ణానది పున్నమిఘాట్ నుంచి శ్రీశైలానికి వెళ్లే సీప్లేన్ను ప్రారంభించిన సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రాజధాని అమరావతి ప్రాంతాన్ని కూడా చారిత్రక, సాంస్కృతిక, ఆధ్యాత్మక, పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడం రాష్ట్రానికి మరింత కలిసొచ్చే అంశం. రాష్ట్రంలోని బౌద్ధారామాలు, స్మారకాలపై వియత్నాం లాంటి దేశాలు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో రెండు బౌద్ధ సర్క్యూట్ లను అభివృద్ధి చేసేలా కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది ఈ విధంగా ‘అతిథి దేవోభవ’ అనే ప్రాచీన సూక్తికి ఏపీ పర్యాటక రంగం నిలువుటద్దంలా నిలబడుతున్నది.
- కూసంపూడి శ్రీనివాస్జ,
నసేన రాష్ట్ర అధికార ప్రతినిధి