AP Cultural Revival: ఆరంభమైన సాంస్కృతిక పునరుజ్జీవం
ABN , Publish Date - May 10 , 2025 | 03:18 AM
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కళా, సాంస్కృతిక రంగానికి నూతన ఊపునిచ్చి, పురస్కారాల పునరుద్ధరణతో కళాకారులకు గౌరవం కలిగించింది. పూర్వ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన సాంస్కృతిక కార్యక్రమాలకు మళ్లీ ప్రోత్సాహం లభిస్తూ, కళారూపాల పరిరక్షణకు దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందిస్తున్నది.

కళలను మన సాంస్కృతిక వారసత్వంగా భావించి ప్రోత్సహించే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం కళా సాంస్కృతిక రంగానికి కొత్త ఊపిరులూది రాష్ట్రంలో కళా రంగంలో నూతన ఉత్తేజానికి, కళాకారులలో ద్విగుణీకృతమైన ఉత్సాహానికి నాంది పలికింది. గత ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను, కళాకారులను ఉగాది రోజు సత్కరించి, ప్రదానం చేసే ఉగాది పురస్కారాలు, కళారత్న (హంస) పురస్కారాల ఊసే లేదు. ఈ సంవత్సరం ఉగాది రోజున ఆ నిర్లక్ష్యాన్ని సరిచేస్తూ దాదాపు 200 మందికి పైగా వివిధ రంగాల మహనీయులను కళారత్న(హంస)పురస్కారాలు, ఉగాది పురస్కారాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా సత్కరించింది. అలాగే ఏప్రిల్ 16 సంఘసంస్కర్త, తొలి ఆధునిక నాటక రూపకర్త కందుకూరి వీరేశలింగం జయంతి సందర్భంగా తెలుగు నాటక రంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించి రాష్ట్రస్థాయి, జిల్లా స్థాయి రంగస్థల పురస్కారాలను అందజేశారు. ఇటీవల నిర్వహించిన తెలుగు నాటక రంగ దినోత్సవంలో పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ నంది పురస్కారాలను, నంది నాటకోత్సవాలను ఈ సంవత్సరం పునరుద్ధరించబోతున్నామని ప్రకటించారు. రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వంలో సాంస్కృతిక, నాటక సంస్థలకు కార్యక్రమాల నిర్వహణకు సాంస్కృతిక శాఖ ద్వారా ఆర్థిక సహకారం అందించే పథకాన్ని చంద్రబాబునాయుడు ప్రవేశపెట్టి, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు రాష్ట్రంలో కొత్త ఊపు తెచ్చారు. అయితే దురదృష్టవశాత్తు గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల పాటు ఈ పథకాన్ని నిర్లక్ష్యం చేయడం కళా, నాటక సంస్థలకు తీరని ఆవేదన మిగిల్చింది.
ఇప్పుడు కూటమి ప్రభుత్వం తిరిగి ఈ పథకాన్ని పునరుద్ధరింపచేయడం, సొంతంగా నిధులు సమకూర్చుకుని, ఎంతో వ్యయప్రయాసలతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే సంస్థలకు గొప్ప ఊరటనిచ్చింది. గతంలో ఒక వెలుగు వెలిగి కాలక్రమేణా అంతరించిపోతున్న జానపద కళారూపాలన్నిటినీ ఒక వేదిక పైకి చేర్చి రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో ప్రదర్శనలు ఏర్పాటు చేసి ప్రోత్సహించి, వాటిని డిజిటల్ రూపంలో భవిష్యత్తు తరాల కోసం నిక్షిప్తపరచాలి. అలాగే, ఖజురహో జాతీయ నృత్య ఉత్సవాల తరహాలో శాస్త్రీయ నృత్య ఉత్సవాలు కూచిపూడిలోనో లేదా ఒక్కో సంవత్సరం ఒక ప్రముఖ పుణ్యక్షేత్రంలోనో, వివిధ నగరాలలోనో నిర్వహించడం ద్వారా శాస్త్రీయ నృత్యం పట్ల బాలలలో ఆసక్తి పెంచాలి. అంతేకాక, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాలలకు అదనపు నిధులు కేటాయించి అభివృద్ధి చేయడంతో పాటు, ప్రతి జిల్లా కేంద్రంలో ఒక లలితకళల కళాశాలను దీర్ఘకాలిక ప్రణాళికతో ఏర్పాటు చేయాలి. అలాగే, ప్రతి జిల్లా కేంద్రంలో సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శనకు అనువుగా ప్రదర్శనశాలలు, ఆయా ప్రాంతాలలో ఉన్న పరిశ్రమల సహకారంతో (కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా) నిర్మించాలి. ఇంకా, రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ సంస్థల ఆధీనంలో ఉన్న ఆడిటోరియాలలో గుర్తింపు పొందిన కళా సంస్థలకు కార్యక్రమాల నిర్వహణకు, విద్యుత్ చార్జీలు చెల్లించి ఉచితంగా ఉపయోగించుకోవడానికి అవకాశం కల్పించాలి. శ్రీకృష్ణదేవరాయలు కళా, సాంస్కృతిక, సాహితీ రంగాలకు పెద్దపీట వేసిన విషయం అందరికీ తెలిసిందే. అందుకే 500 సంవత్సరాలు దాటినా ఆయన గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటున్నాం. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం కళా సాంస్కృతిక రంగానికి చేయూతనిచ్చి, చరిత్రలో నిలిచిపోవాలని కళాకారులు భావిస్తున్నారు.
-డాక్టర్ గుర్రాల రవికృష్ణ కళారత్న,
కందుకూరి రాష్ట్రస్థాయి రంగస్థల పురస్కార గ్రహీత