Manthan Samvad: నవీన ఆలోచనల మంథన్ సంవాద్
ABN , Publish Date - Oct 01 , 2025 | 12:57 AM
ఆలోచనలు స్వేచ్ఛగా పంచుకునే వేదికగా నిలిచిన మంథన్ సంవాద్ అక్టోబర్ 2న, హైదరాబాద్ శిల్పకళావేదికలో ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు జరుగుతోంది. ఈ కార్యక్రమంలో రచయితలు..
ఆలోచనలు స్వేచ్ఛగా పంచుకునే వేదికగా నిలిచిన ‘మంథన్ సంవాద్’ అక్టోబర్ 2న, హైదరాబాద్ శిల్పకళావేదికలో ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు జరుగుతోంది. ఈ కార్యక్రమంలో రచయితలు, శాస్త్రవేత్తలు, న్యాయవాదులు, కళాకారులు, జర్నలిస్టులు, విద్యార్థులు, సామాన్య పౌరులు.. ఇలా అన్ని వర్గాల వారూ ఒకే వేదికపైకి చేరి ‘మనకు నిజంగా ముఖ్యమైన విషయాలు’ చర్చించనున్నారు. ఇది రాజకీయాలకు అతీతమైన వేదిక. మంథన్ ఇప్పటి వరకు 500కు పైగా ప్రసంగాలు నిర్వహించింది. 60,000 మందికి పైగా సభ్యులను కలిగివుంది. పౌరుల జీవితానికి నేరుగా సంబంధించిన ప్రజాస్వామ్యం, ఆర్థికవ్యవస్థ, పర్యావరణం, విజ్ఞానం, చరిత్ర, మానవ హక్కులు మొదలైనవి ఇక్కడ చర్చించే అంశాలు. ప్రతీ ఏడాది గాంధీ జయంతి రోజున ఈ చర్చ జరగడం కూడా దీని విలువను పెంచుతోంది. ఈసారి వేదికపైకి రాబోతున్న వక్తలు అందరూ తమ రంగాల్లో గుర్తింపు పొందినవారు. రక్షణ రంగ నిపుణుడు ప్రవీణ్ సావ్నీ దేశ భద్రత, సరిహద్దు పరిస్థితులు, అంతర్జాతీయ సంబంధాలపై అవగాహన కలిగించనున్నారు. అంతర్జాతీయంగా పేరుపొందిన కమెడియన్ వీర్ దాస్ తన హాస్యంతో కూడిన వ్యాఖ్యలతో సమాజంలోని అన్యాయాలపై గొంతు వినిపిస్తారు. చరిత్రకారుడు, అశోక యూనివర్సిటీ ఛాన్సలర్ రుద్రాంగ్షు ముఖర్జీ భారత చరిత్రలోని కీలక ఘట్టాలు మన ప్రస్తుత సమాజానికి ఎలా ముడిపడి ఉన్నాయో చెప్పనున్నారు. పౌరహక్కులు, మీడియా స్వేచ్ఛలపై ‘ది వైర్’ సీనియర్ ఎడిటర్ అర్ఫా ఖానమ్ షెర్వాణీ మాట్లాడనున్నారు. నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్సెస్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎల్.ఎస్. శశిధర్ మన దైనందిన జీవితంలో శాస్త్రం ఎంత ముఖ్యమో వివరించనున్నారు. ప్రజా విధాన ఆర్థికవేత్త రథిన్ రాయ్ భారత ఆర్థిక వ్యవస్థ దిశపై విశ్లేషణ ఇస్తారు. మానవ హక్కుల న్యాయవాది కాలిన్ గోన్సాల్వెస్ రాజ్యాంగం, న్యాయం, సమాన హక్కుల అంశాలను ప్రస్తావించనున్నారు. ఈ వక్తలంతా సమాజానికి అవసరమైన విస్తృత చర్చను తెరపైకి తీసుకువస్తారు. మంథన్ సంవాద్ ప్రత్యేకతలలో ఒకటి దాని ఉచిత ప్రవేశం, రిజిస్ట్రేషన్ ఫీజు లేదు. మధ్యాహ్న భోజనం కూడా ఉచితం. హైదరాబాద్ నగరం ఒకవైపు సంప్రదాయ విలువలను కాపాడుకుంటూనే, మరోవైపు కొత్త ఆలోచనలను స్వీకరించే ధైర్యం కలిగినది. అదే మంథన్ స్ఫూర్తి కూడా. పాత, కొత్త ఆలోచనలను కలిపి కొత్త దిశలో ముందుకు తీసుకెళ్లడం. ప్రతి సంవత్సరం దేశం నలుమూలల నుంచి విద్యార్థులు, ప్రొఫెసర్లు, ఆలోచనాపరులు హైదరాబాద్కి వస్తారు. ఇక్కడి చర్చలను విని కొత్త విషయాలు నేర్చుకుంటారు, తిరిగి వెళ్లిన తర్వాత ఆ ఆలోచనలను తమ సమాజంతో పంచుకుంటారు. మంథన్ కేవలం ఒక రోజు జరిగే సభ మాత్రమే కాదు, అది ఒక ఆలోచనల విత్తనం.
– విక్రమ్, మంథన్