Share News

Legacy Of Sadhu Sharma: నిత్య యవ్వనమే సాధు సందేశం

ABN , Publish Date - Jul 22 , 2025 | 03:06 AM

నేను ఒక ఏడాది క్రితం నా ఫేస్‌బుక్ వాల్‌పై మృత్యువు గురించి రాసిన ఒక కవితకు స్పందిస్తూ సాధు సుబ్రహ్మణ్య శర్మ..

Legacy Of Sadhu Sharma: నిత్య యవ్వనమే సాధు సందేశం
Legacy Of Sadhu Sharma

నేను ఒక ఏడాది క్రితం నా ఫేస్‌బుక్ వాల్‌పై మృత్యువు గురించి రాసిన ఒక కవితకు స్పందిస్తూ సాధు సుబ్రహ్మణ్య శర్మ ఇలా కామెంట్ చేసారు: ‘‘As age increases try to become younger. Don't await death. Let death take one unawares while fully immersed in executing a huge project, as in a battlefield!’’ (‘‘వయసు పెరిగే కొద్దీ పడుచువారయ్యేందుకు ప్రయత్నించండి. చావు కోసం ఎదురుచూడవద్దు. ఏదో ఒక పెద్ద కార్యంలో పూర్తిగా నిమగ్నమై ఉండగా చావు మనకే తెలీకుండా వచ్చి మనల్ని లాక్కెళ్ళిపోవాలి, యుద్ధరంగంలోలాగ.’’ – సాధుశర్మ) సాధుశర్మ పరిపూర్ణ జీవితాన్ని ఆస్వాదించారు. ఈ ప్రపంచాన్ని ప్రేమించారు. తన చుట్టూ ఉన్న పిల్లలను ప్రోత్సహించారు. 90 ఏళ్ల వయసులో కూడా ఈ ప్రపంచాన్ని మార్చటానికి కొత్తకొత్త తాత్త్వికభూమికల గురించి అన్వేషిస్తూ, తాను కనుగొన్న సత్యాలను ప్రపంచంతో పంచుకొంటూ జీవించారు. పైన ఆయనే చెప్పినట్లు మరణించే సమయంలో కూడా ఏదో పెద్ద ప్రాజెక్టును ఊహిస్తూ ఉండి ఉంటారు.


లక్ష్మీనరసింహ శర్మ, సుబ్బమ్మ దంపతులకు 1932 మార్చి 6న సాధు సుబ్రహ్మణ్య శర్మ జన్మించారు. వీరి ప్రాథమిక చదువు బళ్ళారిలోను, కాలేజి చదువు అనంతపురం, హైదరాబాద్‌లోను జరిగాయి. ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖలో వివిధ హోదాలలో పనిచేసి, చివరకు జనరల్ మేనేజర్ ఇన్‌చార్జిగా 1990 మార్చి 31న పదవీ విరమణ చేసారు. ఈ జూలై 18న కాకినాడలోని స్వగృహంలో 93 ఏళ్ళ వయసులో మరణించారు. సాధు సుబ్రహ్మణ్య శర్మ జ్ఞానదాహం అపారం. కవిత్వం, చరిత్ర, భాషాసంబంధ పరిశోధన, తత్త్వశాస్త్రం వంటి రంగాలలో వారు చేసిన ప్రామాణిక రచనలు అసాధారణం. ‘సాధువాడిమాట–నవసహస్రాబ్ది బాట’ అనే మకుటంతో సమకాలీన అంశాలు, నైతిక విలువలపై పద్యాలు రాశారు. ‘కాలవాహిని’ పేరుతో కవిత్వం రాశారు. అక్షరాలు దిద్దనవసరం లేకుండా తెలుగును బోధించేందుకు ‘సాధుబాల శిక్ష’ పాఠ్య పుస్తకం రాశారు. ‘New Frontiers of Philosophy for an Alternate Model of Society or the Human Manifesto’, ‘Dialectics of Evolution, Systems Approach and New frontiers of Philosophy’, ‘Fight for Peace and Struggle for an Ideal Society’ వంటి పుస్తకాలు ఇంగ్లీష్‌లో రాశారు. వీటిలో మొదటి పుస్తకం మానవజాతి ఎదుర్కొంటున్న సాంఘిక, ఆర్థిక, రాజకీయ పర్యావరణ సంక్షోభాలను చర్చిస్తుంది. సమకాలీన సమాజాన్ని, మానవ జీవనాన్ని పునర్నిర్మించే దిశగా ఒక గొప్ప మేధావి చేసిన ఆలోచనలు ఇందులో ఉన్నాయి. రెండవ పుస్తకంలో చరిత్రను ఒక కొత్త తాత్విక దృష్టితో ఎలా చూడాలో వివరిస్తూ, మరింత శాంతిమయ భవిష్యత్తును, శ్రేయస్సుతో కూడిన సమాజాన్ని సాధించేందుకు ఒక విన్–విన్ వ్యూహాన్ని ప్రతిపాదించారు. చరిత్ర పర్యంతం సామాన్య మానవుడు కేవలం విధేయత కలిగిన ఒక వస్తువుగానే ఉన్నాడని అతను మరింత తెలివైన పాత్ర పోషించాలి అని ఇందులో సాధుశర్మ అంటారు. మూడో పుస్తకంలో ఆధునిక సమాజం, హింస యుద్ధాల నుంచి ఎలా విముక్తి చెంది శాంతి వైపు ప్రయాణించాలో చర్చించారు. 770 పేజీల ‘మేటి భారతదేశం’ రచన మన చరిత్ర మూలాలను అన్వేషిస్తూ రాసిన విశ్లేషణాత్మక గ్రంథం. తెలుగువారు గర్వించదగిన గొప్ప తాత్త్విక రచనలను సుబ్రహ్మణ్య శర్మ చేసారు. వాటిపట్ల తెలుగునాట పెద్దగా చర్చ జరగకపోవటం నిజంగా బాధాకరం.


సాధు సుబ్రహ్మణ్య శర్మ తెలుగు పాఠకులకు ఎక్కువగా తెలిసింది ‘బంకోలా’ నవల ద్వారా. ‘బంకోలా’ అంటే లైట్ హౌస్ అని అర్థం. నవలలోని కథా కాలం 18వ శతాబ్దం. అది విదేశీయులు వ్యాపార నిమిత్తం వచ్చి దేశ రాజకీయాలను గుప్పెట్లోకి తెచ్చుకొంటున్న కాలం. స్వదేశీయులు మూడురకాలుగా విడిపోయారు: ఈ మార్పుని తమకు అనుకూలంగా మలచుకొని బాగుపడాలనుకొన్నవారు కొందరు, ‘రాజెవ్వడైతే మాత్రం నా కష్టమే కదా నాకు దిక్కు’ అనుకొని తటస్థంగా ఉండిపోయినవారు కొందరు, రాబోతున్న ఉపద్రవాన్ని పసిగట్టి సమాజాన్ని అప్రమత్తం చేయటానికి ప్రయత్నించిన ఆలోచనాపరులు మరికొందరు. వీరందరి మధ్యా సంఘర్షణ ఫలితంగా జరిగిన నాటకీయ పరిణామాలే బంకోలా నవల. కథానాయకుడు భైరి, ఓడల యజమాని నరసింహనాయకర్ కొడుకు. భైరి ఆలోచనాపరుడు, ఆంగ్లేయ స్నేహితుల నుంచి ప్రపంచ విజ్ఞానం గ్రహిస్తాడు, బ్రిటిష్ రాజకీయ ఆధిపత్య ఆలోచనలను గుర్తిస్తాడు. యానాం ఫ్రెంచివారి వద్ద గుమస్తాగా పనిచేస్తూ వారి దాష్టీకాలను ఎదిరించి గొడవపడతాడు. మంజరి అనే వేశ్య ద్వారా విదేశీయుల దోపిడీని తెలుసుకొని ఢిల్లీ సుల్తానును కలిసి విదేశీయులను నిలువరించమని కోరటానికని ఢిల్లీ వెళతాడు. అక్కడ ఎవరూ ఇతని మాట ఖాతరు చేయకపోవటంతో తిరిగి కోరంగి వచ్చేస్తాడు. మరదలు పరదేశిని పెళ్ళాడి వ్యాపారంలో విజయం సాధిస్తాడు. అయితే బ్రిటిష్ వ్యతిరేక భావాలతో ఉన్నందుకు భైరి కొడుకును బ్రిటిష్ వారు హతమారుస్తారు. చివరకు, 1789 డిసెంబర్ 10న వచ్చిన కోరంగి సునామీలో భైరి, పరదేశి కొట్టుకుపోయి మరణించటంతో నవల ముగుస్తుంది. ‘బంకోలా’ నవలలో సుబ్రహ్మణ్య శర్మ ఆ కాలపు సామాజిక సంఘర్షణను నేపథ్యంగా తీసుకోవటం వల్ల ఇది గొప్ప చారిత్రక నవలగా రూపుదిద్దుకొంది. తెలుగులో ఈ కాలానికి సంబంధించి సామాన్యుల జీవితాలను ప్రతిబింబించే సాహిత్యం పెద్దగా లేదు. ఆ లోటు ఈ పుస్తకం తీర్చటంతో తెలుగు పాఠకులు దీనిని అపూర్వంగా ఆదరించారు.


ఇవేగాక, సాధుశర్మ రాసిన కొన్ని అముద్రిత రచనలూ ఉన్నాయి. ‘జహిశత్రుల మహాబాహో’, ‘History of Freedom Struggle’, స్వల్ప సంకేతాలతో సకల భాషలను రాసే విశ్వజనీన లిపిని కనిపెడుతూ ఆయన రాసిన మరో గ్రంథం ఇంకా అముద్రితాలే. సాధు సుబ్రహ్మణ్య శర్మ ‘సాధు ప్రైవేట్ లైబ్రేరీ’ని స్థాపించి స్కూల్ విద్యార్థుల కోసం స్వయంగా నడిపారు. పిల్లలు ఆటలు ఆడుకోవటానికి ఒక ఇల్లును అద్దెకు తీసుకొని అన్ని రకాల ఆట వస్తువులను వారికి అందుబాటులో ఉంచారు. ఇలా నిత్యయవ్వనంతో జీవించటమే ఆ గొప్ప తత్త్వవేత్త మనకు ఇచ్చిన సందేశం.

-బొల్లోజు బాబా

Updated Date - Jul 22 , 2025 | 03:06 AM