Remembering Malli Mastan Babu: పర్వతారోహణే ఊపిరిగా...
ABN , Publish Date - Sep 03 , 2025 | 05:42 AM
పర్వతారోహణే శ్వాసగా, జీవితాశయంగా జీవించారు మల్లి మస్తాన్బాబు. కేవలం 172 రోజుల్లో ఏడు ఖండాల్లోని ఏడు అత్యున్నత శిఖరాలను అవలీలగా అధిరోహించి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ ...
పర్వతారోహణే శ్వాసగా, జీవితాశయంగా జీవించారు మల్లి మస్తాన్బాబు. కేవలం 172 రోజుల్లో ఏడు ఖండాల్లోని ఏడు అత్యున్నత శిఖరాలను అవలీలగా అధిరోహించి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో స్థానం సంపాదించారాయన. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం మండలం గాంధీ జనసంఘం గ్రామంలో 1974 సెప్టెంబర్ 3న ఒక సాధారణ గిరిజన కుటుంబంలో మల్లి జన్మించారు. ఆయనకు చిన్నప్పటి నుంచే కొండలెక్కడం అంటే మహా సరదా. కోరుకొండ సైనిక పాఠశాలలో చదివే సమయంలో.. తన సీనియర్ విద్యార్థి ఎం.ఉదయభాస్కరరావు ఎవరెస్ట్ను అధిరోహించే క్రమంలో మృతి చెందారు. ఎప్పటికైనా ఆ పర్వతాన్ని అధిరోహించడం ద్వారా భాస్కరరావుకు నివాళి అర్పించాలనుకున్నారు మల్లి. అందుకోసం పర్వతారోహణలో శిక్షణ తీసుకున్నారు. మొదటగా 2006 జనవరి 19న అంటార్కిటికా ఖండంలోని 4,897మీటర్ల ఎత్తున్న ‘విన్సఫ్ మాసిన్’ శిఖరాన్ని అధిరోహించారు. అలా తన పర్వతారోహణ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అదే ఏడాది మే 21న ఎవరెస్ట్ శిఖరాన్ని, పలు హిమాలయ పర్వతాలనూ అధిరోహించి తన సీనియర్ విద్యార్థి కన్న కలను నిజం చేశారు. మల్లి బహుభాషా కోవిదుడు. గొప్ప పర్యావరణ ప్రేమికుడు, మంచి వక్త. హిమాలయ పర్వతాల్లో పేరుకుపోతున్న వ్యర్థ పదార్థాల గురించి నిరంతరం ఆందోళన చెందుతుండేవారు. 2015 మార్చిలో దక్షిణ అమెరికాలోని ‘నెవాడో టైస్ క్రూసెన్ సర్ సమ్మిట్’ను అధిరోహించే క్రమంలో దురదృష్టవశాత్తూ మృతి చెందారు. పాలకులు ప్రోత్సాహాన్ని అందిస్తే ఇలాంటి మట్టిలో మాణిక్యాలు మరికొందరు వెలుగులోకి వస్తారు.
– ఎం. రాంప్రదీప్ జెవివి సభ్యుడు, తిరువూరు