Boosts Gold Prices: పెరిగితేఫెడ్పై ట్రంప్ పెత్తనం పెరిగితే 5,000 డాలర్లకు ఔన్స్ బంగారం
ABN , Publish Date - Sep 05 , 2025 | 02:30 AM
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు వేగంగా పరుగు తీస్తున్నాయి. న్యూయార్క్ కమోడిటీ మార్కెట్లో ఔన్స్ 31.10 గ్రాములు పసిడి తొలిసారిగా 3,600 డాలర్లు అధిగమించింది...
గోల్డ్మన్ శాక్స్ అంచనా
దేశీయ మార్కెట్లో 10 గ్రాముల పసిడి రూ.1.50 లక్షలకు చేరువయ్యే చాన్స్!
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు వేగంగా పరుగు తీస్తున్నాయి. న్యూయార్క్ కమోడిటీ మార్కెట్లో ఔన్స్ (31.10 గ్రాములు) పసిడి తొలిసారిగా 3,600 డాలర్లు అధిగమించింది. బుధవారం ట్రేడింగ్లో 3,638 డాలర్ల స్థాయి వద్ద సరికొత్త ఆల్టైం రికార్డు స్థాయిని నమోదు చేసింది. సిల్వర్ సైతం 41 డాలర్ల ఎగువకు చేరింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ క్రమంగా బలహీనపడుతుండటం, ఆ దేశ సెంట్రల్ బ్యాంకైన ఫెడరల్ రిజర్వ్ ఈ నెలలో నిర్వహించనున్న పరపతి సమీక్షలో ప్రామాణిక వడ్డీ రేట్లను మరో 0.25 శాతం తగ్గించవచ్చన్న అంచనాలు విలువైన లోహాలకు డిమాండ్ పెంచుతున్నాయి. అలాగే, ఫెడ్ రిజర్వ్ స్వయంప్రతిపత్తికి విఘాతం కలిగించేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విధానాలు బులియన్ ర్యాలీకి మరో ప్రధాన కారణమని విశ్లేషకులు పేర్కొన్నారు. అంతర్జాతీయ భౌగోళిక, రాజకీయ అనిశ్చితులు, ట్రంప్ టారి్ఫలు, ఫెడ్ రేట్ల కోతలతో ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఔన్స్ బంగారం రేటు 35 శాతం పెరిగింది. ఫెడ్పై ట్రంప్ పెత్తనం బంగారం ధరలను మున్ముందు మరింత ఎగదోయవచ్చని బులియన్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఫెడ్ స్వయంప్రతిపత్తికి ప్రమాదం ఏర్పడితే, వచ్చే ఏడాది ప్రఽథమార్థం చివరినాటికి ఔన్స్ గోల్డ్ 4,000 డాలర్ల నుంచి 5,000 డాలర్ల వరకు ఎగబాకే అవకాశాలున్నాయని అంతర్జాతీయ ఇన్వె్స్టమెంట్ బ్యాంకింగ్ దిగ్గజం గోల్డ్మన్ శాక్స్ తాజా నివేదికలో అంచనా వేసింది. ఎందుకంటే, ఆర్థిక వృద్ధికి దోహదపడేలా వడ్డీ రేట్లను తగ్గించాలని ఫెడ్ రిజర్వ్పై ట్రంప్ ఒత్తిడి తెస్తున్నారు. తన డిమాండ్ను ఖాతరు చేయకపోవడంతో ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్పైను పదవి నుంచి తొలగించేస్తానని బెదిరించాడు కూడా. ఈ మధ్యనే ఫెడ్ గవర్నర్ లీసా కుక్ను తొలగించేందుకు ట్రంప్ చేసిన ప్రయత్నం అమెరికా సెంట్రల్ బ్యాంక్ స్వయం ప్రతిపత్తిని మరింత ప్రమాదంలోకి నెట్టింది.
ఫెడ్పై ప్రభుత్వ పెత్తనం పెరిగితే, ఒత్తిడి చేసినప్పుడల్లా వడ్డీ రేట్లు తగ్గించాల్సిన పరిస్థితి వస్తుందని.. తత్ఫలితంగా దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణ (ధరల) నియంత్రణ లక్ష్యాలకు విఘాతం కలగవచ్చని, అమెరికా కరెన్సీ విలువ కూడా తగ్గి ట్రెజరీ బిల్లులు, బాండ్లు వంటి డాలర్ ఆధారిత ఆర్థిక సాధనాల నుంచి పెట్టుబడులు గోల్డ్, సిల్వర్లోకి మళ్లే ప్రమాదం ఉందని గోల్డ్మన్ శాక్స్ పేర్కొంది. ఉదాహరణకు యూఎస్ ట్రెజరీ మార్కెట్లోని ప్రైవేట్ వర్గాల పెట్టుబడుల్లో ఒక శాతం బులియన్లోకి మళ్లినా గోల్డ్ దాదాపు 5,000 డాలర్ల వరకు ఎగబాకవచ్చని హెచ్చరించింది. అదేగనుక జరిగితే, భారత్లో 10 గ్రాముల బంగారం ధర రూ.1.50 లక్షలకు చేరువ కావచ్చని బులియన్ ట్రేడర్లు భావిస్తున్నారు.