Share News

Yes Bank SMBC Deal: ఎస్‌ఎంబీసీకి యెస్‌ బ్యాంక్‌లో 20 శాతం వాటా

ABN , Publish Date - May 10 , 2025 | 04:29 AM

యెస్‌ బ్యాంక్‌లో 20 శాతం వాటాను జపాన్‌కి చెందిన ఎస్‌ఎంబీసీ రూ.13,483 కోట్లకు కొనుగోలు చేసింది. ఇది దేశీయ బ్యాంకింగ్ రంగంలో ఇప్పటివరకు నమోదైన అతిపెద్ద విదేశీ పెట్టుబడిగా గుర్తింపు పొందింది.

Yes Bank SMBC Deal:  ఎస్‌ఎంబీసీకి  యెస్‌ బ్యాంక్‌లో 20 శాతం వాటా

  • ఎస్‌బీఐ సహా 8 బ్యాంకుల నుంచి రూ.13,483 కోట్లకు కొనుగోలు

  • దేశీయ బ్యాంకింగ్‌ రంగంలో ఇదే అతిపెద్ద విదేశీ పెట్టుబడి

న్యూఢిల్లీ: ప్రైవేట్‌ రంగ యెస్‌ బ్యాంక్‌లో 20 శాతం వాటాను జపాన్‌కు చెందిన సుమిటోమో మిత్సుయి బ్యాంకింగ్‌ కార్పొరేషన్‌ (ఎ్‌సఎంబీసీ) రూ.13,483 కోట్లకు కొనుగోలు చేసింది. దేశీయ బ్యాంకింగ్‌ రంగంలో ఇప్పటివరకిదే అతిపెద్ద విదేశీ పెట్టుబడి. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ సహా 8 బ్యాంకులు కలిసి యెస్‌ బ్యాంక్‌లోని తమ వాటాలను ఎస్‌ఎంబీసీకి విక్రయించాయి. అందులో ఎస్‌బీఐ 13.19 శాతం వాటాను రూ.8,889 కోట్లకు విక్రయించగా.. యాక్సిస్‌ బ్యాంక్‌, బంధన్‌ బ్యాంక్‌, ఫెడరల్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఐడీఎ్‌ఫసీ ఫస్ట్‌ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌లు కలిసి మొత్తం 6.81 శాతం వాటాను రూ.4,594 కోట్లకు విక్రయించాయి. ఈ డీల్‌ పూర్తయిన తర్వాత యెస్‌ బ్యాంక్‌లో ఎస్‌ఎంబీసీ అతిపెద్ద వాటాదారుగా అవతరించనుంది. ఆర్‌బీఐ, సీసీఐ వంటి నియంత్రణ మండళ్లతో పాటు చట్టపరమైన అనుమతులకు లోబడి ఈ ఒప్పందం పూర్తి కానుంది. ఇందుకు ఏడాది పట్టవచ్చని ఎస్‌బీఐ పేర్కొంది. ఎస్‌ఎంబీసీ వాటా కొనుగోలు వార్తల నేపథ్యంలో యెస్‌ బ్యాంక్‌ షేరు బీఎ్‌సఈలో 9.77 శాతం ఎగబాకి రూ.20 వద్ద ముగిసింది.


2020లో యెస్‌ బ్యాంక్‌లో ఎస్‌బీఐ పెట్టుబడులు

ఆర్థికంగా దివాలా తీసిన యెస్‌ బ్యాంక్‌ను తిరిగి నిలబెట్టేందుకు 2020 మార్చిలో ఆర్‌బీఐ పునర్నిర్మాణ ప్రణాళికను ప్రకటించింది. అందులో భాగంగా ఎస్‌బీఐ సహా 8 బ్యాంకులు కలిసి యెస్‌ బ్యాంక్‌లో పెట్టుబడులు పెట్టడం ద్వారా వాటాలు దక్కించుకున్నాయి. ఈ మార్చి 31 నాటికి యెస్‌ బ్యాంక్‌లో ఎస్‌బీఐ 23.97 శాతం వాటా కలిగి ఉండగా.. హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌ 2.75 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్‌ 2.39 శాతం, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ 1.21 శాతం, యాక్సిస్‌ బ్యాంక్‌ 1.01 శాతం, ఐడీఎ్‌ఫసీ ఫస్ట్‌ బ్యాంక్‌ 0.92 శాతం, ఫెడరల్‌ బ్యాంక్‌ 0.76 శాతం, బంధన్‌ బ్యాంక్‌ 0.70 శాతం వాటా కలిగి ఉన్నాయి. ఎస్‌ఎంబీసీకి 13.19 శాతం వాటా విక్రయ అనంతరం యెస్‌ బ్యాంక్‌లో ఎస్‌బీఐ 10.78 శాతం వాటా కలిగి ఉండనుంది.

మళ్లీ వృద్ధి పథంలోకి..

ఎస్‌బీఐ సహా ఇతర బ్యాంకులు పెట్టుబడులతో ఆదుకోవడంతో యెస్‌ బ్యాంక్‌ వేగంగా కోలుకుని మళ్లీ వృద్ధి పథంలోకి అడుగు పెట్టింది. ఈ మార్చితో ముగిసిన త్రైమాసికంలో బ్యాంక్‌ స్టాండ్‌ఎలోన్‌ నికర లాభం వార్షిక ప్రాతిపదికన 63 శాతం వృద్ధితో రూ.738 కోట్లకు చేరుకుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి బ్యాంక్‌ రూ.2,406 కోట్ల లాభం ప్రకటించింది. 2023-24తో పోలిస్తే లాభం దాదాపు రెట్టింపైంది.

జపాన్‌లో రెండో అతిపెద్ద బ్యాంక్‌ ఎస్‌ఎంబీసీ

సుమిటోమో మిత్సుయి ఫైనాన్షియల్‌ గ్రూప్‌ (ఎస్‌ఎంఎ్‌ఫజీ) పూర్తి అనుబంధ విభాగమే ఎస్‌ఎంబీసీ. గత ఏడాది చివరి నాటికి 2 లక్షల కోట్ల డాలర్ల (రూ.170 లక్షల కోట్ల పైమాటే) ఆస్తులు కలిగిన ఎస్‌ఎంఎఫ్‌జీ.. జపాన్‌లో రెండో అతిపెద్ద బ్యాంకింగ్‌ గ్రూప్‌గా కొనసాగుతోంది. కాగా, దేశంలోని అగ్రగామి విదేశీ బ్యాంక్‌ల్లో ఎస్‌ఎంబీసీ ఒకటి. అంతేకాదు, ఎస్‌ఎంఎ్‌ఫజీ పూర్తి అనుబంధ విభాగమైన ఎస్‌ఎంఎ్‌ఫజీ ఇండియా క్రెడిట్‌ కంపెనీ లిమిటెడ్‌ దేశంలోని అతిపెద్ద ఎన్‌బీఎఫ్‌సీల్లో ఒకటి కూడా.

Updated Date - May 10 , 2025 | 04:37 AM