Shiv Nadar: దాతృత్వంలో నాడార్ మేటి
ABN , Publish Date - Nov 07 , 2025 | 01:40 AM
దానం చేసేందుకు డబ్బుతో పాటు గొప్ప మనసు కూడా ఉండాలి. ఐటీ కంపెనీ హెచ్సీఎల్ టెక్ వ్యవస్థాపకులు శివ్ నాడార్ దేశంలో అత్యంత..
గత ఏడాది రూ.2,708 కోట్ల విరాళాలు ఇచ్చిన హెచ్సీఎల్ టెక్ వ్యవస్థాపకుడు
రోజుకు సగటున రూ.7.4 కోట్లు దానం
న్యూఢిల్లీ: దానం చేసేందుకు డబ్బుతో పాటు గొప్ప మనసు కూడా ఉండాలి. ఐటీ కంపెనీ హెచ్సీఎల్ టెక్ వ్యవస్థాపకులు శివ్ నాడార్ దేశంలో అత్యంత దయాగుణం కలిగిన వ్యక్తిగా నిలిచారు. గురువారం విడుదలైన ‘ఎడెల్గివ్-హురున్ ఇండియా దాతలు 2025’ జాబితా ప్రకారం.. గత ఏడాది నాడార్ కుటుంబం శివ్ నాడార్ ఫౌండేషన్ ద్వారా రూ.2,708 కోట్ల విరాళాలిచ్చింది. అంటే, రోజుకు సగటున రూ.7.4 కోట్లు దానం చేసిందీ కుటుంబం. ఎడెల్గివ్-హురున్ ఏటా విడుదల చేస్తున్న ఈ జాబితాలో నాడార్ అగ్రస్థానంలో నిలవడం ఐదేళ్లలో ఇది నాలుగోసారి. గడిచిన ఐదేళ్లలో నాడార్ ఫ్యామిలీ మొత్తం రూ.10,122 కోట్లు ప్రధానంగా విద్యా రంగానికి విరాళాలిచ్చింది.
భారత్లో అత్యంత ధనవంతుడైన ముకేశ్ అంబానీ, ఆయన కుటుంబం దాతృత్వం విషయంలో మాత్రం రెండో స్థానంలో నిలిచింది. రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా ఈ కుటుంబం రూ.626 కోట్లు దానం చేసింది.
దేశంలో రెండో అతిపెద్ద ధనవంతుడైన గౌతమ్ అదానీ, కుటుంబం రూ.386 కోట్ల విరాళాలతో ఐదో స్థానంలో ఉంది.
ఈసారి జాబితాలో మొత్తం 191 మందికి స్థానం లభించింది. అందులో 12 మంది కొత్తవారు. వారి మొత్తం విరాళాలు రూ.10,380 కోట్లు. మూడేళ్ల క్రితంతో పోలిస్తే ఈ విలువ 85 శాతం పెరిగింది. మొత్తం విరాళాల్లో దాదాపు 40 శాతం విద్యా రంగానికి, 9 శాతం హెల్త్కేర్ రంగానికి దక్కాయి.
దేశంలోని టాప్-10 దాతలు మొత్తం రూ.5,834 కోట్ల విరాళాలిచ్చారు. గత ఏడాదితో పోలిస్తే 26 శాతం అధికమిది. అంతేకాదు, లిస్ట్లోని అందరి విరాళాల్లో వీరి వాటాయే 56 శాతంగా ఉంది.
జాబితాలోని టాప్ -25 దాతలు గత మూడేళ్లలో మొత్తం రూ.50,000 కోట్లు దానం చేశారు. అంటే, రోజుకు సగటున రూ.46 కోట్లు ఇచ్చారు.