SEBI: ఐపీఓ మార్కెట్లో మరిన్ని సంస్కరణలు: సెబీ
ABN , Publish Date - Aug 19 , 2025 | 04:36 AM
ఇష్యూ (ఐపీఓ) మార్కె ట్లో మరిన్ని సంస్కరణలకు సెబీ సిద్ధమవుతోంది. ఇందుకోసం సోమవారం ఒక చర్చా పత్రం విడుదల చేసింది.
న్యూఢిల్లీ: పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ) మార్కె ట్లో మరిన్ని సంస్కరణలకు సెబీ సిద్ధమవుతోంది. ఇందుకోసం సోమవారం ఒక చర్చా పత్రం విడుదల చేసింది. సంబంధిత వర్గాలు ఈ చర్చా పత్రంపై తమ అభిప్రాయాలు, సూచనలు సెప్టెంబరు 8 లోగా తెలియజేయాలని కోరింది. ఐపీఓల్లో రిటైల్ మదుపరుల వాటాను 35 శాతం వద్ద కొనసాగిస్తూనే పెద్ద కంపెనీలు పబ్లిక్ ఇష్యూల ద్వారా జారీ చేయాల్సిన కనీస పబ్లిక్ ఆఫర్ (ఎంపీఓ)ను తగ్గించాలని సెబీ ప్రతిపాదించింది. దీంతో భారీ స్థాయిలో మార్కెట్ క్యాప్ ఉండే కంపెనీలు ఐపీఓల ద్వారా ఒకేసారి తమ షేర్లను మార్కెట్లో కుమ్మరించాల్సిన అవసరం ఉండదు. మార్కెట్ పరిస్థితులను బట్టి ఐదు నుంచి పదేళ్లలో దశల వారీగా తమ ఈక్విటీలో 25 శాతం వాటాను రిటైల్ మదుపరులు, సంస్థాగత మదుపరులకు జారీ చేస్తే సరిపోతుంది.
మరింత గడువు: వచ్చే నెల 1 నుంచి అమలు చేయతలపెట్టిన మార్జిన్ ఆబ్లిగేషన్ల గడువును కూడా సెబీ అక్టోబరు 10 వరకు పొడిగించింది. ఈ నిబంధన చేసేందుకు సమయం పడుతుందని డిపాజిటరీ సంస్థలు కోరడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సెబీ తెలిపింది. ఈ చర్యతో బ్రోకర్లు.. ఖాతాదారులకు తెలియకుండా వారి సెక్యూరిటీలను కుదువ పెట్టే దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయవచ్చని భావిస్తున్నారు.