RS Brothers: పబ్లిక్ ఇష్యూకి ఆర్ఎస్ బ్రదర్స్
ABN , Publish Date - Aug 16 , 2025 | 05:12 AM
ఆర్ఎస్ బ్రదర్స్ సహా పలు బ్రాండ్నేమ్స్తో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రిటైల్ స్టోర్లను నిర్వహిస్తున్న హైదరాబాద్ సంస్థ ఆర్ఎ్సబీ రిటైల్ ఇండియా లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ)కి వస్తోంది.
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ఆర్ఎస్ బ్రదర్స్ సహా పలు బ్రాండ్నేమ్స్తో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రిటైల్ స్టోర్లను నిర్వహిస్తున్న హైదరాబాద్ సంస్థ ఆర్ఎ్సబీ రిటైల్ ఇండియా లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ)కి వస్తోంది. ఇందుకు అనుమతి కోరుతూ క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీకి ప్రాథమిక ముసాయిదా పత్రాలు (డీఆర్హెచ్పీ) సమర్పించింది. ఐపీఓలో భాగం గా రూ.500 కోట్ల తాజా ఈక్విటీ షేర్ల జారీతో పాటు ప్రమోటర్ల వాటాకు చెందిన 2.98 కోట్ల ఈక్విటీ షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) పద్ధతిన విక్రయించనున్నట్లు కంపెనీ డీఆర్హెచ్పీలో వెల్లడించింది. ఐపీఓ ద్వారా కంపెనీ మొత్తం రూ.1,500 కోట్ల వరకు సమీకరించే అవకాశం ఉందని ఈ వ్యవహారంతో సంబంధమున్న వర్గాలు వెల్లడించాయి. తాజా ఈక్విటీ జారీ ద్వారా సమీకరించనున్న నిధుల్లో రూ.275 కోట్లను రుణాల చెల్లింపుల కోసం వినియోగించుకోనున్నట్లు కంపెనీ తెలిపింది. ఆర్ఎస్ బ్రదర్స్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ బ్రాండ్నేమ్తో మరిన్ని స్టోర్ల ఏర్పాటుకు రూ.118 కోట్లు వెచ్చించనున్నట్లు, మిగతా సొమ్మును సాధారణ వ్యాపార అవసరాల కోసం ఉపయోగించుకోవాలనుకుంటున్నట్లు వెల్లడించింది.
22 నగరాలు.. 73 స్టోర్లు: ఆర్ఎ్సబీ రిటైల్ 2008లో ఏర్పాటైంది. ఆర్ఎస్ బ్రదర్స్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్తో పాటు కాంచీపురం నారాయణి సిల్క్స్, డీఏ రాయల్, వాల్యూ జోన్ హైపర్ మార్ట్ బ్రాండ్ నేమ్స్తో రిటైల్ విక్రయ స్టోర్లను నిర్వహిస్తోంది. ఈ ఏడాది మార్చి 31 నాటికి తెలంగాణ, ఏపీ, కర్ణాటకలోని 22 నగరాల్లో మొత్తం 73 స్టోర్లను కలిగి ఉంది. గత ఆర్థిక సంవత్సరం (2024-25)లో ఆర్ఎ్సబీ రిటైల్ రూ.2,694 కోట్ల ఆదాయంపై రూ.104.4 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. వేగంగా వృద్ధి చెందుతున్న దేశీయ రిటైల్ ఇండస్ట్రీ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రూ.92.6 లక్షల కోట్ల స్థాయికి చేరే అవకాశం ఉందని టెక్నోపార్క్ నివేదిక అంచనా వేసింది.