Gold loan LTV Increase: బంగారం రుణాలకు ఎల్టీవీ నిష్పత్తి పెంపు
ABN , Publish Date - Jun 07 , 2025 | 05:37 AM
బంగారం తనఖా రుణాలకు సంబంధించిన తుది మార్గదర్శకాలను ఆర్బీఐ శుక్రవారం రాత్రి విడుదల చేసింది. రూ.2.5 లక్షల లోపు గోల్డ్ లోన్కు లోన్ టు వాల్యూ (ఎల్టీవీ) నిష్పత్తిని ప్రస్తుతమున్న 75 శాతం నుంచి 85 శాతానికి పెంచుతున్నట్లు తెలిపింది.
రూ.2.5 లక్షల లోపు రుణాలకు 75 శాతం నుంచి 85 శాతానికి
రూ.2.5-5 లక్షల వరకు రుణాలకు 80ు.. తుది మార్గదర్శకాలు విడుదల చేసిన ఆర్బీఐ
బంగారం తనఖా రుణాలకు సంబంధించిన తుది మార్గదర్శకాలను ఆర్బీఐ శుక్రవారం రాత్రి విడుదల చేసింది. రూ.2.5 లక్షల లోపు గోల్డ్ లోన్కు లోన్ టు వాల్యూ (ఎల్టీవీ) నిష్పత్తిని ప్రస్తుతమున్న 75 శాతం నుంచి 85 శాతానికి పెంచుతున్నట్లు తెలిపింది. అయితే, ఈ రుణాల్లో రిస్క్ను తగ్గించేందుకు కొన్ని షరతులను సైతం విధించింది. ‘ఆర్బీఐ (బంగారం, వెండి తనఖాపై రుణం) మార్గదర్శకాలు 2025’ ప్రకారం.. రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు రుణాలకు ఎల్టీవీ నిష్పత్తిని 80 శాతంగా నిర్ణయించింది. రూ.5 లక్షలకు పైగా రుణాలకు మాత్రం ఎల్టీవీ నిష్పత్తి 75 శాతంగా కొనసాగనుంది. బ్యాంకులు లేదా గోల్డ్ లోన్ కంపెనీలు రుణాలు మంజూరు చేసేందుకు ఈ నిష్పత్తే ఆధారం. రుణగ్రహీత తాకట్టు పెట్టే బంగారం నికర విలువలో ఆ రోజున రుణ మంజూరుకు అర్హత శాతమే ఎల్టీవీ నిష్పత్తి. బుల్లెట్ రీపేమెంట్ లోన్స్ విషయానికొస్తే, ఎల్టీవీ మదింపులో రుణ కాలపరిమితి ముగిసేనాటికి తిరిగి చెల్లించాల్సిన మొత్తాన్ని (అసలు+వడ్డీ) పరిగణనలోకి తీసుకుంటారు. మరిన్ని విషయాలు..
తనఖా బంగారం యాజమాన్యంపై సందేహాలున్నప్పుడు రుణం మంజూరు చేయరాదు. ఆర్బీఐ తాజా మార్గదర్శకాల ప్రకారం.. తనఖా పెట్టే బంగారానికి రుణగ్రహీతే అసలైన యజమాని అని ధ్రువీకరించే పత్రం లేదా రశీదును కోరాలి. రశీదు లేని పక్షంలో పూచీకత్తుగా సమర్పిస్తున్న లోహానికి తానే అసలైన యజమాని అని తెలిపే స్వీయ ప్రకటిత (సెల్ఫ్ డిక్లరేషన్) పత్రాన్ని తీసుకోవాలి.
గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్), మ్యూచువల్ ఫండ్ యూనిట్లు వంటి ఆర్థిక ఆస్తులపై ఎలాంటి రుణాలు లేదా అడ్వాన్సు మంజూరు చేయవద్దు.
ఇప్పటికే తనఖా పెట్టిన బంగారం లేదా వెండిని మళ్లీ తనఖా పెట్టుకుని రుణాలివ్వరాదు.
ఒక రుణగ్రహీత నుంచి కిలో బంగారు నగలు లేదా 10 కిలోల వెండి ఆభరణాలకు మించి తనఖా స్వీకరించవద్దు. నాణేల విషయంలో బంగారమైతే 50 గ్రాములు, వెండి అయితే 500 గ్రాములకు మించరాదు.
తనఖా కింద స్వీకరించే బంగారం లేదా వెండి విలువను ఆ లోహం స్వచ్ఛత ఆధారిత ధర ప్రకారంగా లెక్కించాలి. ఇందుకోసం ఇండియన్ బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ లిమిటెడ్ లేదా సెబీ నియంత్రణలోని కమోడిటీ ఎక్స్ఛేంజ్ ధరలను ప్రామాణికంగా తీసుకోవాలి. గడిచిన 30 రోజుల ముగింపు ధరల సగటు లేదా క్రితం రోజు ముగింపు ధరను ఇందుకు పరిగణనలోకి తీసుకోవాలి.
రూ.2.5 లక్షల వరకు రుణాల కోసం తాకట్టు పెట్టే బంగారానికి క్రెడిట్ అప్రైజల్ అవసరం లేదని పరపతి సమీక్ష అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్బీఐ గవర్నర్ మల్హోత్రా తెలిపారు.
తాజా మార్గదర్శకాలను రుణదాతలు వీలైనంత త్వరగా పాటించాలని, 2026 ఏప్రిల్ 1 నుంచి తప్పక అమలు చేయాల్సిందేనని ఆర్బీఐ స్పష్టం చేసింది.