RBI Delays Second Phase: వేగవంతమైన చెక్ క్లియరెన్స్ రెండో దశ వాయిదా
ABN , Publish Date - Dec 25 , 2025 | 05:56 AM
వచ్చే నెల 3వ తేదీ నుంచి అమలుచేయాల్సిన వేగవంతమైన చెక్ క్లియరెన్స్ రెండో దశను ఆర్బీఐ వాయిదా వేసింది. ఈ విధానం కింద తమకు ఇమేజి రూపంలో అందిన చెక్లను బ్యాంకులు మూడు గంటల్లోగా...
ముంబై: వచ్చే నెల 3వ తేదీ నుంచి అమలుచేయాల్సిన వేగవంతమైన చెక్ క్లియరెన్స్ రెండో దశను ఆర్బీఐ వాయిదా వేసింది. ఈ విధానం కింద తమకు ఇమేజి రూపంలో అందిన చెక్లను బ్యాంకులు మూడు గంటల్లోగా క్లియర్ చేయాలి లేదా కారణం చెప్పి తిరస్కరించాలి. కంటిన్యుయస్ క్లియరింగ్ అండ్ సెటిల్మెంట్ (సీసీఎస్) పేరుతో వచ్చే నెల 3వ తేదీ నుంచి ఆర్బీఐ ఈ విధానం అమలు చేయాలని భావించింది. కాని అనివార్య పరిస్థితుల్లో తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు ఈ విధానం అమలును వాయిదా వేస్తున్నట్టు ఆర్బీఐ తెలిపింది. ఏ కారణం చేత ఈ నిర్ణయం తీసుకుందీ వెల్లడించలేదు. ఫేజ్ 1 కింద అమలు చేస్తున్న చెక్కుల ప్రాసెసింగ్ సమయాన్ని కూడా ఆర్బీఐ సవరించింది. బ్యాంకులు ఇక క్లియరెన్స్ కోసం పంపే చెక్లను ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల్లోపే సమర్పించాలి. చెక్ ఇమేజి, ఎంఐసీఆర్ వివరాల ఆధారంగా ఆ చెక్ క్లియరెన్స్ను ఆమోదిస్తోందీ, లేనిదీ బ్యాంకులు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల లోపు ఎలకా్ట్రనిక్ పద్దతిలో తెలియజేస్తాయి. లేకపోతే ఆ చెక్ క్లియరెన్స్కు ఆమోదం లభించినట్టు భావిస్తారు.