Dr Reddys CEO Erez Israeli: డాక్టర్ రెడ్డీస్ లాభం రూ.1,587 కోట్లు
ABN , Publish Date - May 10 , 2025 | 05:37 AM
అమెరికాలో తయారీకి అవకాశాలు అన్వేషిస్తున్నట్లు డాక్టర్ రెడ్డీస్ సీఈఓ వెల్లడించారు. సుంకాల భారాన్ని తగ్గించేందుకు అవసరమైతే అక్కడి కంపెనీలను కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు.

క్యూ4లో 21 శాతం వృద్ధి
ఒక్కో షేరుకు రూ.8 డివిడెండ్
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ ప్రోత్సాహకర ఫలితాలను ప్రకటించింది. 2024-25 ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన చివరి త్రైమాసికం (క్యూ4)లో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం 21 శాతం వృద్ధి చెంది రూ.1,587 కోట్లుగా నమోదైంది. 2023-24 ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో లాభం రూ.1,307 కోట్లుగా ఉంది. సమీక్షా త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఆదాయం కూడా 20 శాతం వృద్ధితో రూ.7,083 కోట్ల నుంచి రూ.8,506 కోట్లకు చేరుకుంది. మార్చితో ముగిసిన పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను కంపెనీ రూ.32,553.50 కోట్ల ఆదాయంపై రూ.5,655 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.
మార్చి త్రైమాసికంలో కంపెనీ వ్యాపారాలు రెండంకెల వృద్ధిని నమోదు చేయటంతో అమ్మకాలు, లాభాలు గరిష్ఠ స్థాయిలో ఉన్నాయని డాక్టర్ రెడ్డీస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్ఓ) ఎంవీ నరసింహం చెప్పారు. కొత్త ఉత్పత్తుల విడుదల, అమెరికా మార్కెట్లో కీలక ఉత్పత్తుల నుంచి రెవెన్యూలు పెరగటం సహా కొనుగోలు చేసిన నికోటిన్ రీప్లే్సమెంట్ థెరపీ (ఎన్ఆర్టీ) వ్యాపారాన్ని ఇంటిగ్రేట్ చేయటం కూడా ఎంతగానో కలిసి వచ్చిందని ఆయన తెలిపారు. కాగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.1 ముఖ విలువ కలిగిన ప్రతి షేరుకు రూ.8 తుది డివిడెండ్ను కంపెనీ డైరెక్టర్ల బోర్డు సిఫారసు చేసింది.
అవసరమైతే కంపెనీలను కొంటాం: ఫార్మా దిగుమతులపై అమెరికా సుంకాల నేపథ్యంలో అక్కడి మార్కెట్లో తయారీని చేపట్టేందుకు కంపెనీలను కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు డాక్టర్ రెడ్డీస్ సీఈఓ ఎరెజ్ ఇజ్రాయెలీ తెలిపారు. కంపెనీకి అమెరికా ఎంతో కీలకమైన మార్కెట్ అని, అక్కడి కస్టమర్లతో ఈ విషయంపై కలిసి పని చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. టారిఫ్ల భారం తగ్గించుకునేందుకు భారత్ నుంచి అమెరికాకు ప్లాంట్లను తరలించే యోచనేదీ లేదని ఎరెజ్ స్పష్టం చేశారు.
అమెరికా ఆదాయంలో 9 శాతం వృద్ధి
మార్చి త్రైమాసికంలో అమెరికా రెవెన్యూ 9 శాతం వృద్ధి చెంది రూ.3,560 కోట్లుగా ఉన్నట్లు డాక్టర్ రెడ్డీస్ వెల్లడించింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి అమెరికా ఆదాయం 12 శాతం వృద్ధితో రూ.14,520 కోట్లకు చేరుకున్నట్లు కంపెనీ పేర్కొంది. అమెరికా మార్కెట్లోకి కొత్త ఔషధాలను విడుదల చేయటంతో ఆదాయాలు గణనీయంగా పెరిగాయని తెలిపింది. క్యూ4లో 7 ఔషధాలను విడుదల చేయగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 18 ఔషధాలను విడుదల చేసినట్లు నరసింహం తెలిపారు. కాగా క్యూ4లో యూరప్ మార్కెట్ ఆదాయం 145 శాతం పెరగగా, భారత్, వర్ధమాన దేశాల ఆదాయం 16 శాతం చొప్పున పెరిగాయని పేర్కొంది.