NAXION Energy: హైదరాబాద్లో నాక్సియాన్ ఎనర్జీ ప్లాంట్
ABN , Publish Date - Dec 12 , 2025 | 03:42 AM
సోడియం-అయాన్ బ్యాటరీల తయారీలో ఉన్న హైదరాబాద్ సంస్థ నాక్సియాన్ ఎనర్జీ ఇండియా తన వ్యాపార కార్యకలాపాలను విస్తరిస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ సమీపంలో...
రూ.200 కోట్ల పెట్టుబడి
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): సోడియం-అయాన్ బ్యాటరీల తయారీలో ఉన్న హైదరాబాద్ సంస్థ నాక్సియాన్ ఎనర్జీ ఇండియా తన వ్యాపార కార్యకలాపాలను విస్తరిస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ సమీపంలో రూ.200 కోట్ల పెట్టుబడితో కొత్త ప్లాంటు ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ సీఈఓ అభిషేక్ రెడ్డి వెల్లడించారు. గురువారం నాడిక్కడ మార్కెట్లోకి సోడియం-అయాన్ ఆధారిత ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ను మార్కెట్లోకి విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ కొత్త ప్లాంటు వచ్చే ఏడాది చివరికల్లా అదుబాటులోకి రానుందన్నారు. ఈ ప్లాంట్ ద్వారా కొత్తగా 100 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని ఆయన తెలిపారు. కంపెనీ ఇప్పటికే తమిళనాడులోని కోయంబత్తూరు వద్ద సోడియం ఆయాన్ బ్యాటరీల తయారీ యూనిట్ను నిర్వహిస్తోందన్నారు. ప్రస్తుతం వాణిజ్య, గృహావసరాలకు తగ్గట్టుగా 3.5 కేడబ్ల్యూ, 5 కేడబ్ల్యూ, 10 కేడబ్ల్యూ సామర్థ్యాల్లో ఎనర్జీ స్టోరేజీ యూనిట్లను తీసుకువచ్చినట్లు ఆయన చెప్పారు. డీజిల్ జెనరేటర్లు, సంప్రదాయ లెడ్ యాసిడ్ బ్యాటరీలకు తమ సోడియం ఆయాన్ బ్యాటరీలు చక్కటి ప్రత్యామ్నాయమని అభిషేక్ తెలిపారు. పూర్తి దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఈ స్టోరేజీ బ్యాటరీలు లెడ్ యాసిడ్ బ్యాటరీలతో పోలిస్తే రెండు నుంచి మూడు రెట్ల ఎక్కువ కాలం మన్నుతాయన్నారు.
ఇవి కూడా చదవండి..
స్థిరంగా బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
మురికిగా, అసహ్యంగా ఉండే జనాన్నే తెచ్చుకున్నాం: ట్రంప్ జాత్యాంహకార వ్యాఖ్యలు..