ఐటీసీ లాభాలు అంతంతే
ABN , Publish Date - May 23 , 2025 | 04:40 AM
మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో ఐటీసీ లిమిటెడ్ లాభాలు నామమాత్రంగానే పెరిగాయి. ఈ కాలానికి కంపెనీ రూ.18,266 కోట్ల కన్సాలిడేటెడ్ ఆదాయంపై రూ.6,416.85 కోట్ల నికర లాభం నమోదు చేసింది....
క్యు4 లాభం రూ.6,416.85 కోట్లు
న్యూఢిల్లీ: మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో ఐటీసీ లిమిటెడ్ లాభాలు నామమాత్రంగానే పెరిగాయి. ఈ కాలానికి కంపెనీ రూ.18,266 కోట్ల కన్సాలిడేటెడ్ ఆదాయంపై రూ.6,416.85 కోట్ల నికర లాభం నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఆదాయం 9.2 శాతం పెరిగినా నికర లాభంలో వృద్ధి మాత్రం రెండు శాతమే ఉంది. ఆదాయం భారీగా పెరగడానికి ఐటీసీ హోటల్స్ విభజన (డీమెర్జర్) ద్వారా సమకూరిన రూ.15,179 కోట్ల రాబడి ప్రధానంగా దోహదం చేసింది. అనుబంధ కంపెనీలను మినహాయించి (స్టాండ్ అలోన్) చూసినా క్యూ4లో ఐటీసీ ఆర్థిక ఫలితాలు అంత ఆశాజనకంగా లేవు. ఈ కాలానికి కంపెనీ రూ.17,248 కోట్ల ఆదాయంపై రూ.4,874 కోట్ల నికర లాభం నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఆదాయం 9.6 శాతం పెరిగినా నికర లాభం మాత్రం 0.8 శాతం మాత్రమే పెరిగింది.
ఆర్థిక సంవత్సరం మొత్తానికి
2024-25 ఆర్థిక సంవత్సరం మొత్తాన్ని పరిగణనలోకి తీసుకున్నా రూ.73,465 కోట్ల ఆదాయంపై ఐటీసీ రూ.20,092 కోట్ల నికర లాభం నమోదు చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఆదాయం 10.2 శాతం పెరిగినా, నికర లాభం మాత్రం నామమాత్రంగా రూ.182 కోట్లు మాత్రమే పెరిగింది. ఉత్పత్తి ఖర్చులు పెరిగి పోవడం, డిమాండ్ అంతంత మాత్రంగానే ఉండడం ఇందుకు ప్రధాన కారణమని కంపెనీ తెలిపింది.
ఒక్కో షేరుపై రూ.7.85 చొప్పున డివిడెండ్
ఆర్థిక ఫలితాలు అంతంత మాత్రంగానే ఉన్నా వాటాదారులకు ఒక్కో షేరుపై రూ.7.85 చొప్పున తుది డివిడెండ్ చెల్లించాలని ఐటీసీ బోర్డు సిఫారసు చేసింది. ఈ ఏడాది మార్చిలో ప్రకటించిన రూ.6.5 మధ్యంతర డివిడెండ్ను కూడా కలిపితే 2024-25 ఆర్థిక సంవత్సరానికి కంపెనీ ఒక్కో షేరుపై వాటాదారులకు రూ.14.35 చొప్పున డివిడెండ్ చెల్లించినట్టవుతుంది. రూపాయి ముఖ విలువ ఉన్న కంపెనీ షేర్లపై ఇది 1,435 శాతానికి సమానం.
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..