పసిడి దిగుమతులకు కళ్లెం
ABN , Publish Date - May 21 , 2025 | 03:00 AM
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) నుంచి వచ్చి పడే పసిడి, వెండి దిగుమతులను ప్రభుత్వం మరింత కట్టడి చేసింది. ఆ దేశంతో మన దేశానికి ఉన్న సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం...
కొత్త నిబంధనలు జారీ చేసిన ప్రభుత్వం
న్యూఢిల్లీ: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) నుంచి వచ్చి పడే పసిడి, వెండి దిగుమతులను ప్రభుత్వం మరింత కట్టడి చేసింది. ఆ దేశంతో మన దేశానికి ఉన్న సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏ) ముసుగులో కొన్ని సంస్థలు ప్లాటినం పేరుతో బంగారాన్ని దిగుమతి చేసుకుంటూ సుంకాలు ఎగవేస్తుండడంతో ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. ఇక నుంచి నామినేటెడ్ సంస్థలు, అర్హత పొందిన నగల వ్యాపారులు/సంస్థలు, చెల్లుబాటయ్యే టారిఫ్ రేటు కోటా (టీఆర్క్యూ) ఉన్న సంస్థలను మాత్రమే ఈ ఒప్పందం కింద యూఏఈ నుంచి బంగారం, వెండి దిగుమతి చేసుకునేందుకు అనుమతిస్తారు. శుద్ధి చేయని, పాక్షికంగా శుద్ధి చేసిన లేదా పౌడర్ రూపంలో ఉన్న బంగారం, వెండిలకు ఈ నిబంధనలు వర్తిస్తాయి.
ఎందుకంటే?
భారత్-యూఏఈ సీఈపీఏ ఒప్పందం ప్రకారం మన దేశ సంస్థలు యూఏఈ నుంచి ఏటా 200 టన్నుల వరకు పాక్షికంగా లేదా ఏ మాత్రం శుద్ధి చేయని ప్లాటినంను ఖనిజ రూపంలో లేదా పౌడర్ రూపంలో ఒక శాతం సుంకంతో దిగుమతి చేసుకోవచ్చు. అయితే చాలా సంస్థలు ఈ ఒప్పందం ముసుగులో స్వచ్ఛమైన బంగారాన్ని కూడా ప్లాటినం ముసుగులో దిగుమతి చేసుకుంటూ సుంకం ఎగవేస్తున్నాయి.
దీనికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. ఇందుకోసం బంగారం, వెండి, ప్లాటినంలకు వేరు వేరు కోడ్స్ కేటాయించింది. ప్లాటినం కూడా 99 శాతం స్వచ్ఛత ఉంటేనే ఒక శాతం డ్యూటీతో అనుమతిస్తామని ప్రకటించింది. దీంతో దుబాయ్ నుంచి వచ్చే అక్రమ బంగారం, వెండి దిగుమతులకు తెరపడుతుందని భావిస్తున్నారు.
మరిన్ని బిజిెనెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..