Heritage Foods Profit: హెరిటేజ్ ఫుడ్స్ లాభంలో 77శాతం వృద్ధి
ABN , Publish Date - May 17 , 2025 | 02:56 AM
హెరిటేజ్ ఫుడ్స్ 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.188 కోట్ల నికర లాభంతో 77శాతం వృద్ధిని నమోదు చేసింది. విలువ ఆధారిత ఉత్పత్తుల వాటా పెరగడంతో కంపెనీ ఆదాయంలో రికార్డు స్థాయి వృద్ధి సాధించింది.
2024-25లో రూ.188 కోట్లుగా నమోదు
క్యూ4 లాభం రూ.38 కోట్లు
ఒక్కో షేరుకు 50 శాతం డివిడెండ్
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): హెరిటేజ్ ఫుడ్స్.. 2024-25 ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో రూ.1,000 కోట్ల రెవెన్యూను సాధించినట్లు ప్రకటించింది. ఒక త్రైమాసిక కాలంలో రికార్డు స్థాయి ఆదాయాలను ఆర్జించటం ఇదే మొదటిసారని వెల్లడించింది. జనవరి-మార్చి త్రైమాసికం (క్యూ4)లో కంపెనీ రూ.1,048.46 కోట్ల కన్సాలిడేటెడ్ ఆదాయంపై రూ.38.16 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఆదాయం రూ.950.56 కోట్లుగా ఉండగా లాభం రూ.40.49 కోట్లుగా ఉంది. అంతేకాకుండా మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గాను వార్షిక రెవెన్యూ కూడా రికార్డు స్థాయిలో రూ.4,134.60 కోట్లుగా నమోదైనట్లు హెరిటేజ్ ఫుడ్స్ తెలిపింది. 2023-24 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే గత ఆర్థిక సంవత్సర లాభం ఏకంగా 77 శాతం వృద్ధి చెంది రూ.188.28 కోట్లుగా నమోదైందని పేర్కొంది. కాగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను కంపెనీ రూ.5 ముఖ విలువతో కూడిన ప్రతి షేరుకు రూ.2.50 (50 శాతం) డివిడెండ్ను కంపెనీ డైరెక్టర్ల బోర్డు సిఫారసు చేసింది.
పెరిగిన విలువ ఆధారిత ఉత్పత్తుల వాటా
2024-25 ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ సవాళ్లు ఎదుర్కొన్నప్పటికీ ప్రతి త్రైమాసికంలో నిలకడగా 10 శాతం వృద్ధిని నమోదు చేసుకుంటూ వచ్చినట్లు హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బ్రహ్మణి నారా తెలిపారు. దీంతో రికార్డు స్థాయిలో ఆదాయాలను ఆర్జించినట్లు ఆమె పేర్కొన్నారు. కాగా మార్చి త్రైమాసిక ఆదాయాల్లో విలువ ఆధారిత ఉత్పత్తుల (వీఏపీ) వాటా 30.1 శాతం నుంచి 32.5 శాతానికి పెరిగిందని తెలిపారు. పెరుగు, పన్నీర్ విభాగంలో మార్కెట్తో పాటు కస్టమర్ బేస్ను పెంచుకోవటం ఎంతగానో కలిసివచ్చిందని బ్రహ్మణి తెలిపారు.