Stock Market: మార్కెట్లకు వచ్చే 2-3 నెలలు కీలకం
ABN , Publish Date - Aug 16 , 2025 | 05:02 AM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల పోటుతో దేశీయ స్టాక్ మార్కెట్ తీవ్ర ఆటుపోట్లు ఎదుర్కొంటోంది. ఇదే అదునుగా విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐ) పొలోమంటూ అమ్మకాలతో హోరెత్తిస్తున్నారు.
ట్రంప్ సుంకాలతోనే ఆటుపోట్లు
యూనియన్ ఏఎంసీ సీఈఓ మధు నాయర్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల పోటుతో దేశీయ స్టాక్ మార్కెట్ తీవ్ర ఆటుపోట్లు ఎదుర్కొంటోంది. ఇదే అదునుగా విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐ) పొలోమంటూ అమ్మకాలతో హోరెత్తిస్తున్నారు. దీంతో మార్కెట్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు బేర్మంటున్నాయి. రిటైల్ మదుపరులూ బేజారవుతున్నారు. ఈ నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లో వచ్చే రెండు, మూడు నెలలు చాలా కీలకంగా ఉంటాయని అంటున్నారు యూనియన్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ (ఏఎంసీ) సీఈఓ మధు నాయర్. స్టాక్ మార్కెట్ల గమనం, పెట్టుబడులు, సుంకాల ప్రభావం వంటి తదితర అంశాలపై ఆయన ‘ఆంధ్రజ్యోతి బిజినె్స’తో ఇష్ఠాగోష్ఠిగా ముచ్చటించారు. ఆ వివరాలు..
ప్రస్తుతం స్టాక్ మార్కెట్లో నెలకొన్న ఆటుపోట్లు ఎన్నాళ్లు కొనసాగే అవకాశం ఉంది?
ప్రస్తుతం మన మార్కెట్ చాలా ఆసక్తికరంగా కనిపిస్తోంది. ఒకవైపు అమెరికా సుంకాల పోటు, కొనసాగుతున్న అంతర్జాతీయ ఉద్రికత్తల ఒత్తిళ్లతో ఎఫ్పీఐలు అమ్మకాలు పెంచాయి. మరోవైపు చక్కటి ద్రవ్య విధానాలు, మెరుగైన జీడీపీ వృద్ధి రేటుతో మిగతా దేశాలతో పోలిస్తే మన ఆర్థిక పటిష్ఠంగా ఉంది. వచ్చే రెండు మూడు నెలలు మన మార్కెట్కు అత్యంత కీలకంగా భావించాలి. అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదిరితే ప్రస్తుత అనిశ్చితి చాలా వరకు తగ్గి మార్కెట్ స్థిరపడే అవకాశం ఉంది.
రిటైల్ మదుపరుల పెట్టుబడి వ్యూహం ఎలా ఉండాలి?
స్వల్పకాలంలో మార్కెట్ ఆటుపోట్లు ఎలా ఉంటాయో ఊహించలేం. దీన్ని దృష్టిలో ఉంచుకుని రిటైల్ మదుపరులు తమ ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా దీర్ఘకాలిక దృష్టితో మంచి కంపెనీల షేర్లలో పెట్టుబడులు పెట్టాలి. ఇలాంటి పెట్టుబడులు దీర్ఘకాలంలో మంచి లాభాలు పంచుతాయని అనుభవాలు చెబుతున్నాయి. అయితే ఇందుకు క్రమశిక్షణతో కూడిన పెట్టుబడి వ్యూహం కీలకం. ప్రస్తుత ఆటుపోట్ల నేపథ్యంలో క్రమానుగత పెట్టుబడులు (సిప్), క్రమానుగత బదిలీ పథకాలు (ఎస్టీపీ) ఇందుకు బాగా ఉపయోగపడతాయి. ఈ వ్యూహాల ద్వారా షేర్ల సగటు కొనుగోలు ధర తగ్గడంతో పాటు పెట్టుబడులపై మార్కెట్ ఆటుపోట్ల ప్రభావం పెద్దగా ఉండదు. సరైన సమయంలో పెట్టుబడి పెట్టలేక పోయామే అనే బెంగ కూడా ఉండదు.
వడ్డీ రేట్లు మరింత తగ్గుతాయా?
జీడీపీ వృద్ధి రేటుకు కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ సమీప భవిష్యత్లో మన దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం 2 నుంచి 4 శాతం మించకపోవచ్చు. సుంకాల ముప్పు ఉన్నా ప్రస్తుతం మన ఆర్థిక పరిస్థితి చాలా వరకు స్థిరంగానే ఉన్నాయి. కాబట్టి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కీలక రెపో వడ్డీ రేటు ఇంకా తగ్గించే అవకాశం తప్ప పెంచే అవకాశం కనిపించడం లేదు.
అమెరికాతో వ ాణిజ్య ఒప్పందం కుదరకపోతే ఏయే రంగాలపై ప్రభావం పడొచ్చు?
అమెరికాకు ఎగుమతులపై ఎక్కువగా ఆధారపడిన రత్నాభరణాలు, టెక్స్టైల్, రొయ్యల కంపెనీలు, ఎలకా్ట్రనిక్స్ కంపెనీలు బాగా దెబ్బతినే అవకాశం ఉంది. అమెరికా మార్కెట్పై ఆధారపడిన కొన్ని భవన నిర్మాణ పరికరాల కంపెనీలపైనా ఒత్తిడి తప్పదు.
దేశీయ స్టాక్ మార్కెట్కు సానుకూల, ప్రతికూల అంశాలేమిటి?
పటిష్ఠంగా ఉన్న ఆర్థిక పరిస్థితులు, ప్రభుత్వ పెట్టుబడులు, పెరుగుతున్న కంపెనీల రాబడులు, కోలుకుంటున్న పట్టణ, గ్రామీణ వినియోగం మన మార్కెట్కు ఉన్న ప్రత్యేక సానుకూల అంశాలు. పొంచి ఉన్న అమెరికా సుంకాల పోటు, అంతర్జాతీయ ఉద్రిక్తతలు, చమురు ధరల్లో ఆటుపోట్లు, ఎఫ్పీఐల అమ్మకాలు పెద్ద ప్రతికూల అంశాలు. ప్రధాన దేశాల ద్రవ్య విధానాలను కూడా మనం జాగ్రత్తగా గమనిస్తుండాలి.
పసిడి ధరలు మరింత పెరుగుతాయా?
ప్రస్తుత అంతర్జాతీయ అనిశ్చితిలో పసిడి ఆకర్షణీయంగానే కనిపిస్తోంది. కరెన్సీ, రిజర్వ్ల నష్టభయాన్ని తట్టుకునేందుకు దాదాపు అన్ని దేశాలు కేంద్ర బ్యాంకులు బంగారాన్ని కొని పెట్టుకుంటున్నాయి. అభివృద్ధి చెందిన దేశాలు ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లు, అంతర్జాతీయ ఉద్రికత్తలతో సురక్షిత పెట్టుబడి సాధనంగా పసిడికి ఉన్న ప్రాముఖ్యత మరింత పెరిగింది. కాబట్టి మధ్యకాలికంగా చూస్తే బంగారం ధర మరింత పెరిగే అవకాశమే కనిపిస్తోంది.
యూనియన్ ఏఎంసీ నుంచి ఏమైనా కొత్త పథకాలు తీసుకొస్తున్నారా?
మ్యూచువల్ ఫండ్స్తో పాటు ఇతర వ్యాపారాల్లోకి విస్తరించబోతున్నాం. మా దీర్ఘకాలిక వృద్ధి వ్యూహంలో భాగంగా మారుతున్న మదుపరుల అభిరుచులకు అనుగుణంగా ప్రత్యేక ఇన్వె్స్టమెంట్ ఫండ్ (ఎస్ఐఎఫ్), ప్రత్యామ్నాయ పెట్టుబడి పథకాల (ఏఐఎఫ్)ను ప్రారంభించబోతున్నాం. వీటికి తోడుగా గిఫ్ట్ సిటీ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ (ఐఎ్ఫఎ్ససీ) ఏర్పాటు చేసి విదేశీ మదుపరులకూ మా సేవలు అందించబోతున్నాం. ఈ చర్యలతో యూనియన్ ఏఎంసీ సమగ్ర ఆర్థిక సేవల సంస్థగా ఎదగనుంది.
ప్రస్తుతం సంస్థ ఏయూఎంలు ఏ స్థాయిలో ఉన్నాయి?
ఈ ఏడాది జూన్ నాటికి యూనియన్ ఏఎంసీ నిర్వహణలో ఉన్న ఆస్తులు (ఏయూఎం) రూ.20,360.95 కోట్లుగా ఉన్నాయి.