Coal Mining: ఏపీలోనూ బొగ్గు తవ్వకాలు
ABN , Publish Date - Dec 25 , 2025 | 05:54 AM
ఆంధ్రప్రదేశ్ కూడా దేశ బొగ్గు ఉత్పత్తి మ్యాప్లో చేరనుం ది. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం రేచర్ల బ్లాకులో త్వరలో బొగ్గు తవ్వకాలు ప్రారంభం కానున్నాయి...
బిడ్స్ దాఖలు చేసిన రిలయన్స్-యాక్సి్స ఎనర్జీ
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ కూడా దేశ బొగ్గు ఉత్పత్తి మ్యాప్లో చేరనుం ది. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం రేచర్ల బ్లాకులో త్వరలో బొగ్గు తవ్వకాలు ప్రారంభం కానున్నాయి. ఈ బ్లాకులో బొగ్గు తవ్వకాలు, గ్యాసిఫికేషన్కు రిలయన్స్ ఇండస్ట్రీస్, హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా బిడ్స్ సమర్పించాయి. దేశవ్యాప్తంగా మొత్తం 41 బ్లాకుల్లో బొగ్గు ఉత్పత్తి లేదా గ్యాసిఫికేషన్ కోసం కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది అక్టోబరులో బిడ్స్ ఆహ్వానించింది. ఇందులో 17 బ్లాకుల కోసం ఈ రెండు కంపెనీలు సంయుక్తంగా బిడ్స్ చేశాయి.
ఏపీ బ్లాకు ప్రత్యేకత : ఏలూరు జిల్లా చింతలపూడి మండలంలోని రేచర్ల బ్లాకులో దాదాపు 200 కోట్ల టన్నుల నుంచి 300 కోట్ల టన్నుల అత్యంత నాణ్యమైన గ్రేడ్-1 బొగ్గు నిక్షేపాలున్నట్టు అంచనా. ఈ నిక్షేపాలతో 60 సంవత్సరాల పాటు ఏటా 8,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు.