వైసీపీ దళిత వ్యతిరేక పార్టీ: ఎమ్మెల్యే బూర్ల
ABN , Publish Date - Aug 10 , 2025 | 04:25 AM
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు, లేనప్పుడు కూడా దళితుల పట్ల వారి ధోరణి మారలేదని ప్రత్తపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు విమర్శించారు.
అమరావతి, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు, లేనప్పుడు కూడా దళితుల పట్ల వారి ధోరణి మారలేదని ప్రత్తపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు విమర్శించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.దళితులను చులకనగా చూస్తూ వారి ప్రాణాలను లెక్క చేయని నిరంకుశత్వం వైసీపీ నాయకుల్లో స్పష్టంగా కనిపిస్తోందన్నారు.ఇటీవల తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి అనుచరులు పవన్ అనే దళిత యువకుడిపై విచక్షణారహితంగా దాడి చేయడమే కాకుండా, దాడి వీడియో తీసి పవన్ తండ్రికి పంపించి పైశాచిక ఆనందం పొందడం అమానుషమన్నారు.వైసీపీ నాయకులు తమ చర్యల ద్వారా తాము, తమ పార్టీ దళిత వ్యతిరేకమని నిరూపించుకున్నారని విమర్శించారు.