Vijayawada: జగన్ వస్తే అంతే
ABN , Publish Date - Dec 19 , 2025 | 04:48 AM
బారికేడ్లను తోసేశారు. రోప్లతో అడ్డుకున్న పోలీసులను నెట్టేశారు. మాజీ సీఎం జగన్ పర్యటనలో వైసీపీ కార్యకర్తల వీరంగం సృష్టించారు.
బెజవాడ అంబేడ్కర్ స్మృతివనం వద్ద వైసీపీ కార్యకర్తల వీరంగం
విజయవాడ, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): బారికేడ్లను తోసేశారు. రోప్లతో అడ్డుకున్న పోలీసులను నెట్టేశారు. మాజీ సీఎం జగన్ పర్యటనలో వైసీపీ కార్యకర్తల వీరంగం సృష్టించారు. కోటి సంతకాల పత్రాలను గురువారం విజయవాడలోని లోక్భవన్లో గవర్నర్కు అందజేసే సందర్భంగా హంగామా చేశారు. జగన్ కారు మొదట అంబేడ్కర్ స్మృతివనంలోకి రాగానే కార్యకర్తలు చుట్టుముట్టారు. దీంతో అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేయకుండా వచ్చిన మార్గంలోనే వెనుదిరిగారు. కార్యకర్తల కోలాహలంతో జగన్ పాదయాత్రను విరమించుకుని కారులోనే లోక్భవన్కు వెళ్లారు. ఆయన కారుకు ముందు రెండు ఎస్కార్ట్ వాహనాలు ఉన్నాయి. అంబేడ్కర్ స్మృతివనం బయట ఎస్కార్ట్ వాహనాలను ఆపేసి జగన్ వాహనాన్ని లోక్భవన్ వద్దకు పంపాలని పోలీసులు భావించారు. వెనుక జగన్ వాహనం ఆగిపోవడంతో ఎస్కార్ట్ వాహనాలను పోలీసులు వదిలారు. ఈ క్రమంలో కార్యకర్తలు అక్కడున్న బారికేడ్లను, పోలీసులను తోసుకుని ముందుకు వెళ్లారు. సరిగ్గా స్టేట్ గెస్ట్హౌస్ దగ్గర ఈ పరిస్థితి కనిపించింది.