YS Sharmila: నాడు మట్టి కొట్టారు... నేడు సున్నం కొట్టడానికి వస్తున్నారు
ABN , Publish Date - Apr 18 , 2025 | 04:55 AM
పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రధాని మోదీ అమరావతి మీద వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, మోదీపై తీవ్ర ఆరోపణలు చేశారు.

అమరావతిపై చిత్తశుద్ధి ఉంటే తొమ్మిదేళ్లుగా గాడిదలు కాస్తున్నారా?
ప్రధాని మోదీపై షర్మిల మండిపాటు
అమరావతి, ఏప్రిల్ 17(ఆంధ్రజ్యోతి): ‘చెంబుడు నీళ్లు, గుప్పెడు మట్టి... ఇదే అమరావతికి ప్రధాని మోదీ చేసిన సాయం. ఆనాడు గాలి మోటార్లో తిరిగి ఆంధ్రుల నెత్తిమీద మట్టి కొట్టారు. ఇప్పుడు మళ్లీ సున్నం కొట్టడానికి వస్తున్నారు. నిజంగా అమరావతిపై మోదీకి చిత్తశుద్ధి ఉంటే తొమ్మిదేళ్లుగా గాడిదలు కాశారా?’ అంటూ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. గురువారం ఎక్స్ వేదికగా ఆమె స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీ వైఖరిని తీవ్రంగా తప్పు పట్టిన ఆమె... విభజన హామీలన్నింటినీ అమలు చేస్తామని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ‘‘ఆత్మగౌరవం అమరావతిని ‘మోదీ శంకుస్థాపనల ప్రాజెక్టు’గా మార్చేశారు. రాజధాని నిర్మాణంపై బీజేపీ చేస్తున్నది ఘరానా మోసం. రాష్ట్రానికి చేసింది ద్రోహం. పోలవరం ఎత్తును తగ్గించి తీరని అన్యాయం చేసి... రూ.15 వేల కోట్లు అప్పు ఇచ్చి రాజధానిని ఉద్ధరించినట్లు గొప్పలు చెప్పడం సిగ్గుచేటు. రాజఽధాని పనులపై ఒక్కనాడైనా బాధ్యతగా అడిగారా? గత వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడుతుంటే వేడుక చూసింది మీరు కాదా? ఇది తప్పని మీ దత్తపుత్రుడిని ఎందుకు వారించలేదు? ఢిల్లీని మించిన రాజధానిని కట్టిస్తామని ఇచ్చిన హామీని మరచిపోయారా? ఇచ్చిన హామీలన్నీ బుట్టదాఖలు చేసి ఇప్పుడు మళ్లీ ఏముఖం పెట్టుకుని వస్తున్నారో సమాధానం చెప్పాలి. ఏపీ నూతన రాజధాని నిర్మాణానికి కేంద్రమే పూర్తి నిధులు ఇవ్వాలి. పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి. పోలవరం ప్రాజెక్టు ఎత్తు 45.72 మీటర్లా..? లేక 41.15 మీటర్లా? మోదీ క్లారిటీ ఇవ్వాలి. వైజాగ్ స్టీల్ప్లాంట్ సెయిల్లో విలీనం, కడప ఉక్కు నిర్మాణం, పారిశ్రామిక కారిడార్ వంటి పెండింగ్ విభజన హామీలన్నింటిపై మీ వైఖరి తేల్చాలి’’ అని షర్మిల డిమాండ్ చేశారు.