BJP State President Madhav: హైందవ ధర్మంపై వైఎస్ కుటుంబం నిత్యం దాడి
ABN , Publish Date - Sep 30 , 2025 | 05:24 AM
హైందవ ధర్మంపై మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి కుటుంబం నిరంతరం దాడి చేస్తూనే ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఆరోపించారు.
జగన్ పాలనలో టీటీడీలో అక్రమాలు: మాధవ్
టీటీడీ నిధులతో దేవాలయాలు నిర్మిస్తే షర్మిలకేంటి ఇబ్బంది అని నిలదీత
న్యూఢిల్లీ, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): హైందవ ధర్మంపై మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి కుటుంబం నిరంతరం దాడి చేస్తూనే ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఆరోపించారు. వైఎస్ కుటుంబం మొత్తం హిందూ మతానికి, భారతీయుల ఆకాంక్షలకు వ్యతిరేకమని విమర్శించారు. టీటీడీ నిధులతో 5వేల దేవాలయాలు నిర్మాణం చేపడతామని సీఎం చంద్రబాబు ప్రకటిస్తే ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తప్పుపట్టడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. ఏపీభవన్లో సోమవారం మాధవ్ మీడియాతో మాట్లాడారు. టీటీడీ నిధులతో దేవాలయాలు నిర్మాణం చేస్తే మీకేంటి ఇబ్బంది? అని షర్మిలను మాధవ్ నిలదీశారు. షర్మిల వ్యాఖ్యలపై సోనియా, రాహుల్గాంధీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. షర్మిల వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీసేవిధంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25, 26 ప్రకారం ప్రతి మతపరమైన సంస్థ తన నిధులను ఆ మత ప్రయోజనాలకే వినియోగించుకోవడానికి పూర్తి హక్కు ఉందని తెలిపారు. అందువల్ల, టీటీడీ నిధులతో ఆలయ నిర్మాణాలు చేపట్టడం రాజ్యాంగబద్ధం, చట్టబద్ధమని మాధవ్ అన్నారు. హిందూ సమాజ విశ్వాసానికి కేంద్రబిందువైన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వైఎస్ కుటుంబం పదే పదే అవమానపరచడం పరిపాటిగా మారిందని మండిపడ్డారు. వైఎస్ జగన్ పాలనలో పరకామణి హుండీ నిధులను దోచుకుని 100 కోట్ల వరకు రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో పెట్టారని, దీనికి సాక్ష్యాలు కూడా ఉన్నాయని ఆరోపించారు. జగన్ అవినీతి పాలనపై విచారణ జరుగుతుందని మాధవ్ చెప్పారు. జగన్ మళ్లీ అధికారంలోకి వస్తామంటూ పోలీసులను, కాంట్రాక్టర్లను బెదిరించడం సరికాదన్నారు.
జగన్ వైఖరిని అన్ని వర్గాల ప్రజలూ ఖండించాలని మాధవ్ పిలుపునిచ్చారు. జగన్ పాలనలో పవిత్రమైన లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు వాడడం, క్రైస్తవుడిని చైర్మన్గా నియమించడం, బియ్యం, పంచదార, నెయ్యి, జీడిపప్పు వంటి వస్తువుల కొనుగోళ్లలో అవినీతి, శ్రీవాణి నిధులను దుర్వినియోగం, ఇంజనీరింగ్ పనులపేరిట నిధులను దుర్వినియోగం, విదేశీ కరెన్సీని దారిమళ్లింపు, అక్రమ నియామకాలు, అక్రమంగా లక్ష బ్రేక్ దర్శనాల కేటాయింపు వంటి వాటితో టీటీడీ ప్రతిష్ఠను దిగజార్చారని మాధవ్ ఆరోపించారు.