Nara Lokesh: యువతలో వ్యాపార నైపుణ్యాభివృద్ధి
ABN , Publish Date - Jun 12 , 2025 | 04:14 AM
యువతలో వ్యాపార నైపుణ్యం, స్టార్టప్ ఎకో సిస్టమ్ అభివృద్ధిలో సహకారం కోసం ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ సైయెంట్, అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ)తో రాష్ట్ర ప్రభుత్వం త్రైపాక్షిక ఒప్పందం చేసుకుంది.
సైయెంట్, ఏఐసీటీఈల సహకారం
లోకేశ్ సమక్షంలో త్రైపాక్షిక ఒప్పందం
అమరావతి, జూన్ 11(ఆంధ్రజ్యోతి): యువతలో వ్యాపార నైపుణ్యం, స్టార్టప్ ఎకో సిస్టమ్ అభివృద్ధిలో సహకారం కోసం ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ సైయెంట్, అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ)తో రాష్ట్ర ప్రభుత్వం త్రైపాక్షిక ఒప్పందం చేసుకుంది. మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి లోకేశ్ సమక్షంలో బుధవారం ఉండవల్లిలోని నివాసంలో ఈ అవగాహన ఒప్పందం కుదిరింది. నగర ఆధారిత ఇన్నోవేషన్లు, క్లస్టర్లు ప్రారంభించేందుకు సైయెంట్, ఏఐసీటీఈ సహకారం అందిస్తాయి. విశాఖపట్నం నుంచి సహకారాన్ని ప్రారంభిస్తారు. ఈ ఒప్పందంతో విద్యా సంస్థలు, పరిశ్రమలు, పెట్టుబడిదారుల మధ్య పరస్పర సహకారాన్ని పెంపొందించేలా చేస్తారు. సృజనాత్మకత, పరిశోధన అంశాలపై ఐ-కేఆర్, ఐ-కేఫ్ అనే కేంద్రాలను ప్రారంభిస్తారు. క్లస్టర్ స్థాయి సదస్సులు, మార్గనిర్దేశ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ ఒప్పందం అమలు కోసం నోడల్ విభాగంగా నైపుణ్యాభివృద్ధి సంస్థ పనిచేయనుంది. ఈ కార్యక్రమంలో ఉన్నతాధికారులు గణేశ్ కుమార్, భరత్ గుప్తా, సైయెంట్ ఫౌండర్ చైర్మన్ బీవీఆర్ మోహన్రెడ్డి, ఏఐసీఈటీ వైస్ చైర్మన్ అహయ్ జేరే, ఇతర ప్రతినిధులు పీఎన్ఎ్సవీ నరసింహం, దీపన్ సాహు పాల్గొన్నారు.