Governor Abdul Nazir: విధాన నిర్ణయాల్లో భాగస్వామ్యం
ABN , Publish Date - Sep 16 , 2025 | 04:55 AM
కేంద్ర, రాష్ట్రాలు తీసుకునే విధాన నిర్ణయాల్లో మహిళలకు సమాన భాగస్వామ్యం ఉండాలని రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆకాంక్షించారు. మహిళా సాధికారతా..
కేంద్ర, రాష్ట్రాలు తీసుకునే విధాన నిర్ణయాల్లో మహిళలకు సమాన భాగస్వామ్యం ఉండాలని రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆకాంక్షించారు. మహిళా సాధికారతా సదస్సు ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం సీట్ల రిజర్వేషన్ కల్పించే ‘నారీ శక్తి వందన’ బిల్లు-2023 పార్లమెంటులో ఆమోదం పొందిందని గుర్తు చేశారు. నియోజకవర్గాల పునర్విభజన, కుల గణన తర్వాత ఈ చట్టం అమల్లోకి వస్తుందన్నారు. నారీశక్తి చట్టం అమల్లోకి వస్తే విధాన నిర్ణయాలలో మహిళలకు సమాన భాగస్వామ్యం కల్పించినట్టు అవుతుందన్నారు. మహిళా సాధికారత అనేది మహిళలకు మాత్రమే పరిమితం కాదని.. సమాజాన్ని సమానత్వం, సమగ్ర పౌరసత్వం వైపు నడిపించే మార్గమవుతుందన్నారు. వేదకాలంలో మహిళలకు ఉన్న గౌరవం, ఆధ్యాత్మిక, మేధోపరమైన విద్యావకాశాలు చాలా విశిష్టమైనవని తెలిపారు. పూర్వం సాహిత్యం, సమాజంలో మహిళలకు ప్రాధాన్యత ఉండేదని, కవయిత్రి మొల్ల రచించిన రామాయణం తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. భారత రాజ్యాంగం మహిళలకు అన్ని రంగాల్లోనూ సమాన అవకాశాలను, హక్కులను కల్పించిందన్నారు.