Women Empowerment: ఉపాధి మార్గంలో మహిళలు రయ్.. రయ్
ABN , Publish Date - Aug 26 , 2025 | 06:23 AM
ఆర్థిక సమస్యలతో ఇల్లు గడవడం లేదు.. నేనూ కుటుంబానికి ఆసరాగా ఉంటే బావుండును అని ఆలోచిస్తున్న పట్టణ ప్రాంత మహిళలకు మెప్మా(మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్) చేదోడుగా నిలుస్తోంది.
మెప్మా సహకారం, ర్యాపిడో చొరవ
సబ్సిడీపై పట్టణ మహిళలకు టూ, త్రీ వీలర్లు
9 నగరాల్లో వెయ్యికిపైగా లబ్ధిదారులు వాహనాలతో రైడ్లు వేస్తూ ఆదాయార్జన
మూడు నెలల్లో రూ. 35 లక్షల ఆదాయం
మహిళా సాధికారతకు కృషి: లోకేశ్
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
ఆర్థిక సమస్యలతో ఇల్లు గడవడం లేదు.. నేనూ కుటుంబానికి ఆసరాగా ఉంటే బావుండును అని ఆలోచిస్తున్న పట్టణ ప్రాంత మహిళలకు మెప్మా(మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్) చేదోడుగా నిలుస్తోంది. డ్వాక్రాతో దేశానికి ఆదర్శంగా నిలిచిన రాష్ట్ర మహిళలు, ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలతో ప్రయాణికుల గమ్య స్థానాలకు చేరుస్తూ ఆర్జిస్తున్నారు. మెప్మా, ర్యాపిడో సహకారంతో స్వయం ఉపాధి పొందుతున్నారు. ఈ ఉపాధి కార్యక్రమానికి మా ర్చి 8న, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తొలి అడుగు పడింది. అదే రోజున సీఎం చంద్రబాబు ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించడంతో మొదలైంది. ఒక కుటుంబం-ఒక వ్యాపారవేత్త కింద మెప్మా సంస్థ ర్యాపిడో ద్వారా మహిళలకు ఎలక్ట్రిక్ వాహనాలు అందించింది. అందులో తొలి దశలో తొమ్మిది పట్టణాల్లో వెయ్యి మంది లబ్ధిదారులకు రుణ సౌకర్యం కల్పించారు. వీటిలో విశాఖపట్నంలో 400 వాహనాలు, విజయవాడలో 400, నెల్లూరు, గుంటూరులో 50 చొప్పున, కర్నూలు, తిరుపతి, కాకినాడ, రాజమండ్రిలో 25 వాహనాలు చొప్పున మహిళలకు అందజేశారు. వాటిలో 760 ఎలక్ట్రిక్ టూ-వీలర్లు కాగా, 240 ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లు ఉన్నాయి. మొత్తంగా ఇప్పటి వరకు వెయ్యికి పైగా కుటుంబాలు లబ్ధి పొందగా, వారిలో 688 మంది ర్యాపిడోలో నమోదయ్యారు.
డ్వాక్రా, మెప్మా సహకారంతో.. వాహనాలు కొనుగోలు చేసేందుకు అవసరమైన బ్యాంకు రుణాలు డ్వాక్రా సంఘాల మహిళల పేర్లతో మంజూరయ్యాయి. డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి వారి కుటుంబ సభ్యులు వాహనం నడిపేందుకు అవకాశం కల్పించారు. అవసరమైన ప్రాజెక్టు రిపోర్టులను మెప్మా సిద్ధం చేసి, జాతీయ బ్యాంకుల ద్వారా రుణాలు పొందేందుకు సహకారం అందించింది. ఈ క్రమంలో ర్యాపిడో సైతం మహిళలకు సాధికారత అందించడంలో భాగస్వామ్యమైంది. కొత్తగా చేరిన వారికి ప్లాట్ఫామ్ ఫీజులో మూడు నుంచి నాలుగు నెలల మినహాయింపు ఇచ్చింది. అలాగే తొలి సంవత్సరం టూ-వీలర్, త్రీవీలర్ యజమానులకు నెలకు రూ. వెయ్యి చొప్పున ఈఎంఐ మొత్తాన్ని సాయంగా అందించారు. దీంతో ర్యాపిడో నడపటం ప్రారంభించిన గృహిణులకు తొలిరోజు నుంచే ఆదాయం ప్రారంభమైంది. అలాగే ఈఎంఐ, ఇంధన భారం కూడా తగ్గింది.
రూ. 16 వేల వరకు ఆదాయం
మహిళా సాధికారత కోసం ప్రభుత్వం ఎలక్ట్రిక్ స్కూటర్, ఆటోలకు రూ. 12,300 నుంచి రూ. 36 వేల వరకు సబ్సిడీ అందిస్తోంది. ర్యాపిడోలో వాహనం నడుపుతున్న మహిళలు నెలకు సుమారు రూ. 13 నుంచి రూ. 16 వేల వరకు ఆదాయం ఆర్జిస్తున్నారు. మే, జూన్, జూలై నెలల్లో రికార్డు స్థాయిలో మహిళలు 45 వేల రైడ్లు పూర్తి చేశారు. మొత్తంగా రూ.35 లక్షల ఆదాయం సంపాదించారు. మహిళల విజయగాథల స్ఫూర్తి తో రాబోయే ఏడాదిలో మరో 4,800 మందికి ఈ పథకాన్ని విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది.
మహిళల విజయగాథలు ఇవీ..
విజయవాడకు చెందిన వడ్లపడి గ్లోరీ మంజు మార్చిలో ప్రభుత్వ సబ్సిడీతో స్కూటర్ కొని ర్యాపిడో నడపడం ప్రారంభించారు. ప్రస్తు తం నెలకు రూ.10 వేల వరకు సంపాదిస్తున్నారు. ఈఎంఐ చెల్లిస్తూ, కొంత సొమ్మును పొదుపు చేస్తున్నానని మంజు చెబుతున్నా రు. విజయవాడలోని కండ్రిక ప్రాంతానికి చెందిన మాధవి తన భర్తకు పక్షపాతం రావడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నా రు. భర్తకు వచ్చే రూ.6 వేల దివ్యాంగ పింఛన్ మందులకే సరిపోతుండటంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఈ సమయం లో మెప్మా ద్వారా రుణం పొంది టూ-వీలర్ కొన్నానన్నారు. నెలకు రూ.12 వేల వరకూ సంపాదిస్తున్నా అని చెప్పారు. విజయవాడకు చెందిన భవానీ భర్త అనారోగ్యం కారణంగా ఇంటికే పరిమితమయ్యారు. ఇంటి బాధ్యతను తలకెత్తుకున్న భవానీ.. మెప్మా అధికారుల సహకారంతో రూ.1.20 లక్షల విలువైన ఈ-స్కూటర్ కొనుగోలు చేసి ర్యాపిడోలో చేరారు. ప్రస్తుతం రోజుకు రూ. 500-700 వరకు సంపాదిస్తున్నారు.
ఇది ఆరంభం మాత్రమే: లోకేశ్
మహిళల సాధికారతే ప్రభుత్వ ఆలోచన అని మంత్రి నారా లోకేశ్ అన్నారు. తెలుగుదేశం పార్టీ మహిళలకు అన్ని రంగాల్లో ప్రోత్సాహాన్ని ఇస్తోందన్నారు. ర్యాపిడో కలిసి రాష్ట్రంలో వెయ్యి మందికి పైగా మహిళలు స్వయం ఉపాధి సాధించినందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇది ఆరంభం మాత్రమేనని, రాబోయే రోజుల్లో మహిళా సాధికారతకు మరింత కృషి చేస్తామని మంత్రి వెల్లడించారు.