Nara Lokesh: అనుమతులు తీసుకునే కాళేశ్వరం కట్టారా
ABN , Publish Date - Aug 01 , 2025 | 03:12 AM
సముద్రంలోకి వృధాగా వెళ్లే వరద జలాలనే తాము బనకచర్ల కోసం వాడుకుంటామని.. అందులో తప్పేముందని మంత్రి లోకేశ్ ప్రశ్నించారు.
తెలంగాణకో నీతి.. మాకో నీతా?
సముద్రంలో కలిసే వృథా జలాలను బనకచర్లకు వాడుకుంటే తప్పేంటి?
తెలంగాణకు వచ్చే నష్టమేంటి?
బనకచర్లపై లోకేశ్ ప్రశ్న
సముద్రంలోకి వృధాగా వెళ్లే వరద జలాలనే తాము బనకచర్ల కోసం వాడుకుంటామని.. అందులో తప్పేముందని మంత్రి లోకేశ్ ప్రశ్నించారు. తెలంగాణను దాటి దిగువన సముద్రంలో కలిసిపోయే గోదావరి జలాలను వాడుకుంటే ఆ రాష్ట్రానికి వచ్చే నష్టమేమిటని అడిగారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు తీసుకునే తెలంగాణ కట్టిందా అని ప్రశ్నించారు. ‘స్టడీ చేసే దానిని కట్టారా? అక్కడో రూలు .. ఇక్కడో రూలా? తెలంగాణకో నీతి.. ఆంధ్రాకో నీతా? ఇది ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టడం కాదా? బనకచర్ల పథకంలో తప్పెక్కడుంది? తెలంగాణ నుంచి నీటిని ఎత్తిపోసి దానికి వాడుకోవడం లేదు కదా! కాళేశ్వరం ప్రాజెక్టుకు చిల్లుపెట్టి తోడేయడం లేదు కదా! ఒకవేళ ఒక ఏడాది వరద రాకపోతే మిగులు జలాలను బనకచర్ల కోసం వాడుకోం’ అని స్పష్టం చేశారు. బనకచర్లపై చర్చ జరగాలని కోరుకుంటున్నానని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఏపీ ఎప్పుడూ అభ్యంతరం వ్యక్తం చేయలేదని గుర్తుచేశారు. టీడీపీ తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేయదన్నారు. తెలుగు ప్రజలందరి కోసం తాము మాట్లాడతామని తెలిపారు.