Share News

CM Chandrababu Naidu: విశాఖ ఎకనమిక్‌ రీజియన్‌ అభివృద్ధికి మాస్టర్‌ ప్లాన్‌

ABN , Publish Date - Nov 11 , 2025 | 05:51 AM

శ్రీకాకుళం నుంచి కోనసీమ వరకూ ఉన్న విశాఖ ఎకనమిక్‌ రీజియన్‌ (వీఈఆర్‌) అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

CM Chandrababu Naidu: విశాఖ ఎకనమిక్‌ రీజియన్‌ అభివృద్ధికి మాస్టర్‌ ప్లాన్‌

  • ‘వీఈఆర్‌’ రాష్ట్రానికి గ్రోత్‌ హబ్‌గా ఉండాలి

  • పోర్టుల ద్వారా రవాణా భారీగా పెరగాలి

  • ఈ రీజియన్‌లో 15 ఉత్పాదక హబ్‌లకు అవకాశం

  • సుమారు 10 లక్షల కోట్ల మేర పెట్టుబడుల అంచనా: సమీక్షలో సీఎం

అమరావతి, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం నుంచి కోనసీమ వరకూ ఉన్న విశాఖ ఎకనమిక్‌ రీజియన్‌ (వీఈఆర్‌) అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఆయా ప్రాంతాల్లో వచ్చే పెట్టుబడులు, పరిశ్రమలు, ప్రాజెక్టుల కోసం అవసరమైన విధానాలు రూపొందించాలని సూచించారు. విశాఖ ఎకనమిక్‌ రీజియన్‌ అభివృద్ధిపై సోమవారం సచివాలయంలో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి సీఎస్‌ కె.విజయానంద్‌తో పాటు ఆర్థిక, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన, పర్యాటక, ఐటీ, మున్సిపల్‌, పరిశ్రమలు, వ్యవసాయ, ప్రణాళికా శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. వీఈఆర్‌ ప్రాంతాన్ని రాష్ట్రానికి గ్రోత్‌ హబ్‌గా తీర్చిదిద్దడంపై ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. శ్రీకాకుళం నుంచి కోనసీమ వరకూ ఉన్న వివిధ జిల్లాలను వీఈఆర్‌గా అభివృద్ధి చేసేందుకు స్థానికంగా ఉన్న ఆర్థిక వ్యవస్థ, పెట్టుబడులు, ప్రజల జీవన ప్రమాణాలు, సుస్థిరాభివృద్ధి తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని ఎకనమిక్‌ మాస్టర్‌ ప్లాన్‌ తయారు చేయాలని సూచించారు. ఏడు అంశాల ఆధారంగా వీఈఆర్‌ గ్లోబల్‌ ఎకనమిక్‌ హబ్‌గా మారుతుందని సీఎం పేర్కొన్నారు. పోర్టుల ద్వారా రవాణాతో పెద్దఎత్తున లావాదేవీలు జరగాల్సి ఉందన్నారు. పోర్టుల నుంచి ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, ఒడిశా, మధ్యప్రదేశ్‌ లాంటి ప్రాంతాలకు చెందిన కార్గోను కూడా రవాణా జరిగేలా చూడాలని సూచించారు. మూలపేట పోర్టు నుంచి దుగరాజపట్నం పోర్టు వరకూ షిప్‌ బిల్డింగ్‌ కేంద్రాలు ఏర్పాటయ్యేలా చర్యలు ఉండాలని పేర్కొన్నారు.


ప్రస్తుతం ఉత్తర, దక్షిణాది రాష్ట్రాలను కలుపుతున్న ఏపీ ఇక ఈస్ట్‌వెస్ట్‌ కారిడార్‌గానూ మారాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. 12-15 ఉత్పాదక హబ్‌లు ఉండేలా వీఈఆర్‌ రూపాంతరం చెందుతుందన్నారు. ప్రత్యేకించి ఈ రీజియన్‌లో క్లీన్‌, గ్రీన్‌ ఎనర్జీ ఉత్పత్తి ప్రాజెక్టులపై దృష్టి సారించాలని సూచించారు. విశాఖ లాంటి ప్రాంతాలు తర్వాతి తరం ఐటీ డేటా సెంటర్‌, ఏఐ ఇన్నొవేషన్‌ కేంద్రంగా మారుతున్నాయని.. ఈ రీజియన్‌లోని ఇతర ప్రాంతాలు జాతీయ, అంతర్జాతీయ హెల్త్‌కేర్‌ హబ్‌గా మార్చాల్సి ఉందన్నారు. అలాగే పట్టణ ప్రాంతాల్లో స్లమ్‌ క్లస్టర్‌ అభివృద్ధి కోసం ప్రత్యేక విధానం రూపొందించాలని చంద్రబాబు ఆదేశించారు.


రైల్వేలైన్లతో పోర్టుల అనుసంధానం

విశాఖ ఎకనమిక్‌ రీజియన్‌లో 100-115 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.8.8 లక్షల కోట్ల నుంచి రూ.10.1 లక్షల కోట్ల మధ్య) పెట్టుబడులు వచ్చేందుకు ఆస్కారం ఉందని సీఎం పేర్కొన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ప్రకటించిన వివిధ ప్రాజెక్టుల ద్వారా 15 బిలియన్‌ డాలర్ల మేర, ప్రైవేటు, కార్పొరేట్‌ సంస్థల ద్వారా 85 బిలియన్‌ డాలర్ల మేర పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. ఈ ప్రాంతంలోని పోర్టులను రైల్వే లైన్లతో అనుసంధానం చేయనున్నట్లు వెల్లడించారు. త్వరలోనే ఈ మార్గంలోని రైల్వే మార్గాలను నాలుగు లేన్లుగా విస్తరించేందుకు కేంద్రం ప్రణాళికలు చేస్తోందని తెలిపారు. ఈ జిల్లాలో వచ్చే ప్రాజెక్టులను క్లస్టర్‌ అప్రోచ్‌తో గుర్తించి అభివృద్ధి చేయాలని ఆయా శాఖల అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ఆరోగ్య సంరక్షణ పాలసీతో మెడికల్‌ టూరిజాన్ని లింక్‌ చేయాలని సూచించారు. సీఎం అధ్యక్షతన వీఈఆర్‌ అథారిటీ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని అధికారులు ప్రతిపాదించారు. దీనిపై స్పందించిన సీఎం.. వీఈఆర్‌ అభివృద్ధికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక తయారు చేసి అమలు చేయాలని ఆదేశించారు.

Updated Date - Nov 11 , 2025 | 05:53 AM