Vijayawada Utsav: విజయవాడ ఉత్సవ్కు జాతీయ గుర్తింపు
ABN , Publish Date - Sep 30 , 2025 | 06:17 AM
విజయవాడ ఉత్సవ్ జాతీయస్థాయిలో గుర్తింపు పొందిందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు
బాబు పాలనలో కళల పరిరక్షణకు ప్రాధాన్యం
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడి
విజయవాడ సిటీ, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): ‘విజయవాడ ఉత్సవ్’ జాతీయస్థాయిలో గుర్తింపు పొందిందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. పున్నమి ఘాట్లో నిర్వహిస్తున్న ‘విజయవాడ ఉత్సవ్’ను సోమవారం ఆయన ఎంపీ కేశినేని శివనాథ్తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. పండుగలు ప్రజలను ఐక్యం చేసి సంస్కృతీ సంప్రదాయాలను పరిరక్షిస్తాయన్నారు. ‘విజయవాడ ఉత్సవ్’ ద్వారా అన్ని వర్గాల ప్రజలను ఐక్యం చేశారని నిర్వాహకులను కొనియాడారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల నుంచి కళాకారులను తీసుకు వచ్చి కళావైభవానికి ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. మైసూరు, కలకత్తా ఉత్సవాలను సైతం విజయవాడ ఉత్సవ్ అధిగమించిందని కొనియాడారు. సంక్షేమ, అభివృద్థి పాలనలో సీఎం చంద్రబాబు కళల పరిరక్షణకు సైతం ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ.. కళలు, సంస్కృతికి విజయవాడ రాజధాని అని తెలిపారు. మొత్తం 3 వేల మంది కళాకారులతో అక్టోబరు 2న బందరు రోడ్డులో ‘మెగా కార్నివాల్’ నిర్వహించి ప్రపంచ రికార్డు నెలకొల్పుతామని ఎంపీ తెలిపారు.