Vijayawada: అంతా పీఎస్సార్ కనుసన్నల్లోనే
ABN , Publish Date - May 03 , 2025 | 05:22 AM
కాదంబరి జెత్వానీ కేసులో విజయవాడ డీసీపీ విశాల్ గున్ని వాంగ్మూలం ఇచ్చారు. పీఎస్ఆర్ ఆదేశాల మేరకే ఈ కేసులో న్యాయహేతువులు, సాక్ష్యాలను వదిలి బెయిల్ ఇవ్వరాదని సీఐడీ తరఫున కోర్టులో వాదనలు వినిపించగా, కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్ కోసం బెజవాడలో అన్యాయంగా జెత్వానీపై కేసు
ఈ దశలో బెయిలిస్తే పీఎస్సార్ సాక్ష్యాలు తారుమారు చేస్తారు
సీఐడీ తరఫున ప్రాసిక్యూషన్ వెల్లడి
విజయవాడ, మే 2 (ఆంధ్రజ్యోతి): ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో తామంతా అప్పటి నిఘా విభాగం చీఫ్ పీఎ్సఆర్ ఆంజనేయులు ఆదేశాలతోనే పనిచేసినట్లు విజయవాడ డీసీపీగా పనిచేసిన విశాల్ గున్ని వాంగ్మూలం ఇచ్చారని ప్రాసిక్యూషన్ జాయింట్ డైరెక్టర్ రాజేంద్రప్రసాద్ కోర్టుకు విన్నవించారు. బెయిల్ కోసం, జైలులో సదుపాయాల కల్పనకు సంబంధించి పీఎస్సార్ దాఖలు చేసిన పిటిషన్లపై సీఐడీ తరఫున ఆయన శుక్రవారం విజయవాడ మూడో అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో వాదనలు వినిపించారు. ముంబైలో పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్పై జెత్వానీ పెట్టిన కేసులో.. ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చేలా చేసేందుకు విజయవాడలో అన్యాయంగా ఆమెపై కేసు పెట్టారని తెలిపారు. ముంబై కేసులో ఆమె అక్కడి కోర్టుకు వెళ్లకుండా అడ్డుకోవడానికి.. ఇక్కడ కేసు నమోదు చేసి జైలులో బంధించారని వెల్లడించారు. ఈ మొత్తం వ్యవహారమంతా పీఎస్సార్ కనుసన్నల్లోనే సాగిందన్నారు. దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని.. ఈ పరిస్థితుల్లో ఆయనకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేస్తారని తెలిపారు. వాదనల అనంతరం న్యాయాధికారి టి.తిరుమలరావు తీర్పును తొమ్మిదో తేదీకి రిజర్వ్ చేశారు.
ఇవి కూడా చదవండి..