విజయ డెయిరీ డైరెక్టర్ల ఎన్నిక ఏకగ్రీవం
ABN , Publish Date - Aug 27 , 2025 | 01:34 AM
కృష్ణాజిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార సమితి (విజయ డెయిరీ) పాలకవర్గంలో డైరెక్టర్ల ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయి. మూడు డైరెక్టర్ పదవులకు నాలుగు నామినేషన్లు వచ్చాయి. మంగళవారం ఒక అభ్యర్థి తన నామినేషన్ను ఉపసంహరించుకోవడంతో పోటీలో ముగ్గురు అభ్యర్థులే మిగిలారు. మూడు పదవులకు ముగ్గురు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ఎల్.గురునాఽథం ప్రకటించారు.
- డైరెక్టర్లుగా వెంకట నగేశ్, రామారావు, వాణిశ్రీ
- అభినందలు తెలిపిన పాలకవర్గం, అధికారులు
చిట్టినగర్, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి):
కృష్ణాజిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార సమితి (విజయ డెయిరీ) పాలకవర్గంలో డైరెక్టర్ల ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయి. మూడు డైరెక్టర్ పదవులకు నాలుగు నామినేషన్లు వచ్చాయి. మంగళవారం ఒక అభ్యర్థి తన నామినేషన్ను ఉపసంహరించుకోవడంతో పోటీలో ముగ్గురు అభ్యర్థులే మిగిలారు. మూడు పదవులకు ముగ్గురు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ఎల్.గురునాఽథం ప్రకటించారు. జనరల్ కేటగిరిలోని రెండు పదవులకు పెడన మండలం పెనుమల్లికి చెందిన అర్జా వెంకట నగేశ్, వత్సవాయి మండలం భీమవరానికి చెందిన యింజం రామారావు, మహిళా కేటగిరిలో విస్సన్నపేటకు చెందిన నెక్కళపు వాణిశ్రీ విజయ డెయిరీ డైరెక్టర్లుగా ఎన్నికయ్యారు. వీరికి ఎన్నికల అధికారి గురునాథం ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. తొలుత మూడు డైరెక్టర్ పదవులకు ఐదుగురు అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. పరిశీలనలో తిరువూరు మండలం చిట్టేలకు చెందిన బోయపాటి సుశీల నామినేషన్ తిరస్కరణకు గురవ్వగా, ముష్టికుంట్లకు చెందిన గద్దె రంగారావు తన నామినేషన్ను మంగళవారం ఉపసంహరించుకున్నారు. ఈ సందర్భంగా విజయ డెయిరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు నూతన డైరెక్టర్లు నగేశ్, రామారావు, వాణిశ్రీని సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ లక్షా యాభై వేల మంది పాడి రైతులకు తమ పాలకవర్గం ప్రాతినిధ్యం వహిస్తుందన్నారు. పాడి రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నట్టు వివరించారు. అందువల్లే ప్రతిసారీ ఎన్నికలు పోటీ లేకుండా ఏకగ్రీవం అవుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ కొల్లి ఈశ్వరబాబు, డైరెక్టర్లు వేమూరి సాయి వెంకట రమణ, చలసాని చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.