Vice President Radhakrishnan: భారత్లో పెట్టుబడులకు ఇదే సరైన సమయం
ABN , Publish Date - Nov 15 , 2025 | 07:28 AM
ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయమని ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్...
విశాఖ సదస్సులో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
విశాఖపట్నం, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయమని ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ విశాఖ పెట్టుబడుల సదస్సులో పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ సంస్కరణలు తీసుకొస్తోందని చెప్పారు. ఇక్కడ అమలుచేస్తున్న ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం ప్రపంచంలోనే అత్యుత్తమంగా నిలుస్తోందన్నారు. కార్మిక రంగం, పన్నుల రంగం, మౌలిక సదుపాయాల విభాగాల్లో కేంద్రం తీసుకొచ్చిన సంస్కరణలు ఇందుకు దోహదపడ్డాయన్నారు. టెక్నాలజీని వాణిజ్య కార్యకలాపాలతో అనుసంధానించడం ఆర్థిక వ్యవస్థకు మెరుగైన ఫలితాలిస్తోందన్నారు. త్వరలోనే భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందన్నారు. క్లీన్ టెక్నాలజీ ఎగుమతులకు దేశం హబ్గా మారిందన్నారు.