SIT Investigation: కల్తీ నెయ్యి కేసులో వేమిరెడ్డి ప్రశాంతి విచారణ
ABN , Publish Date - Dec 31 , 2025 | 06:21 AM
కల్తీ నెయ్యి కేసులో టీటీడీ పాలకమండలి సభ్యురాలు, నెల్లూరు జిల్లా కోవూరు టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిని సిట్ ప్రశ్నించింది.
నెల్లూరులోని ఆమె నివాసంలో రోజంతా ప్రశ్నించిన సిట్ అధికారులు
తిరుపతి, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): కల్తీ నెయ్యి కేసులో టీటీడీ పాలకమండలి సభ్యురాలు, నెల్లూరు జిల్లా కోవూరు టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిని సిట్ ప్రశ్నించింది. మంగళవారం తిరుపతి నుంచి నెల్లూరులోని ఆమె నివాసానికి వెళ్లిన సిట్ అధికారుల బృందం.. రోజంతా సుదీర్ఘంగా విచారించింది. గత వైసీపీ ప్రభుత్వంలో 4 నెలల పాటు ఆమె టీటీడీలో కొనుగోళ్ల కమిటీ సభ్యురాలిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ కమిటీ విధులు, బాధ్యతల గురించి, పనిచేసే విధానం గురించి అధికారులు ఆమెనడిగి వివరాలు నమోదు చేసుకున్నారు. అలాగే గతంలో టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా అయిన వ్యవహారం మీ దృష్టికి వచ్చిందా అని ప్రశ్నించారు. తాను పర్చేజ్ కమిటీలో కేవలం నాలుగు నెలలే ఉన్నానని.. టీటీడీ కొనుగోళ్ల వివరాలు పెద్దగా తెలియవని ఆమె సమాధానమిచ్చినట్లు తెలిసింది. ఎప్పుడో ఆరున్నరేళ్ల కింద జరిగినవి ఎక్కడ గుర్తుంటాయని ప్రశ్నించినట్లు సమాచారం. ఈ కేసులో ఇప్పటికే టీటీడీ మాజీ చైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డిని సిట్ విచారించిన సంగతి తెలిసిందే. అలాగే లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయి రిమాండులో ఉన్న అప్పటి టీటీడీ ఎక్స్అఫిషియో సభ్యుడు, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డిని కూడా జైల్లోనే ప్రశ్నించారు.